రోజాకు గాయాలు నిమ్స్ కు తరలింపు

అసెంబ్లీ ఆవరణలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాను ఈడ్చుకెళుతుండడంతో ఆమె కిందపడిపోయారు. దీంతో రోజాకు తీవ్రగాయాలయ్యాయి. అయినా కూడా పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కెల్లి అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం, పోలీసుల తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకొని వైఎస్ జగన్ రోజాను పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్న రోజాను అరెస్ట్ చేయడం పట్ల వైఎస్ జగన్ మండిపడ్డారు ఈ సందర్భంలో పోలీసు ఉన్నతాధికారులకు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.

 అందరి ఉద్యోగాలు పోయేలా కోర్టుకు వెళ్తానని వైఎస్ జగన్ హెచ్చరించారు. స్పృహ తప్పిన ఎమ్మెల్యేను... అందునా మహిళా ఎమ్మెల్యేను అంబులెన్సు లేకుండా పోలీసు జీపులో ఎలా తీసుకెళ్తారని ఆయన ప్రశ్నించారు. ఆమెను నిమ్స్‌కు తీసుకెళ్లడానికి అంబులెన్సు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ తర్వాత మాత్రమే పోలీసులు అంబులెన్సు తెప్పించి, రోజాను నిమ్స్‌కు తరలించారు. ''కావాలని మీరు ఈ ప్రాంతమంతా కవర్ చేస్తున్నారు. ఫొటోలు, కెమెరాలను అనుమతించడంలేదు. ఆమె ఏ పరిస్థితిలో ఉన్నారోనని జనం ఆందోళన చెందుతున్నారు'' అని చెప్పారు.  ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల  ప్రభుత్వం వ్యవహరించే  తీరు ఇదేనా అంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.


కాగా రోజా అరెస్టు సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. అరెస్టు విషయంలో పోలీసుల దారుణంగా వ్యవహరించారు. నిరసన వ్యక్తం చేయడానికి రాలేదు, వైఎస్సార్సీపీ ఎల్పీ కార్యాలయాలనికి వెళ్లేందుకే వచ్చానని చెప్పినా వినలేదు. అరెస్టు సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో ఓ సమయంలో ఆమె స్పృహ కోల్పోయే పరిస్థితి కూడా వచ్చింది. మార్షల్స్ వ్యవహరించిన తీరును ఎమ్మెల్యేలంతా తప్పుబట్టారు. ఇది ప్రజాస్వామ్యమా, నియంత పాలనా అని నిలదీస్తున్నారు.



Back to Top