భూదందాపై విచారణ మాటేమిటి బాబు

 పెదబాబు శాంక్షన్లు..చినబాబు కలెక్షన్లు
బాబు నివాసమే ఓ అక్రమ కట్టడం
రాజధాని భూదందాపై విచారణ జరుపుతారా లేదా
రాజధానికి వ్యతిరేకం కాదు..రాజధాని భూదోపిడీకి వ్యతిరేకం

హైదరాబాద్:  రాజధానిలోని భూబాగోతంపై విచారణ జరిపిస్తారా  లేదా అని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని నిలదీశారు. దైవసాక్షిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు, మీరు ప్రజలందరికీ ఏమని చెప్పారు బాబు? రాగద్వేషాలకు అతీతంగా, ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఎవరితోనూ ఈ విషయాలను తెలియజెప్పకుండా నా ధర్మాన్ని నిర్వర్తిస్తానని చెప్పారా లేదా?. అలా ప్రమాణం చేసిన మీరు, మంత్రులు.... రాజధాని ఎక్కడ వస్తుందో తెలుసుకుని, అక్కడి అమాయక రైతుల వద్ద తక్కువ ధరకు భూములు కొని వందల కోట్లు వెనకేసుకుంది నిజమా కాదా అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను కొనుక్కోవడం తప్పా కాదా...? లింగమనేనితో లాలూచీ పడి గిఫ్ట్ రూపంలో వారికి లబ్దిచేకూర్చిన  మాట వాస్తవమా, కాదా..? అని కడిగిపారేశారు. 

పెద్దబాబు శాంక్షన్లు చేస్తుంటే చినబాబు వసూళ్లు చేస్తున్నారని బొత్స ఫైరయ్యారు. పార్టీ పరంగా తాము రాజధానికి వ్యతిరేకం కాదని, ప్రాంతానికి వ్యతిరేకం కాదని, రాజధాని పేరిట జరుగుతున్న దోపిడీ, అవినీతిని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని దానిమీద విచారణ జరపాలని ప్రతిపక్షంగా కోరుతున్నామన్నారు. అయినా, ఇప్పటి వరకు దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. వేమూరు రవికుమార్ ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. లోకేష్ కు సన్నిహత సహచరుడనే బాబు ఆయనకు ఐటీ విభాగంలో ప్రధాన పదవి కట్టబెట్టారని,  ఆయన పేరు మీద భూములు కూడా కొన్నారని అన్నారు.

'రాజధాని ప్రకటించకముందే భూములు కొన్నారన్నది అభియోగం. 500 ఎకరాలు కొన్నారని, 50 కోట్లు చెల్లించారని, 650 కోట్లు వచ్చాయని చంద్రబాబు అంటున్నారు. ఆయన, ఆయన భార్య, బంధువులు భూములు కొనుక్కుంటే తప్పేంటని చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఈరోజు అక్కడ భూములు కొనుక్కుని వ్యాపారం, వ్యవసాయం ఏం చేసుకున్నా తప్పులేదు. కానీ, ఎక్కడో అమెరికాలో ఉన్న వ్యక్తి,  నీ కుమారుడితో సాన్నిహిత్యం ఉన్న వ్యక్తి,  ఆ ప్రాంతంలోనే ఎందుకు అన్ని భూములు కొనాలి? అక్కడేమైనా బంగారం పండుతుందా? ఒక వేళ విశాఖలో భూములు కొంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఎందుకు కొన్నారని అడిగితే సమాధానం లేదు' అని బొత్స ఫైరయ్యారు.

శివరామకృష్ణన్ కమిటీని కాదని ఆదరాబాదరాగా  ఏఅనుభవం లేని నారయణను తీసుకొచ్చి  రాజధాని భూములకు సంబంధించి కమిటీ చైర్మన్ గా  వేశారని బొత్స మండిపడ్డారు. నారాయణ సంస్థలో కర్ణాటకలో పనిచేస్తున్న ప్రమీల అనే మహిళ పేరిట 17 ఎకరాలు, ఆయన బావమరిది సాంబశివరావు పేరిట 29 ఎకరాలు భూములు కొన్నారు.  ఈ రకమైన భూదందాపై సమాధానం చెప్పమని అడుగుతుంటే .... అది పక్కన పెట్టి కొనుక్కుంటే తప్పేంటని మాట్లాడుతున్నారు. ఇదేనీ మీ వ్యవహారం అని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రావెల కిషోర్ బాబు భార్య శాంతిజ్యోతి పేరు మీద అసైన్డ్ భూములు కొన్నారు. అసలు అలా అసైన్డ్ భూములను ఎవరైనా కొనొచ్చా? మంత్రులు ఎవరైనా కొంటే.. అలా కొనడం తప్పని చెప్పే బాధ్యత నీకు లేదా బాబుని తూర్పారబట్టారు. 

పక్క ఊరే కావడం వల్ల ధూళిపాళ్ల నరేంద్ర భూములు కొనుక్కున్నారని బాబు మాట్లాడుతున్నారు.  50 ఎకరాలు అగ్రిమెంటు, 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అవన్నీ పోరంబోకు భూములని మీరే కదా బాబు చెప్పింది. మరి పోరంబోకు భూములను ఎలా కొంటారు చంద్రబాబు. వాటిని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని నిలదీశారు. మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇలాగే కొన్నారు. దానికీ సమాధానం లేదు. కేవలం 500 లావాదేవీలే జరిగాయని, అంతా కలిపి 400 ఎకరాలు కూడా ఉండదని చంద్రబాబు చెప్పారు. అదే నిజమైతే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ వెబ్‌సైట్‌ను ఎందుకు బ్లాక్ చేయాల్సి వచ్చింది? అని బొత్స ప్రశ్నించారు. నేడు పర్వదినం .ఏదైనా  తప్పు మాట్లాడితే ఆ పాపం వదలదు.  ఊకదంపుడు ఉపన్యాసాలు ఆపి, మీరు ఏ కారణంతో ఇదంతా చేశారో సమాధానం చెప్పాలని బాబును డిమాండ్ చేశారు. ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటు, అమాయకత్వం అవుతుందని బాబును హెచ్చరించారు. 

కృష్ణా కరకట్టపై ఉన్న లింగమనేని ఎస్టేట్ అక్రమ కట్టడం అని బొత్స అన్నారు. దానికి ప్రభుత్వ ఖర్చుతో ఎందుకు మరమ్మతులు చేయించారని, అక్రమ కట్టడంలో చంద్రబాబు ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. చట్ట వ్యతిరేకమైన ఇంట్లో సాక్షాత్తు ముఖ్యమంత్రే నివాసముండడమంతా దారుణం మరొకటి ఉండదన్నారు.  వైఎస్ార్  హయాంలో తమపై ఆరోపణలు వస్తే సీబీఐ విచారణ జరిపించామని అలాంటి విచారణ మీరు ఎందుకు జరిపించరని ప్రశ్నించారు. భూదందాపై మీరే కేంద్రానికి లేఖ రాసి సీబీఐ విచారణ జరిపించుకోవాలని, బీజేపీ నేతలు కూడా సీబీఐ విచారణకు డిమాండ్ చేయాలన్నారు. 

తాజా వీడియోలు

Back to Top