ఎన్‌టీఆర్‌ గృహ కల్పలో మైనార్టీలకు అన్యాయం

చిత్తూరు(మదనపల్లె): ఎన్‌టీఆర్‌ గృహ కల్ప పథకంలో మైనార్టీలకు అన్యాయం జరుగుతోందని వైయస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్లూరి షమీం అస్లాం విమర్శించారు. మదనపల్లె పట్టణంలోని పలువురు మహిళలు బుధవారం షమీం అస్లాం ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. ఎన్నో ఏళ్లుగా కూలీ పనులు చేసుకొంటూ ఇక్కడే కాపురాలు వున్నామని ఇప్పటి వరకూ సొంత ఇల్లు లేకపోవడంతో అద్దెలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మైనార్టీలకు పెద్ద పీఠ వేస్తోందనే ప్రకటనలు చూసి ఇల్లు కట్టిస్తారని ఓట్లు వేశామన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక మా ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్ల మంజూరు కోసం వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని షమీం అస్లాం పేర్కొన్నారు.

Back to Top