రామిరెడ్డి నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు

కావలి: నియోజకవర్గ ప్రజలు ప్రతి ఏటా ఎదుర్కొంటున్న సాగు, తాగునీటి శాశ్వత పరిష్కారం కోసం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చేపట్టిన నిరాహార దీక్షను పోలీసుల సాయంతో ప్రభుత్వం భగ్నం చేసింది. శుక్రవారం రాత్రి స్థానిక ఏరియా వైద్యశాల సెంటర్‌లోని దీక్షా శిబిరంపైకి కావలి డీఎస్పీ మోహన్‌రావు ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్సైలు సుమారు 50 మందికిపైగా ప్రత్యేక పోలీసులు బలగాలు దూసుకొచ్చాయి. పోలీసుల చర్యపై తీవ్రస్థాయిలో వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజా సంఘాలు, రైతులు, మహిళలు ప్రతిఘటించినప్పటికీ పోలీసులు తమపనిని చేసుకుని పోయి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని చికిత్స కోసం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు.

కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందని స్థానిక ఏరియా వైద్యశాల వైద్యులు ప్రభుత్వానికి పంపిన హెల్త్‌బులిటెన్‌ను ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ సూచన మేరకు ఈదీక్ష భగ్నంను చేశారు. దీనిపై ఆగ్రహించిన వైఎస్సార్‌సీపీ, సీపీఎం నేతలు, రైతులు, మహిళా, ప్రజా సంఘాలు స్థానిక ఏరియా బ్రిడ్జి సెంటర్‌లో రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సేవాదళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసులు, నాయకులు డేగా రాము,  కామరాజు, కుందుర్తి కామయ్య, పాలడుగు వెంకటేశ్వరావు, అళహరి చిట్టిబాబు, చింతం బాబుల్‌రెడ్డి, వాసు, సూరిమదన్‌మోహన్‌రెడ్డి, మందాశ్రీనివాసులు, పేరం వెంకటేశ్వర్లు, విన్సెంట్, షాహుల్ హమీద్, సీపీఎం డివిజన్ కార్యదర్శి మాల్యాద్రి రాస్తారోకోలో పాల్గొన్నారు. ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Back to Top