'సమైక్య' సభకు ప్రభుత్వం అడ్డుపుల్ల

హైదరాబాద్ :

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ ఈ నెల 19న హైదరాబాద్‌ ఎల్‌బి స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. అనుమతిని నిరాకరిస్తూ.. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి అర్ధరాత్రి పంపిన పత్రంలో ఈ విషయం స్పష్టంచేసింది. శాంతి భద్రతల సమస్య అంటూ కుంటి సాకులు చూపిస్తూ.. సమైక్య సభకు అనుమతిచ్చేది లేదని స్పష్టం చేసింది. హైదరాబాద్ మధ్య మండలం డిసిపి కమలాసన్‌రెడ్డి ఈ మేరకు శనివారం రాత్రి వైయస్ఆర్ కాంగ్రె‌‌స్ పార్టీకి సమాచారం అందించారు.

సమైక్య శంఖారావం సభకు అనుమతి నిరాకరించడంపై వైయస్ఆర్‌ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ‌సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు ఇచ్చిన ఆర్డర్ పోలీ‌స్ ఆర్డరా లేక పొలిటిక‌ల్ (రాజకీయ) ఆర్డరా? అ‌నే సందేహం కలుగుతోందని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు డాక్టర్ ఎం‌.వి. మైసూరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రాజకీయ శక్తులకు ఇష్టం లేకపోతే ప్రజల హక్కులను హరిస్తారా? రాష్ట్రంలో ఏమైనా ఎమర్జెన్సీ విధించారా? లేక నియంతృత్వ పాలన సాగుతోందని భావించాలా? అని ఆయన ప్రశ్నలు సంధించారు.

సభకు అనుమతి ఇవ్వకపోడానికి కారణాలివా?
‘రాష్ట్ర రాజధానిలో మా వాణిని వినిపించుకోవటానికి అనుమతివ్వాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అడిగింది. పార్టీల అభిప్రాయాలను వినిపించుకోవడం ప్రజాస్వామ్యంలో ఒక భాగం. వ్యక్తి స్వేచ్ఛకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు చెబుతున్నాయి. మా అభిప్రాయాలతో విభేదించే వ్యక్తులు రాష్ట్ర రాజధానిలో సభ పెట్టుకోవద్దంటున్నారు కాబట్టి అనుమతిని నిరాకరిస్తున్నాం అంటే దీన్ని ప్రభుత్వ అసమర్థత అనాలా? లేక సమైక్యవాదులు ఇకపై ఇక్కడ నోరెత్తటానికి వీల్లేదనే నిరంకుశ ఆదేశంగా దీన్ని భావించాలా?’ అని మైసూరా ఆగ్రహం వ్యక్తం చేశారు.

‌వైయస్ఆర్ కాంగ్రె‌స్ సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు జారీ చేసిన ఆదేశాలను ప్రజాస్వామిక వాదులంతా ఒకసారి చూడాలని, ఇందులో ఉన్న ప్రతీ అంశమూ రాజకీయమేనని మైసూరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఈ నెల 19న హైదరాబాద్‌లో వైయస్ఆర్‌ కాంగ్రెస్ తలపెట్టిన సభకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నిస్తే.. 2013 జూలై 30న తెలంగాణపై కాంగ్రె‌స్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని, అక్టోబ‌ర్ 3న కేంద్ర కేబినె‌ట్ నోట్ ఆమోదం పొందటాన్ని... ఆ తరువాత విజయనగరం జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరగటాన్ని పోలీసులు ప్రస్తావించారు.‌ అసంబద్ధమైన కారణాలతో సభకు అనుమతి నిరాకరిస్తారా? రాష్ట్రం విడిపోతే తమ బతుకులు ఎమిటన్న ఆందోళనతో కోట్ల మంది రోడ్ల మీదికి వచ్చినా.. అక్కడ ఉద్యమం నడుస్తోందని గుర్తించడానికి కూడా ఇక్కడి పొలిటికల్ పోలీసులు సిద్ధంగా లేరని పోలీసుల జవాబులు చూస్తే అర్థం అవుతోంది. శాంతి భధ్రత‌లను పరిరక్షించాల్సిన పోలీసులే శాంతి భద్రతలను ఒక సమస్యగా చూపటం విడ్డూరంగా ఉంది’ అని మైసూరా పేర్కొన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి వైయస్ఆర్‌ కాంగ్రెస్ తన విధానాన్ని మార్చుకోవడాన్ని తెలంగాణ ‌జెఎసి, టిఆర్‌ఎస్, తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ‌నాయకులు తప్పు పడుతున్నారంటూ పోలీసులు జారీచేసిన ఆదేశాల్లోని మూడో విషయమని మైసూరారెడ్డి తెలిపారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ విధానం మార్చుకుందంటూ ‌పశ్చిమ మండలం డిసిపి అంటున్నారంటే దీని వెనుక ఉన్నదంతా రాజకీయమేనని స్పష్టం అవుతోందన్నారు.

ఆగస్టు 11న నరేంద్ర మోడీ సభకు ఇదే ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని, రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఉన్న బిజెపికి అనుమతి ఇస్తే హింస, విద్వేషాలు ఈ రాష్ట్రంలో పెరుగుతాయని పోలీసులను నియంత్రిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అనిపించలేదా? అని మైసూరారెడ్డి ప్రశ్నించారు. అలాగే, సెప్టెంబర్ 7న ‌ఎపి ఎన్జీవోలకు, సెప్టెంబర్ 29న తెలంగాణ ‌జెఎసి సభల సమయంలో జరిగిన చెదురుమదురు సంఘటనల్ని అదుపు చేయటంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం వాటిని సాకుగా చూపుతూ వైయస్ఆర్‌ కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వకపోవడం ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి స్వార్థ రాజకీయంలో భాగమేనని స్పష్టం అవుతోందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను ఎలాగైనా విభజించి తీరాలన్న వ్యూహంతో కాంగ్రె‌స్ పార్టీ వేస్తున్న ఎత్తుల్లో కిరణ్‌కుమార్‌రెడ్డి ఏజెంటుగా మారారని మైసూరారెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణ మద్దతుదార్లు ఈ సభను అడ్డుకునే ప్రమాదం ఉందని పోలీసులు చెప్పడాన్ని చూస్తే ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా? అన్న సందేహం కలుగుతుందన్నారు. రాష్ట్ర రాజధానిలో సమైక్యవాదులు సభ పెట్టుకోరాదన్నట్లుగా పోలీసులు జారీ చేసిన ఆదేశాలతో.. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి ఉన్నట్టా? లేనట్టా? ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు తమ అభిప్రాయాలు చెప్పుకునే హక్కును ప్రభుత్వం కాలరాసిందన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్ ప్రభంజనం‌ ఈ సభతో ఢిల్లీ నేతలకు తెలుస్తుంది :
వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తే ఆ ప్రభంజనం ఢిల్లీలో రాజకీయ పార్టీలకు తెలిసివస్తుందని మైసూరారెడ్డి చెప్పారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి వినిపించే సమైక్యవాణి పార్లమెంటేరియన్లను ఆలోచింపజేస్తుందన్నారు. పార్టీ ఆవిర్భవించిన తరువాత గాంధేయమార్గంలో నడిచామే తప్ప ఎక్కడా ఏనాడూ తాము ఎలాంటి హింసనూ, విద్వేషాన్ని రగల్చలేదని తెలిపారు.

హైదరాబాద్‌లో సమైక్య శంఖారావం సభ ప్రజాస్వామికంగా, శాంతియుతంగా నిర్వహించాలన్నది వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం అని మైసూరారెడ్డి చెప్పారు. ఇదంతా ఇష్టం లేకే.. దొంగ సమైక్య నాటకాలు ఆడటం, ఆడించటంలో సిద్ధహస్తుడైన సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వైయస్ఆర్‌ కాంగ్రెస్ సభకు అనుమతి ఇవ్వరాదన్న ఆదేశం వెనుక ఉన్నా‌రని భావిస్తున్నట్లు చెప్పారు. పోలీసుల పొలిటికల్ ఆర్డర్‌ను న్యాయస్థానంలో సవాల్ చేస్తామని, రాజ్యాంగం ఇచ్చిన హక్కు‌లను ఉపయోగించుకుని సమైక్య శంఖారావాన్ని హైదరాబాద్‌లో ప్రశాంతంగా నిర్వహిస్తామని మైసూరారెడ్డి వెల్లడించారు.

రాష్ట్ర పరిరక్షణ వేదిక ఖండన:
ఈ నెల 19న హైదరాబాద్‌లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు అనుమతి నిరాకరించడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక తీవ్రంగా ఖండించింది. ఇది అప్రజాస్వామిక చర్య అని వేదిక రాష్ట్ర కన్వీన‌ర్ వి.లక్ష్మణరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి నిజంగా సమైక్యవాది అయితే సభకు అనుమతిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

‌అర్ధరాత్రి నిరాకరణ ప్రకటన :
వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఈ నెల 19న ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన సభ‌కు అనుమతి ఇవ్వలని కోరుతూ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చాలా రోజుల క్రితమే పోలీసు ఉన్నతాధికారులకు వినతిపత్రం సమర్పించింది. అయితే, దానిపై పోలీసులు స్పందించకపోవడంతో పార్టీ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. దానిపై ఈ నెల 12 వ తేదీలోగా నిర్ణయం చెప్పాలని హైకోర్టు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. గడిచిన మూడు రోజులుగా స్పందించని పోలీసు ఉన్నతాధికారులు హైకోర్టు గడువు ముగిసే 12 వ తేదీ రాత్రి.. సమైక్య శంఖారావం సభకు అనుమతించడం లేదని పేర్కొంటూ సమాచారం పంపింది. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమైక్య రాష్ట్రం కోసం హైదరాబాద్‌లో సభ నిర్వహిస్తే అడ్డుకుంటామని కొందరు చేసిన ప్రకటనలు పత్రికల్లో వచ్చాయని, ఆ కారణంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలున్నందున సభకు అనుమతి నిరాకరిస్తున్నామని సెంట్రల్ జోన్ ‌డిసిపి కమలాసన్‌రెడ్డి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చిన పత్రంలో పేర్కొన్నారు. దానిని మైసూరారెడ్డి రాత్రి మీడియాకు విడుదల చేశారు.

Back to Top