నిరసనలు.. నిలదీతలు.. ఆందోళనలు.. బహిష్కరణలు


అమ‌రావ‌తి:  రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి చేప‌ట్టిన‌ జన్మభూమి- మా ఊరు కార్య‌క్ర‌మం ర‌ణ రంగంగా మారుతోంది. నిరసనలు.. నిలదీతలు.. ఆందోళనలు.. బహిష్కరణలు.. ఏ ఊరు చూసినా ఇదే పరిస్థితి. సమస్యలు పరిష్కారం కాక‌ విసుగు చెందిన ప్రజలకు నిరసనలు తెలిపేందుకు జన్మభూమి సభలను వేదికగా మార్చుకుంటున్నారు. రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన సభలు ఇందుకు అద్దం పడుతున్నాయి. ఏదో తూతూమంత్రంగా నిర్వహించేసి తిరిగి వద్దామని వెళ్లిన అధికారులు జనాగ్రహానికి గురువుతున్నారు. ప్ర‌జ‌ల ప‌క్షాన ప్ర‌శ్నించేందుకు వెళ్లిన  వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కుల‌ను అధికార పార్టీ నేత‌లు అడ్డుకుంటున్నారు. మొన్న పింఛ‌న్ల మంజూరులో చోటు చేసుకున్న అక్ర‌మాల‌పై బ‌హిరంగంగా చ‌ర్చించేందుకు స‌వాల్ విసిరిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న తోక ముడిచి వెన‌క్కు మ‌ళ్లారు. నిన్న జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మానికి వెళ్తున్న పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు పార్థ‌సార‌ధిని పోలీసులు అరెస్టు చేసి నిర్భందించారు. అలాగే తూర్పుగోదావ‌రి జిల్లాలో ఎమ్మెల్యే జ‌గ్గిరెడ్డిని అడ్డుకొని ప్ర‌తిప‌క్ష గొంతు నొక్కె ప్ర‌య‌త్నం చేశారు.
వైయ‌స్ఆర్‌సీపీ మ‌ద్ద‌తు
 వరికుంటపాడు మండలం తూర్పుబోయమడుగులలో మంగళవారం జరిగిన జన్మభూమి కార్యక్రమాన్ని స్థానిక గిరిజన సర్పంచ్‌ బాపట్ల చెంచయ్య బహిష్కరించగా ఆయనకు వైయ‌స్ఆర్‌సీపీ  నేతలు మద్దతుగా నిలిచారు. ఉదయం 10.30కు సర్పంచ్‌ అధ్యక్షతన ప్రారంభమైన గ్రామసభలో మండల ప్రత్యేకాధికారి కె.సత్యవాణి, తహసీల్దార్‌ జి.శ్రీనివాసులు, ఎంపీపీ సుంకర వెంకటాద్రి పాల్గొన్నారు. కాగా మధ్యాహ్నం సర్పంచ్‌ భోజనం ఏర్పాటు చేసినప్పటికీ కొందరు అధికారులు, ఎంపీపీ కలిసి గ్రామంలోని టీడీపీ నేత తోడెందుల వెంకటేశ్వర్లు ఇంట్లో భోజనం చేశారు. దీంతో ఆగ్రహించిన సర్పంచ్‌ తాను గిరిజనుడిననే భావనతో భోజనం ఏర్పాటు చేసినప్పటికీ ప్రత్యేకాధికారి, తహసీల్దార్‌ టీడీపీ నేత ఇంటికి భోజనానికి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అనంతరం గ్రామసభ ప్రారంభమైన వెంటనే సర్పంచ్, ఇతర వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ధర్నా నిర్వహించి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

ఏం ఉద్ధ‌రించార‌ని..
‘మాకు తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా లేవు? మీకేమో మినరల్‌ వాటరా? ఏం ఉద్ధరించారని జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్నారు’ అంటూ బుచ్చిరెడ్డిపాళెం మండలం ఇస్కపాళెం ప్రజలు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిపై ధ్వజమెత్తారు. గ్రామంలో మంగళవారం జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు తమ ఎమ్మెల్యేను తమకు రేషన్‌కార్డులు ఎందుకు మంజూరు చేయలేదని, అర్హత ఉన్నా పింఛన్‌ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఎన్టీఆర్‌ ఇళ్లు టీడీపీ కార్యకర్తలకే ఇచ్చారని మండిపడ్డారు. స్థానిక సర్పంచ్‌ పంచాయతీని సర్వనాశనం చేసిందని ఆరోపించారు. పంచాయతీ నిధులు స్వాహా చేయడం మినహా అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. ఈ సారి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని బాహాటంగానే పేర్కొన్నారు. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ‘‘ఆపండి’’ అంటూ ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ప్ర‌తి చోట ఇలాంటి సంఘ‌ట‌న‌లే పున‌రావృతం అవుతున్నాయి.
Back to Top