తెలుగుజాతిని విడదీయలేరు!

హైదరాబాద్:

కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు అపవిత్ర సంబంధం పెట్టుకుని రాష్ట్రాన్ని భౌగోళికంగా ముక్కలు చేయగలుగుతున్నాయే కాని తెలుగు ప్రజలను మాత్ర విభజించలేవని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. అందరం కలిసి ఉంటేనే అన్ని ప్రాంతాలకూ మేలు జరుగుతుందని ఆయన అన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో 'సమైక్యాంధ్రతోనే మేలు' నినాదంతో బరిలోకి దిగుతుందని తెలిపారు. పార్టీ శ్రేణులకు కేంద్ర కార్యాలయంలో జరిగిన రెండు రోజుల శిక్షణా కార్యక్రమం రెండవరోజున బుధవారం ముగింపు కార్యక్రమంలో ఆయన ఉత్తేజపూరితంగా ఉపన్యసించారు. త్వరలో తెలంగాణలో ఓదార్పు యాత్ర ప్రారంభిస్తానని, తెలంగాణలో ఓదార్పు యాత్రలో తన మాతృమూర్తి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ, సోదరి శ్రీమతి షర్మిల కూడా భాగస్వాములవుతారని శ్రీ జగన్‌ వెల్లడించారు.

‌రాజన్న రాజ్యం కోసం కృషి చేస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్ని ప్రాంతాల్లోనూ ఉంటుందని శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. ప్రతి పేదవాడి మనసు తెలుసుకుని వారి గుండెల్లో నిలిచిపోయే రీతిలో పార్టీ పనిచేస్తుందని చెప్పారు. కేంద్రంలోని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ, రాష్ట్రంలోని ప్రతిపక్షం టీడీపీల సహాయంతో ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్‌ పార్టీ మన రాష్ట్రాన్ని అప్రజాస్వామికంగా విభజించిందని శ్రీ జగన్‌ దుయ్యబట్టారు.

‘రాష్ట్రాన్ని విడగొట్టారు. భూమినీ విడగొట్టారు. కానీ తెలుగుజాతిని విడదీయలేరు. తెలుగువారు ఎక్కడున్నా వారి మనసులు, ఆప్యాయతలను విడగొట్టలేరు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ... అక్కడా ఇక్కడా అన్ని చోట్లా నా అన్నదమ్ములున్నారు. అక్కచెల్లెళ్లున్నారు. తెలంగాణ, రాయలసీమ, కోస్తా నాది అన్న భావనే సమైక్యం' అని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు. ఆప్యాయతలు అక్కడా ఇక్కడా అన్ని చోట్లా ఉన్నాయని చెప్పడమే నా అభిప్రాయం అన్నారు. ఇదే నినాదంతో తెలంగాణలోకి వెళతాం. తెలంగాణలోనూ వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ఉంటుందని ఆయన వివరించారు. ‘తెలంగాణలోనూ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తెలంగాణలోని పార్టీ శ్రేణుల్లోనూ విశ్వాసం నింపుతాం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా తెలంగాణలో ఓదార్పుయాత్ర చేయబోతున్నాను’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు.

మనం ఇచ్చే ఆక్సిజనే ప్రధానికి ప్రాణం కావాలి :

‘వచ్చే ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి. మనం ఇచ్చే ఆక్సిజనే కేంద్రంలో ప్రధాని పదవిలో ఉండేవారికి ప్రాణం అనే పరిస్థితులు తేవాలి. సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఆయనకు ఒకటే చెబుతున్నాను. అయ్యా.. ప్రధానమంత్రి మన ఆక్సిజ‌న్‌తో బతికే పరిస్థితి వచ్చినప్పుడు.. మనకు డబ్బులు వచ్చినప్పుడు.. నువ్వే అవసరం లేదు.. ఎవరైనా ఆ పని చేయగలుగుతారు. తెలుగువారమంతా ఒక్కటై కచ్చితంగా ఆ పరిస్థితి తీసుకురావాలి. రాజకీయంగా ఇది చాలా అవసరం' అని శ్రీ జగన్ అన్నారు.

'ఒకవేళ ఎన్నికల షెడ్యూలు వెలువడి నేను సీమాంధ్రలో పర్యటించాల్సి వచ్చినా కూడా యాత్ర ఆగదు. నాతల్లి, చెల్లి తెలంగాణలో ఓదార్పు యాత్ర కొనసాగిస్తారు. ఎవరి జీవితంలోనైనా వెనుక కొందరున్నారంటారు. నా జీవితంలో కూడా నా తల్లి, నా చెల్లి, నా భార్య ఈ ముగ్గురూ ఉన్నారని గర్వంగా చెప్పగలుగుతున్నాను. తెలంగాణలో ప్రతి కార్యకర్తకు కూడా భరోసా ఇస్తూ చెబుతున్నాను.. మన పార్టీ ఎక్కడికీ పోదు.. తెలంగాణలో కూడా మన కుటుంబం ఉంటుంది.

పేదల కష్టాలు నాయకులు తెలుసుకోవాలి :

'ఏ రాజకీయ నాయకుడికీ రాని అవకాశం నాకు వచ్చింది. ఓదార్పు సందర్భంగా పేదల ఇళ్లకు వెళ్లి వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నాను. దాదాపు 700 కుటుంబాలను కలిశాను. వారి కష్టాలు తెలుసుకున్నాను. ఒక ఎమ్మెల్యే, ఎంపీ కావాలనుకునే ప్రతి ఒక్క నాయకుడూ ఇలాంటి పరీక్షకు సిద్ధపడాలి. పేదల పూరిగుడిసెలకు వెళ్లి వారి జీవితాలను తెలుసుకుని ఏ విధంగా వారిని బాగుచేయవచ్చనే తలంపుతో పనిచేయాల'ని శ్రీ వైయస్‌ జగన్‌ సూచించారు.

అధికార ప్రతిపక్షాల కుమ్మక్కు :

'రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు కాంగ్రెస్, టీడీపీ, కేంద్రంలోనూ అధికార, ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయి దారుణంగా వ్యవహరించాయి. రాష్ట్రాన్ని విభజించడం అన్యాయమని బీజేపీ చెప్పింది. టీడీపీ చెప్పింది. కానీ పార్లమెంటులో ఈ రెండు పార్టీలూ విభజన బిల్లుకు మద్దతు పలికాయి. ఇదెక్కడి విధానం? అన్యాయంగా విభజన జరుగుతోందని చంద్రబాబు ఓవైపు చెప్పి మరోవైపు వాళ్ల ఎంపీల చేత బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేయించారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తూ బిల్లును ప్రవేశపెట్టి గతంలో ఎక్కడా లేని విధంగా సీమాంధ్ర ఎంపీలందరినీ సస్పెండ్ చేసి మూజువాణి ఓటుతో ఆమోదింపజేసుకున్నా‌'రని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

'మహానగరం, మహా సముద్రం కలిసి ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. సీపోర్టు, ఎయిర్‌పోర్టు రెండూ ఒకే రాష్ట్రంలో ఉంటేనే తెలుగు జాతికి మేలు జరుగుతుందని భావించాం. 42 మంది లోక్‌సభ సభ్యులుంటే.. కేంద్రంతో గట్టిగా పోరాటం చేసి పెద్ద ప్రాజెక్టులను మన రాష్ట్రానికి తీసుకువచ్చి గుజరాత్ వంటి రాష్ర్టంతో పోటీపడి దేశంలోనే అగ్రగామిగా ఉంచొచ్చని ఆశించాం. అందుకే రాష్ట్రం ఒకటిగా ఉండాలని తాపత్రయపడ్డాం. అందు‌ కోసం అలుపెరుగని పోరాటం చేశాం. కానీ అధికార, ప్రతిపక్షాలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కలసిపోవడంతో ఈ రాష్ట్రాన్ని ఒకటిగా కలిపి ఉంచలేకపోయాం' అని విచారం వ్యక్తంచేశారు.

నా మీద విశ్వాసంతోనే ఓట్లేయాలని అడుగుతా :
'పేదల జీవితాలను చూశాను కనుకనే వారి సంక్షేమం కోసం కొన్ని పథకాలకు రూపకల్పన చేసి ప్లీనరీలో ప్రకటించాం. ప్లీనరీలో ఇచ్చిన హామీల కోసం నా జీవితాన్ని ధారపోస్తాను. రాజకీయాల్లో ఎవరైనా మా నాయకుడు ఫలానా జగన్‌లా ఉండాలి అనిపించుకునే విధంగా పనిచేస్తాను. నేను ఏ రోజూ సీమాంధ్రకు వెళ్లి తెలంగాణను ద్వేషించే విధంగా మాట్లాడలేదు. తెలంగాణకు వెళ్లి సీమాంధ్ర వారిపై రెచ్చగొట్టేలా మాట్లాడలేదు. నాయకుడు అనేవాడు ఏ ప్రాంతంలోకి వెళ్లయినా.. నన్ను చూసి ఓట్లేయండి.. నామీద నమ్మకం ఉంచండి అని చెప్పగలగాలి. నన్ను, నా విశ్వసనీయతను చూసి ఓట్లేయమని అడుగుతాను. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తెలంగాణలోనూ, సీమాంధ్రలోనూ ఉంటుంది. రాజన్న సంక్షేమ రాజ్య స్థాపనే మన ధ్యేయం’‌అని శ్రేణులకు చెప్పారు.

విడగొట్టాం.. ఓట్లేయండంటున్నారు :
'ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన భావోద్వేగ పరిస్థితుల్లో ప్రస్తుతం ఎన్నికలకు వెళుతున్నాం. ఇక్కడ పార్టీల తీరుచూస్తుంటే.. ‘రేషన్ కార్డులిచ్చాం.. ఇ‌ళ్ళిచ్చాం.. అభివృద్ధి చేశాం... ఫలానా మంచిపని చేశాం.. ఓట్లు వేయండి’ అని వారు అడిగే పరిస్థితి లేదు. రాష్ట్రాన్ని విడగొట్టి ఆ భావోద్వేగాలను సొమ్ము చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘రాష్ట్రాన్ని విడగొట్టిన పెద్దమ్మను నేను.. నాకు ఓట్లేయండి..’ అని ఒకరు, ‘రాష్ట్ర విభజనలో నా పాత్రా ఉంది.. చిన్నమ్మను నేను.. నాకు ఓట్లేయండి’ అని మరొకరు ఓట్లు అడిగే పరిస్థితిని చూస్తున్నాం. రాష్ట్రాన్ని విడగొట్టాం కాబట్టి పొత్తు లేదా విలీనం చేయండని మరొకరు అడిగే పరిస్థితి. ‘నేనిచ్చిన లేఖ వల్లే రాష్ట్రాన్ని విడగొట్టారు కనుక ఒక ప్రాంతంలో విజయోత్సవాలు చేసుకోండి’ అని నిస్సిగ్గుగా చెప్పి భావోద్వేగాలను రెచ్చగొట్టేవారు ఇంకొకరు. మళ్లీ చంద్రన్న రాజ్యం తెస్తానని ధైర్యంగా చెప్పలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Back to Top