ఆర్టీసీ కార్మికుల సంక్షేమం వైయస్సార్సీపీతోనే సాధ్యం

వైయస్సార్ క‌డ‌ప‌))
ఆర్టీసీ కార్మికుల సంక్షేమం వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని జిల్లా
అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. ఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్‌ యూనియన్‌కు చెందిన దాదాపు
వంద మందికి పైగా సోమవారం  వైయస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌లో చేరారు.
వీరిని  ఆకేపాటి యూనియన్‌లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా అమర్‌నాథ్‌రెడ్డి
కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైయస్‌.రాజశేఖర్‌రెడ్డి
ముఖ్యమంత్రి కాక ముందు అప్పడు కూడా  ముఖ్యమంత్రిగా ఉన్న
 చంద్రబాబునాయుడు ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేసేందుకు సిద్దమయ్యారన్నారు.
ఆర్టీసీ ప్రైవేట్‌ పరం కానివ్వకుండా వైయస్‌ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో సైతం
గట్టిగా తిప్పికొట్టినట్లు ఈసందర్భంగా ఆకేపాటి గుర్తు చేశారు. వైయస్‌ ముఖ్యమంత్రి
అయిన తరువాత  అప్పుల ఊబిలో కూరుకు పోయిన ఆర్టీసీకి  ప్రత్యేకంగా వేల
కోట్లు నిధులు కేటాయించి జీవం పోశారన్నారు. కార్మికులు ఎలాంటి సమస్యలు లేకుండా
నిక్షేపంగా ఉండేవారని తెలిపారు. అయితే వైయస్ మ‌ర‌ణానంత‌రం  ఆర్టీసీ దుస్థితి
మళ్ళీ మొదటికి వచ్చిందని  ఆకేపాటి ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రస్తుత
తరుణంలో ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకురావాలంటే వైయస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి
కావాల్సిన ఆవశ్యకత ఎంతైనావుందని తెలిపారు. ఒకే రోజు నూరు మందికి పైగా కార్మికులు
పలు యూనియన్‌ల నుంచి  వైయస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌లో చేరడం ఎంతో
ఆనందంగా ఉందని   తెలిపారు. ఇదిలావుండగా పలు యూనియన్ల నుంచి వైయస్సార్‌
ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌లో చేరిన కార్మికుల పేర్లతో రూపొందించిన కరపత్రాన్ని
ఆకేపాటి విడుదల చేశారు. రాజంపేట ఆర్టీసీ డీపో వైయస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌
అధ్యక్షుడు జీ.చంద్ర, సెక్రెటరి ఎన్‌ఎస్‌.రెడ్డిలు మాట్లాడుతూ
ఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు
 ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకోవడం తప్ప కార్మికుల సంక్షేమం కోసం
పాటుపడటం లేదని ఆరోపించారు.  యూనియన్‌ నాయకుల తీరుతో విసిగివేసారి అనేక మంది
కార్మికులు వైయస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌లో చేరేందుకు ఆసక్తి
చూపుతున్నారన్నారు. తమ యూనియన్‌ను మరింత బలోపేతం చేసి వచ్చే  ఎన్నికల్లో విజయబావుటా
ఎగుర వేస్తామని వారు తెలిపారు.  

 

 

Back to Top