మంత్రి రావెల కొడుకు ఘ‌న‌కార్యం


హైద‌రాబాద్‌) అసెంబ్లీలో ప్ర‌తిప‌క్షాల మీద నోరు పారేసుకొంటూ, నీతి వాక్యాలు వ‌ల్లించే మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు కార‌ణంగా వివాదాల్లో చిక్కుకొన్నారు. త‌ప్ప తాగి ఒక‌మ్మాయి తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. ఈ మేర‌కు రావెల సుశీల్ మీద హైద‌రాబాద్ బంజారాహిల్స్ లో పోలీసుకేసు న‌మోదైంది. ఈ ఘ‌ట‌న ఆలస్యంగా వెలుగు చూసింది. 
బంజారాహిల్స్ ప్రాంతంలో తప్పతాగి సుశీల్ కారు నడుపుతూ కాసేపు హల్ చల్ చేశాడు. మద్యం మత్తులో కారు డ్రైవర్ అప్పారావు తో కలిసి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడున్నవారు వెంటనే స్పందించారు. మంత్రి తనయుడు సుశీల్ సహా ఆ కారు డ్రైవర్ ను చితకబాదినట్లు సమాచారం. అదే విష‌యాన్ని బాధితురాలు, చుట్టుప‌క్క‌ల వాళ్లు మీడియాకు వివ‌రించారు. స్థానికంగా ఉన్న కొంత‌మంది కారును గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆ కారును సీజ్ చేశారు. బాధితురాలు ఓ టీచర్ అని తెలుస్తోంది. ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారని ఆ మహిళను చేయి పట్టి లాగి అల్లరి చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
 బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తులు రావెల సుశీల్, అతని డ్రైవర్ అని స్థానికులు చెబుతున్నారు. కారుపై ఎమ్మెల్యే అని స్టిక్కర్ ఉందని కూడా పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని బాధితురాలితో పాటు ఆమె కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులు సరిగా స్పందించలేదని, ఆ వ్యక్తులను స్టేషన్ నుంచి త్వరగానే వదిలిపెట్టారని బాధితురాలు వాపోయింది. తన చేయి పట్టుకుని లాగారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. మంత్రి తనయుడే ఈ పోకిరి పని చేశాడని బాధితురాలు మీడియాతో స్పష్టం చేసింది. 
Back to Top