జననేత కోసం ఉరకలెత్తిన ఉరవకొండ

జననేత కోసం ఉరకలెత్తిన ఉరవకొండ



అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజక వర్గంలో అడుగుపెట్టినప్పటి నుంచీ  ప్రజా సంకల్ప యాత్రకు భారీ స్పందన లభించింది. రైతులు, విద్యార్థులు, మైనారిటీలు, బిసిలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  వైయస్  జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ఉత్సాహంతో ముందుకు వచ్చారు. ఎన్నాళ్లుగానో మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం అన్నా అంటూ ఆప్యాయంగా స్వాగతం పలికారు. రెండు రోజుల పాటు ఉరవకొండలో జరిగిన ప్రజా సంకల్ప  యాత్ర విజయవంతమైంది.సోమవారం ఉదయం ఈ నియోజకవర్గం నుంచి రాప్తాడులోకి ప్రవేశించింది.

ప్రతిపక్ష నేతకు తమ గోడు చెప్పుకున్న బిసిలు, శెనగరైతులు..

ఉరవకొండ నియోజక వర్గంలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి బిసిలు ఎక్కువగా ప్రతిపక్ష నాయకులు జగన్ ను కలిసి తమ సమస్యలను చెప్పుకొచ్చారు. చంద్రబాబు తమని పట్టించుకోలేదని ప్రతిపక్ష నేత వద్ద బిసి సంఘం నాయకులు వాపోయారు. రజకులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానన్న తొలి నేత వైయస్ జగనే అని, జగన్ సిఎమ్ అయితేనే బిసిల బతుకులు బాగుపడుతాయని వారన్నారు. పాదయాత్రలో రైతులు తమ పంటకు మద్దతు ధర లభించడం లేదని తెలియజేసారు. శెనగ రైతులు తమ గోడు చెప్పుకున్నారు. కర్నూలు లేదా పొరుగు రాష్ట్రంలో ఉన్న బళ్లారికి పంటను తరలించాల్సి వస్తోందని, రవాణా ఛార్జీలు, కూలీ ఖర్చులు కలుపుకుంటే లాభం కాకుండా నష్టం వెక్కిరిస్తోందని తమ బాధలను వినిపించారు. గుత్తి మార్కెట్ సంగతి అడగ్గా అక్కడ పంట కొనటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేసారు. అనంతపురంలోనే శెనగ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయమని జగన్ కు విజ్ఞప్తి చేసారు.

కూడేరు బహిరంగ సభ విజయవంతం

కూడేరులో జరిగిన ప్రతిపక్ష నేత బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ఉరవకొండ మీదుగానే వెళుతోందని, కానీ ఈ ప్రాంతానికి మాత్రం ప్రభుత్వం నీరివ్వదలుచుకోలేదని ప్రతిపక్ష నేత దుయ్యబట్టారు. వైయస్సార్ హయాంలో 80శాతం హంద్రీనీవా పనులు పూర్తయ్యాయని, చంద్రబాబు ఇప్పటికీ కనీసం పిల్లకాలవలైనా తవ్వించలేదన్నారు. ప్రాజెక్టుల వద్ద కొబ్బరికాయలు కొట్టడమే కానీ, పనులు చేసేది లేదని విమర్శించారు వైఎస్ జగన్. పేదల ఇళ్లకోసం ఉరవకొండలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 88 ఎకరాల భూమిని కొన్నారని, ఇప్పటికీ చంద్రబాబు వాటిని పేదలకు అందించలేదని, ఇది దుర్మార్గమని అన్నారు ప్రతిపక్షనేత.  గ్రామ సమస్యల పరిష్కారానికి ఊరూరా గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామని కూడేరు సభలో  ప్రకటించారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 


నటులను చూసి మళ్లీ మోసపోవద్దని పిలుపు

చంద్రబాబు ఒక్కోసారీ ఒక్కో ముసుగేసుకుని వస్తాడని, యాక్టర్ ను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడుగుతాడని అన్నారు వైఎస్ జగన్. నటుడినో, మరొకరినో ఎన్నికల ముందు తీసుకువస్తారని, ఆ నటుడు చంద్రబాబు అన్నీ చేస్తాడు అందుకు నేను గ్యారంటీ ఇస్తున్నా అంటాడు. చంద్రబాబు లాంటి మోసకారిని క్షమిస్తే మళ్లీ మళ్లీ మోసమే చేస్తాడన్నారు. మోసకారులను రాజకీయాలనుంచి వెలి వేయాలని, మాట ఇచ్చి నిలబెట్టుకోని నాయకులు పదవిని వదిలి ఇంటి ముఖం పట్టే పరిస్థితులు రావాలని అన్నారు. అదే విశ్వసనీయత ఉన్న రాజకీయం అనిపించుకుంటుందని ప్రజలకు తెలియజేసారు వైఎస్ జగన్. అలాంటి రాజకీయాల కోసమే ప్రజా సంకల్ప యాత్ర అన్నారు. చంద్రబాబు వల్ల మోసపోయిన వారందరికీ అండగా ఉండేందుకే ఈ ప్రజా సంకల్ప పాదయాత్ర అని చెప్పారు ప్రతిపక్ష నేత. 

Back to Top