మీడియాకు లీకులిస్తూ డ్రామాలు

()ప్రజల మనోభావాలతో ఆడుకోవడం నిప్పుతో చెలగాటమే
()బాబుకు ప్యాకేజీ విషయం తెలియదనడం రాజకీయ బరితెగింపు
()ఏపీ భౌగోళిక స్వరూపం బాబుకు తెలియపోవడం సిగ్గుచేటు
()మీడియాకు లీకులిస్తూ పోరాడుతున్నట్లు కలరింగ్‌
() ప్రభుత్వ తీరుపై కాకాని గోవర్థన్ రెడ్డి మండిపాటు

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా విషయంలో ప్రజల మనోభావాలతో ఆడుకోవడం నిప్పుతో చెలగాటం ఆడుకోవడమేనని  వైయస్‌ఆర్‌ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఒకపక్క టీడీపీ కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్‌లు గత మూడు రోజులుగా హోదా విషయమై సంప్రదింపులు చేస్తున్నాం.. ఈ రోజు ప్రకటించే అవకాశం ఉందని చెబుతుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాకేమీ తెలియదు, మీడియా వార్తలను చూసి తెలుసుకున్నా అని చెప్పడం బాధాకరమన్నారు. మరో పక్క ఆమోదయోగ్యమైన ప్రకటన వస్తే తప్ప ఢిల్లీకి వెళ్లే పరిస్థితి లేదని బాబు మీడియాతో చెబుతున్నారన్నారు. 

నిన్న జరిగిన క్యాబినెట్‌ మీటింగ్‌లో వచ్చినంత రాబడదామని ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త వచ్చిన తరువాత ...ప్యాకేజీపై నాకేం తెలియదని మాట్లాడడం రాజకీయాల్లో ఇంతకన్నా బరితెగింపు ఉంటుందా అని చంద్రబాబును ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని 70 శాతం ఇస్తామన్నారు కానీ దాన్ని 90 శాతానికి ఒప్పించాం, నియోజకవర్గాల పెంపుపై మాట్లాడాం కేంద్రం సానుకూలంగా స్పందించిందని వార్తలు వస్తుంటే నాకేం తెలియదనే చంద్రబాబు డ్రామాల వెనుక ప్రజల మనోభావాలతో ఆడుకోవడమా కాదా? అని నిలదీశారు. ప్రత్యేక హోదాను సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని కాకాణి మండిపడ్డారు. ప్యాకేజీ వస్తే ఏ విధంగా లూటీ చేయాలనే ఆలోచన తప్ప ఏపీ అభివృద్ధిపై చంద్రబాబుకు ధ్యాసేలేదన్నారు. 

హోదా వస్తే బాబుకు వ్యక్తిగత లబ్ది చేకూరదనే, ప్యాకేజీపై దృష్టిపెట్టారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి సొంత ప్రయోజనాల కోసం పనిచేయడం దుర్మార్గమన్నారు. ఒక పక్క హోదా సంజీవని కాదు, హోదా వచ్చిన రాష్ట్రాలు బాగుపడ్డాయా అని మాట్లాడుతున్నారని, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఏపీ భౌగోళిక స్వరూపం కూడా తెలియకపోవడం సిగ్గుచేటన్నారు. ఉదయం నుంచి ప్యాకేజీ వస్తుందంటూ మీడియాకు లీకులు ఇస్తూ హోదాపై పోరాడుతున్నట్లు చంద్రబాబు కలరింగ్‌ ఇస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలు ప్రస్తావన రాకుండా ఈ విధమైన కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు హక్కుగా భావిస్తున్న ప్రత్యేక హోదాపై నీతి, నిజాయితీతో పోరాడాలని, అవసరమైతే కేంద్రంతో టీడీపీ తెగదెంపులు చేసుకోవాలన్నారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ సీపీ హోదా సాధనే లక్ష్యంగా పోరాటం చేస్తుందని, రానున్న రోజుల్లో మరింత ఉదృతంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
 
కేసునుంచి తప్పించుకునేందుకు కేంద్రంతో మంతనాలు
ఓటుకు కోట్ల కేసు నుంచి భయటపడేందుకు చంద్రబాబు ప్రత్యేక హోదా ముసుగులో కేంద్ర మంత్రులతో సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నాడని కాకాణి ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు మంతనాలు జరుపుతూ హోదా కలరింగ్‌ ఇస్తున్నారని విమర్శించారు. విచారణను ఎదుర్కోకుండా హైకోర్టుకు వెళ్లి బాబు తాత్కాలిక ఉపశమనం పొందారని, ఇంకా చంద్రబాబు మెడకున్న ఉరితాడు ఉచ్చు ఊడిపోలేదన్నారు.  క్యాబినెట్‌ నిర్ణయాల పేరుతో సుజనా చౌదరి రాజ్‌భవన్‌కు వెళ్లి మంతనాలు జరిపారని, ఇదంతా చూస్తుంటే కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. 

Back to Top