కాంగ్రెస్, టీడీపీ కోవర్టు రఘురామకృష్ణంరాజు

హైదరాబాద్:

కాంగ్రెస్, టీడీపీల కోవర్టులా పనిచేసినందువల్లే నర్సాపురం లో‌క్‌సభా నియోజకవర్గ కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి‌ కనుమూరి రఘురామ కృష్ణంరాజును తప్పించినట్లు పార్టీ నాయకులు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, సర్రాజు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలకు రఘురామ కృష్ణంరాజు లాంటి వ్యక్తులు సహాయపడుతున్నారని దుయ్యబట్టారు. వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి నష్టం కలిగించేలా ఆయన వ్యవహరించారని ఆరోపించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం వారు మీడియాతో మాట్లాడారు.

పార్టీ బాధ్యతల నుంచి తప్పించగానే రఘురామ కృష్ణంరాజు దివాలాకోరు వ్యాఖ్యలతో శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై బురదచల్లుతున్నారని వారు దుయ్యబట్టారు. శ్రీ జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలను పరిశీలిస్తే.. ఆయన స్క్రిప్టు ఎక్కడిదో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. శ్రీ జగన్ పనితీరు, నాయకులను కలుపుకు‌నిపోయే విధానం పార్టీ పెట్టినప్పటి నుంచీ తమకు, నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రజానీకానికి తెలుసునన్నారు.

పార్టీలో చేరి పట్టుమని 90 రోజులు కూడా లేని రఘురామ కృష్ణంరాజు లాంటి వ్యక్తి శ్రీ వైయస్ జగ‌న్‌పై లేనిపోని ఆరోపణలు చేస్తే కార్యకర్తలు సహించబోరని హెచ్చరించారు. ఏ పార్టీలో చేరినా ఆయనకు నర్సాపురం ప్రజలు కచ్చితంగా సరైన గుణపాఠం చెబుతారని శేషుబాబు, సర్రాజు హెచ్చరించారు.

కాంగ్రెస్, టీడీపీలకు కోవర్టులా పనిచేస్తున్న రఘురామ కృష్ణంరాజును లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించాలన్న జిల్లా నేతల విజ్ఞప్తి మేరకే పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నా‌రన్నారు. నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకులను పక్కన పెట్టాలని శ్రీ జగన్‌పై రఘురామ కృష్ణంరాజు తీవ్ర ఒత్తిడి చేశారన్నారు. కానీ శ్రీ జగన్‌ తమ లాంటి వారి పక్షాన నిలబడడాన్ని సహించలేక ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

నిన్నటి వరకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఇంద్రుడు, చంద్రుడని రఘురామ కృష్ణంరాజు చెప్పారన్నారు. రాష్ట్ర విభజనకు కారణం కిరణ్, చంద్రబాబే అని ఆయన అన్నారు. ఒక్క రోజులోనే మార్పు వచ్చిందా? పార్టీ నుంచి బయటకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో సూటిగా చెప్పగలరా? అని ప్రసాదరాజు ప్రశ్నించారు. శ్రీ జగన్ విభజన‌ వాది అంటూ వితండవాదం చేస్తున్న ఆయనకు, తాను చేరబోయే బీజేపీ, టీడీపీలు సమైక్య పార్టీలుగా కనిపిస్తున్నాయా? అని నిలదీశారు.

తాజా వీడియోలు

Back to Top