పోలవరం వైయస్ఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్

  • మహానేత హయాంలోనే 70 శాతం రైట్, లెఫ్ట్ కెనాల్ పూర్తి
  • పోలవరంపై బాబుకు చిత్తశుద్ధి లేదు
  • ఆనాడు అడ్డుకునేందుకు ప్రయత్నించాడు
  • నేడు స్పష్టత ఇవ్వకుండా గోప్యంగా ఉంచుతున్నాడు
  • కమీషన్ల కోసం పోలవరాన్ని రాష్ట్రానికి తెచ్చుకున్నాడు
  • పోలవరం ప్రోగ్రెస్ అంతా లోపభూషయిష్టంగా ఉంది
  • ప్రాజెక్ట్ ను ఎప్పుడు పూర్తిచేస్తారు..అంచనా వ్యయం ఎంత..?
  • నాబార్డు ఇచ్చిన అప్పును రాష్ట్రం చెల్లిస్తుందా, కేంద్రం చెల్లిస్తుందా..?
  • శ్వేతపత్రం విడుదల చేయాలి
  • పోలవరం పూర్తయితేనే వైయస్ఆర్ కల నెరవేరుతుంది
  • వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
విజయవాడః మహానేత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ పోలవరం అని, దీనికోసం ఆయన ఎంతో కృషి చేశారని వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. 36 సంవత్సరాల ముందు పోలవరం ప్రాజెక్ట్ కు అప్పటి ముఖ్యమంత్రి పి. అంజయ్య శంకుస్థాపన చేశారని, ఆ తర్వాత దీని గురించి ఎవరూ ఆలోచన చేయలేదని అన్నారు. 2004లో వైయస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ ప్రాంతాన్ని సందర్శించి ముళ్లపొదల్లో ఉన్న పునాదిరాయికి పాలాభిషేకం చేసి పోలవరం ప్రాజెక్ట్ ను మొదలుపెట్టారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. వైయస్ఆర్ హయాంలో ఈ ప్రాజెక్ట్ ను అడ్డుకునేందుకు చంద్రబాబు చేయని కుట్రలు లేవని పెద్దిరెడ్డి అన్నారు. ఏ క్లియరెన్స్ లేదు పోలవరం ఎలా చేపడుతారంటూ చంద్రబాబు అడ్డుకునేందుకు ప్రయత్నించారని.... ఆనాడు ఒరిస్సా, చత్తీస్ ఘడ్ గవర్నమెంట్ దగ్గర కేసులు కూడా వేయించాడని, రాష్ట్రంలో 30 శాతం పూర్తి కావాల్సిన కెనాల్స్ ను అడ్డుకున్నాడని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఓవిధంగా, లేనప్పుడు మరోవిధంగా వ్యవహరించడం బాబుకే చెల్లిందన్నారు.  అయినా కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొని ప్రాజెక్ట్ ను మొదలుపెట్టి 70 శాతం రైట్, లెఫ్ట్ కెనాల్ లు పూర్తి చేసిన ఘనత వైయస్ఆర్ దేనని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. 2005 సెప్టెంబర్ 19వ తేదీన ల్యాండ్ క్లియరెన్స్,  2005 అక్టోబర్ 25న ఎన్విరాన్ మెంటల్ క్లియరెన్స్, 2007 ఏఫ్రిల్ 17న ఆర్ అండ్ ఆర్ క్లియరెన్స్, 2008 సెప్టెంబర్ 19న  వైల్డ్ లైఫ్ శాంక్చురీ క్లియరెన్స్, 2008 డిసెంబర్ 6న అటవీశాఖ క్లియరెన్స్, 2009 జనవరి 20 టెక్నికల్ అడ్వైజరీ క్లియరెన్స్... ఇలా అన్ని క్లియరెన్స్ లు సాధించి ప్రాజెక్ట్ నిర్మించడానికి కృషిచేసిన మహానేత వైయస్ఆర్ అని పెద్దిరెడ్డి కొనియాడారు. 2009 నాటికి 10 వేల రూపాయలు ఎస్టిమేట్ కాస్ట్ అయితే వైయస్ఆర్ 4 వేల కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించడంతో ఈ ప్రాజెక్ట్ మూలన పడిందన్నారు. 

విజయవాడలో మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ....రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పోలవరాన్ని జాతీయప్రాజెక్ట్ గా ప్రకటిస్తూ విభజన చట్టంలో పొందుపర్చారని పెద్దిరెడ్డి తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టి స్పెషల్ ప్యాకేజీకి సాగిలపడినట్టే కమీషన్ల కోసం పోలవరాన్ని రాష్ట్రానికి ఇప్పించుకున్నారని రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. 2014లో బాబు సీఎం అయ్యాక ఆయన తీసుకున్న ఎస్టిమేట్ కాస్ట్ చూస్తే  2015 జనవరి వరకు ఓ సంవత్సరంలోనే జలవనరుల శాఖ రూ. 16200 కోట్ల నుంచి 40వేల 200కోట్ల అంచనాలు పెంచారని చెప్పారు. పోలవరం ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా లోపభూయిష్టంగా ఉందని అన్నారు. ముందస్తు ఒప్పందం ప్రకారం రూ.16200 కోట్లు ఇస్తారా..? పెరిగిన అంచనాల ప్రకారం 40 వేల 200 కోట్లు ఇస్తారో ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ, అటు కేంద్రప్రభుత్వం గానీ తేటతెల్లం చేయకుండా గోప్యంగా ఉంచుతున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 7న కేంద్రఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అర్థరాత్రి ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రానికి పోలవరాన్ని బదలాయిస్తామని చెప్పారు తప్ప ఏ క్లియరెన్స్ ఇవ్వలేదని దుయ్యబట్టారు.
 
ముఖ్యమంత్రికి పోలవరం పూర్తి చేయాలన్న సదుద్దేశ్యం ఉంటే 40వేల 200కోట్లు కేంద్రాన్ని అడిగారో లేదో సమాధానం చెప్పాలన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ఐఐటీ, ఎయిమ్స్ లాంటి వాటికి డైరెక్ట్ గా నిధులు మంజూరు చేస్తున్నప్పుడు పోలవరానికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నాబార్డు దగ్గర లోన్ తీసుకోవడమంటేని నిలదీశారు. నాబార్డు ఇచ్చిన లోన్ కు సంబంధించి ఇంట్రస్ట్ కేంద్రం కడుతుందా..? రాష్ట్రం కడుతుందా...? ఈ అప్పు ఎవరు తీరుస్తారు..? దీన్ని ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని ప్రశ్నించారు. వైయస్ఆర్ తన కలల ప్రాజెక్ట్ పోలవరం సాధించాలని ఏవిధంగా ప్రయత్నం చేశారో అదేరీతిలో వైయస్సార్సీపీ  కూడా పోలవరం పూర్తి కావాలా మహానేత కల నెరవేరాలని చిత్తశుద్ధితో మద్దతు ఇస్తున్నామన్నారు. పోలవరానికి తాము ఎలాంటి అడ్డంకులు సృష్టించడం లేదని పేర్కొన్నారు.  ఆడలేక మద్దెల ఓడ అన్నట్లు మాట్లాడితే వైయస్సార్సీపీ సహకరించడం లేదని చెప్పడం బాబుకు అలవాటుగా మారిందని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. 

ప్రాజెక్ట్ పూర్తయితే వైయస్ఆర్ కు పేరొస్తుంది.  రైతుల హృదయాల్లో కాటన్ మాదిరి వైయస్ఆర్ నిలిచిపోతాడని, దీన్ని జరగనీయకూడదని చెప్పి బాబు కోర్టులకు పోయి 30 శాతం ఆర్అఆండ్ ఆర్ కు అడ్డంకులు సృష్టించాడని ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన అధికారంలోకి వచ్చాక నిమిషంలో విత్ డ్రా చేసుకున్నారని తూర్పారబట్టారు. 20 లక్షలనుంచి 50 లక్షలదాకా పరిహారం ఇస్తున్నారు. ఈ పోలవరం పూర్తి కావాలంటే ఎన్ని లక్షల కోట్లు ఖర్చు చేయాలా..? ఆర్అండ్ ఆర్ ప్రకారం చూస్తే భూములు కోల్పోయిన వారికి 27వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పటివరకు సాధించింది రూ.1981 కోట్లు. ఇది కూడా నాబార్డు నిధులు. వీటిని ఎవరు కడతారో కూడా తెలియదు. రెండున్నరేళ్లలో 3వేల కోట్ల లోపే సాధించి, 2018కి పోలవరం పూర్తి చేస్తామని బొంకితే మేం నమ్మాలా..? కాపర్ డ్యాంలో కూడా చంద్రబాబు వింతగా ప్రవరిస్తున్నారు. అది ఎందుకు  కడతారో సీఎం, ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. కాపర్ డ్యాం అన్నది ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఇబ్బంది రాకుండా అడ్డుకోవడానికి కడతారు తప్ప నీటిపారుదల కోసం కాపర్ డ్యాంలు వాడరన్న సంగతి చంద్రబాబు తెలుసుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హితవు పలికారు. 

పట్టిసీమ, పురుషోత్తపట్నం వద్ద కడతున్న లిఫ్ట్ ఇరిగేషన్ కు రెండింటికీ రూ. 5వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. 2018లోపు పోలవరం పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు ఆ 5వల కోట్లు ఇక్కడ ఖర్చుచేయకుండా వాటికి ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటిదాకా మీరు పోలవరంలో ఎంత పర్సెంటేజీ ప్రోగ్రెస్ తీసుకొచ్చారు. ఎన్ని పదులు సంవత్సరాలు బడుతుంది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని పెద్దిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. కుట్రపూరితంగా స్పెషల్ ప్యాకేజీ వస్తే చాలు డబ్బులొస్తాయి. కాంట్రాక్టర్లకిచ్చి కమీషన్లు తీసుకుంటామన్న ధోరణిలో పోలవరాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చారు తప్ప అది పూర్తిచేయాలన్న చిత్తశుద్ధి బాబులో ఏ కోశాన కనబడడం లేదని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. మీరిచ్చిన కెనాల్స్ కింద పరిహారమే  20 నుంచి 51లక్షల దాకా చెల్లిస్తే ఊర్లకు ఊర్లు పోతున్నాయి. వాటికి ఇంకా ఎంత ఎక్కువవుతుంది...? దీనికి అంచనాలు పెరిగాక రాష్ట్రప్రభుత్వం భరిస్తుందా..? ఓ పక్క లోటు బడ్జెట్ ఇబ్బందులున్నాయని ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి యనమల చెబుతూ...మరోపక్క జీడీపీ 12శాతం దాటిందంటూ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. పోలవరం నిర్మాణాన్ని వైయస్సార్సీపీ ఎప్పుడూ ఆహ్వానిస్తుందని, అయితే పోలవరం ప్రాజెక్ట్ అంచనాలు ఏవిధంగా ఉన్నాయి, ఎప్పుడు పూర్తిచేస్తారో ప్రజల ముందుంచాలని, దీనిపై శ్వేతపత్రం విడుదలచేయాలని పెద్దిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 13 జిల్లాల ప్రజలు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారా అని ఎదురుచూస్తున్నారని, అది పూర్తయితే రాష్ట్రం సుభిక్షంగా మారుతుందన్నారు.  

నాబార్జు నిధులు అది హక్కా..? అది కేంద్రం చెల్లించాలా..?రాష్ట్రం చెల్లించాలా..? అని ఆలోచన చేయకుండా భుజాలు గుద్దుకుంటూ చప్పట్లు, షేక్ హ్యాండ్ లతో సమావేశం పెట్టుకొని ముఖ్యమంత్రి, మంత్రులు, కేంద్రమంత్రులు అభినందించుకోవడం సిగ్గుచేటన్నారు. కేవలం రూ.1981కోట్లకు అలా చేస్తే ఇంకా రెండున్నరేళ్లలో రూ. 40వేల 200కోట్లు ఎప్పుడు ఇస్తారు.  ఏం చేయదల్చుకున్నారో ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సినన్నారు. వైయస్ఆర్ హయాంలో అప్పుడు పోలవరాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశాడు. ఇవాళ స్పష్టత ఇవ్వకుండా రహస్యంగా ఉంచుతున్నాడు. పర్సంటేజీ తీసుకుందామన్న రీతిలో ఉన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ ను తీసుకోవడమే దురదృష్టకరం. పోలవరం ప్రోగ్రెస్ చూస్తే పూర్తి కాదన్న అనుమానం కలుగుతోంది. అంతకంటే ఎక్కువగా వచ్చిన నిధుల్ని టీడీపీ వాళ్లే కైంకర్యం చేస్తారన్నది అనుమానంగా ఉందని, వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని పెద్దిరెడ్డి చెప్పారు. వైయస్ఆర్ ఆనాడు వెనక్కితిరగి చూడకుండా అనుకున్నది సాధించేదాకా  ఎలా కృషిచేశారో మళ్లీ అలాంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే తప్ప పోలవరం పూర్తికాదని ప్రజలంతా భావిస్తున్నారని పెద్దిరెడ్డి చెప్పారు.  

Back to Top