రాజన్న ఉంటే ఆ తీరే వేరు: షర్మిల

కొనకండ్ల:

  వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ‘రాజశేఖరరెడ్డి మంచి మనసును మీరు చూసి, పనితీరు గమనించి మళ్లీ ఆయనే సీఎం కావాలని ఆశీర్వదించారు. అప్పుడు వైయస్ రెండే వాగ్దానాలు చేశారు. వ్యవసాయానికి 9 గంటలు ఉచిత కరెంటు ఇస్తామనీ,  కుటుంబానికి రూ.2కు కిలో చొప్పున 30 కిలోల బియ్యం ఇస్తామనీ వాగ్దానం చేశారు. రాజన్న బతికి ఉంటే ఈ రెండు హామీలూ అమలయ్యేవి. కిలో బియ్యం రూపాయికే అంటూ గారడీ చేస్తోంది. రూ.20కు 20 కిలోలు ఇచ్చి.. మిగిలిన 10 కిలోలు.. కిలో రూ.10 చొప్పున కొనుక్కోమంటోంది. అంటే 30 కిలోలకు 120 అవుతోంది. అదీ గారడీ అంటే. రాజన్న ఉంటే రూ.60కే 30 కిలోలు వచ్చేవ..’ని  ఆమె వివరించారు. ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 20వ రోజు మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో పలుచోట్ల ఆమె పర్యటించారు. కొనకొండ్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుపై చెణుకులు

     పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడవడమేకాదు.. ఎన్టీఆర్ వాగ్దానాలైన రూ. 2 కిలో బియ్యం పథకం, సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారని షర్మిల మండిపడ్డారు. ఇప్పుడు పాదయాత్ర అంటూ కొత్త నాటకమాడుతున్నారని ధ్వజమెత్తారు. అసలు ఆయనకు పాదయాత్ర చేయాల్సిన అవసరమే లేదన్నారు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేందుకు కావాల్సినంత మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి ఉన్నారు. కానీ అవిశ్వాస తీర్మానం పెట్టకుండా దానితోనే కుమ్మక్కయ్యారని ఎద్దేవాచేశారు.
‘చంద్రబాబు హయాంలో గ్యాస్ ధర రూ. 145 నుంచి రూ. 305కు పెరిగింది. కానీ వైయస్ ఐదేళ్లలో రూ.305కు పైన ఒక్క రూపాయీ పెంచలేదు. ఇప్పుడు 6 సిలిండర్లు దాటితే రూ. 1,000కు కొనుక్కోవాలట. అంటే నెలకు ఒకటి చొప్పున వాడే కుటుంబం ఒక్కో సిలిండర్‌కు సగటున రూ. 950 వెచ్చించాల్సి వస్తుంది. రూ.305 ఎక్కడ? రూ.950 ఎక్కడ?..’ అని ఆమె ప్రశ్నించారు.
సీఎం గారూ! ఉద్యోగాలెక్కడ
     ‘కిరణ్‌కుమార్‌రెడ్డి 15 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. కనీసం వాటిలో 10 శాతం ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో వివరాలు చెప్పమంటే బయటికి చెప్పరు. వడ్డీ లేని రుణాలని ఈ ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ ఇదొక బూటకం. ఈ సర్కారులో పెట్రోలు, డీజిల్, కరెంటు, నిత్యావసర వస్తువులు.. ఇలా అన్నింటి ధరలూ పెంచేశారు. కరెంటైతే రెండు మూడు గంటలు కూడా ఇవ్వరు కానీ, బిల్లులు చూస్తే షాక్ కొడుతోంది. సర్‌చార్జీలు అంటారు.. మరో చార్జీ అంటారు.. ఇంతలా వేధిస్తుంటే ప్రజలు ఎలా బతకాలి?’’ అని షర్మిల నిలదీశారు.

కనిపించని 108


     ‘ఇంతకుముందు ఫోన్ చేసిన 20 నిమిషాలకే 108 వచ్చేది. ఎన్నో ప్రాణాలను నిలబెట్టింది. ఇప్పుడు 108 ఎక్కడా కనిపించడం లేదు. వైయస్ చేసిన ప్రతి ప్రమాణాన్ని ఈ సర్కారు తుంగలో తొక్కింది. వైయస్‌కు వెన్నుపోటు పొడిచింది. 30 ఏళ్లపాటు సేవచేస్తే, ప్రతి పథకానికి రాజీవ్ అనో, ఇందిర అనో పేరు పెడితే వాళ్లిచ్చిన బహుమానం ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరును దోషిగా చేర్చడం’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వైయస్ మరణాన్ని తట్టుకోలేక 668 మంది ప్రాణాలు కోల్పోయారనీ, వారి కుటుంబాలను ఓదార్చాలని ఈ కాంగ్రెస్‌కు అనిపించలేదనీ ఆమె వాపోయారు.  ‘చనిపోయిన వారు కాంగ్రెస్ వాళ్లే కదా. కాంగ్రెస్‌కు ఓటేసిన వారే కదా. కానీ ఆ పార్టీ నేతలకు వారిని ఆదుకోవాలని అనిపించలేదు. ఒక్క జగనన్నే వారిని ఓదార్చేందుకు బయలుదేరాడు. అందుకు కక్ష కట్టి నీచమైన కుట్రకు దిగారు..’ అని షర్మిల ధ్వజమెత్తారు.
గుంతకల్లు నియోజకవర్గంలోకి..: 20వ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం 11 గంటలకు వజ్రకరూర్‌లో ప్రారంభమై కమలపాడు, గూళ్యపాలెం, కొనకొండ్ల మీదుగా గుంతకల్లు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కొనకొండ్ల వద్ద కర్నూలు జిల్లా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి(టీడీపీ), గుంతకల్లు నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్  పార్టీ ఇన్‌చార్జి వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి షర్మిలకు ఘనస్వాగతం పలికారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడాక.. గుంతకల్లు సమీపంలో ఏర్పాటుచేసిన రాత్రి బసకు షర్మిల 7.40కి చేరుకున్నారు. 20వ రోజు పాదయాత్రలో 12 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 258.80 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. యాత్రలో ఎమ్మెల్యేలు కాపు రాంచంద్రారెడ్డి, గురునాథరెడ్డి, ఎన్. ప్రసన్నకుమార్‌రెడ్డి, నేతలు తోపుదుర్తి కవిత, పార్టీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ, ఉరవకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి వై. విశ్వేశ్వర్‌రెడ్డి, కిసాన్‌ సెల్ సమన్వయకర్త వై. మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top