పిల్లల శవాలపై నారాయణ సామ్రాజ్యం

  • నరకానికి ప్రత్యక్షరూపాలుగా నారాయణ కాలేజీస్
  • మూడున్నరేళ్లలో 30మందికి పైగా బలవన్మరణాలు
  • తల్లిదండ్రుల గుండెకోత కనబడడం లేదా బాబూ
  • పిల్లల ఆత్మహత్యలు చూస్తే మనసు కరగడం లేదా..?
  • ఇన్ని చావులకు కారణమైన నారాయణ, గంటాలను బర్తరఫ్ చేయాలి
  • అక్రమంగా నడుస్తున్ననారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
  • విద్యార్థుల మరణాలపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలి
  • అహంకారంతో ముందుకు వెళితే ఎవరిని వదిలేది లేదు
  • న్యాయవ్యవస్థ ముందు నిలబెట్టి శిక్షపడేలా చేస్తాం
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
హైదారాబాద్ః నారాయణ కళాశాలలు నరకానికి ప్రత్యక్షరూపాలుగా మారాయని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా మండిపడ్డారు. మంత్రి నారాయణ పిల్లల శవాల మీద సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి చదువుకుందామని వచ్చిన విద్యార్థులు నారాయణ కాలేజీల శాడిజానికి బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ  విద్యాసంస్థలో జరగని విధంగా మూడున్నరేళ్లలో 30 మందికిపైగా విద్యార్థులు నారాయణ కాలేజీల్లో చనిపోతుంటే ప్రభుత్వం  దున్నపోతు మీద వానపడిన చందాన వ్యవహరిస్తోందని అన్నారు.  ఇంత మంది విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీ నారాయణ కాబట్టి పట్టించుకోవడం లేదా లేక విద్యాశాఖ మంత్రి వియ్యంకుడు కాబట్టి ఏ చర్యలు తీసుకోవడం లేదా..? పిల్లల ఆత్మహత్యలు చూస్తే మీ మనసు కరగడం లేదా...? తల్లిదండ్రుల గుండెకోత మీకు కనబడడం లేదా అని బాబు, నారాయణ, గంటా శ్రీనివాసరావులపై నిప్పులు చెరిగారు.  మీ పిల్లలు, బంధువుల పిల్లలకు ఇదే గతి పడితే చూస్తూ ఊరుకుంటారా..? అని నిలదీశారు.

మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు, మేం తలచుకుంటే ఏమైనా చేస్తామన్న కండకావరంతో నారాయణ విద్యాసంస్థలు ఉన్నాయని మండిపడ్డారు. ఒకే విద్యాసంస్థలో ఇంతమంది చనిపోతున్నా యాజమాన్యం, అధిపతి నారాయణపై ఎలాంటి కేసులు, విచారణ లేకుపోవడం బాధకరమన్నారు. నారాయణ ఇచ్చే వందల కోట్లు మీ నోరు. కళ్లు కుట్టేశాయా బాబూ..? అని ప్రశ్నించారు.  2015లో ఇదే కాలేజీలో మనీషా, నందినీలు చనిపోతే ఆ తల్లిదండ్రులకు శవాలు కూడ ఇవ్వకుండా దహనకార్యక్రమం చేయాలని చూశారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైయస్ జగన్ హుటాహుటిన వెళ్లి ఆ పిల్లల కోసం ధర్నాలు చేస్తే అప్పుడు తూతూమంత్రంగా కమిటీ వేశారని, రెండేళ్లవుతున్నా ఎంతవరకు ఆ రిపోర్ట్ ఏమైందో ఎవరికి తెలియదన్నారు. నారాయణ కాలేజీపై ఒక్క కేసు కూడ నమోదు చేయలేదు కాబట్టే కర్నూలు, తిరుపతి, రాజమండ్రి ఇలా ప్రతిచోట విద్యార్థులు చచ్చిపోతున్నారని అన్నారు. అయినా ఆ  విద్యాసంస్థలకు భయం గానీ, బాధ గానీ లేదని అన్నారు.  ఎవరూ ఏం చేయలేరన్న అహంకారంతో ముందుకుపపోతున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసప్రాంతంలోని విజయవాడ శివారు గూడెపల్లి నారాయణ కాలేజీలో ఈశ్వర్ రెడ్డిని కాలేజీ సిబ్బంది కొట్టి చంపితే విద్యాశాఖ మంత్రి గంటా అక్కడకి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడ చేయలేదన్నారు. వియ్యంకుడికి ఎప్పుడు సమస్య వచ్చినా స్క్రీన్ మీదకి వచ్చి అధికారులను బెదిరించడం, విచారణకు ఆదేశిస్తున్నామని స్ర్కోలింగ్ వేసుకోవడం తప్ప కాలేజీకి వెళ్లి ప్రత్యక్షంగా సమీక్షలు జరిపారా..? ఎవరిపైనైనా చర్యలు తీసుకున్నారా అంటే శూన్యమని అన్నారు.గంటా, నారాయణ లకు డబ్బుల మీద వ్యామోహం తప్ప  ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనే లేదని..రాజధాని, విశాఖ భూముల విషయంలో ఏమైందో మనమంతా చూశామన్నారు. 

చంద్రబాబుకు ఆడపిల్ల లేదు కాబట్టే వారు చనిపోతుంటే ఆ బాధ తెలియడం లేదని రోజా అన్నారు. ఆయన  అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం క్రైం అగైనెస్ట్ ఉమెన్ పెరుగుతూనే ఉందిని, ఈ విషయాన్ని పోలీస్ రికార్డ్ స్పష్టం చేసిందన్నారు.  ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎంత ఊడితే ఎంత అని అన్నారు. నారాయణ సొంత జిల్లా నెల్లూరులోని గూడూరులో దిలీప్ అనే విద్యార్థిని కర్ణబేరి పగిలిపోయేలా కొట్టిస్తే ఇంతవరకు చర్యలుతీసుకోలేదన్నారు. అధికారులు ఏం చేస్తున్నారు, ఎవరినైనా వదలిపెట్టొద్దంటూ గంటా ఆవేశంతో ఊగిపోతూ నటిస్తున్నారే తప్ప నిజాయితీగా వ్యవహరించడం లేదన్నారు.  ప్రజలు మీ మాయను నమ్మే పరిస్థితులో లేదని గంటాను హెచ్చరించారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థలు  నిబంధనలకు తగ్గట్టుగా లేకున్నా వాటిని మూసేయడం లేదని...అదే ఇతర ప్రైవేటు స్కూళ్లు, హాస్టళ్లు మాత్రం తమకు పోటీ లేకుండా చేసుకునేందుకు మూసేస్తున్నారని విమర్శించారు. గుర్తింపు లేని నారాయణ, చైతన్య విద్యాసంస్థలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

నారాయణ కాలేజెస్ టీడీపీ ప్రాంగణాలుగా మారాయని రోజా విమర్శించారు.  ఎన్నికలొచ్చినప్పుడు డబ్బులు పంపించేందుకు, వారి అరాచకాలకు అడ్డాగా ప్రతి చోట ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు అర్థమవుతోందన్నారు. పావని తండ్రి రోదన మీకు కనిపించదా...? శవాలను తల్లిదండ్రులకు కూడ ఇవ్వకుండా మీరే కాల్చేస్తుంటే వాళ్లు ఎలా కమిలిపోతారో అర్థం కాదా..? ఈ విషయాన్ని వైయస్సార్సీపీ సీరియస్ గా తీసుకుంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటీవల ప్రతిపక్ష నేత చాలాసార్లు దీనిపై పోరాడితే కమిటీలు వేశామని చెప్పుకుంటూ వచ్చారే తప్ప చర్యలు తీసుకోలేదన్నారు. 2015లో విద్యార్థుల ఆత్మహత్యలపై మాజీ వీసీ రత్నకుమారి, ఐఏఎస్ చక్రపాణి నేతృత్వంలో విచారణ కమిటీ వేశారు. వారు మీకు అక్కడి పరిస్థితులు తెలియజేసినప్పుడు ఏం చర్యలు తీసుతున్నారో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి.  మీకు మనసు మానవత్వం ఉంటే, మీరు ఏ తప్పు చేయలేదనుకుంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలి. ఇన్ని చావులకు కారణమైన నారాయణ, గంటాలను బర్తరఫ్ చేయాలి. ఇక మీదట రాష్ట్రంలో అక్రమంగా నడుస్తున్న
నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఏ విద్యార్థి హత్య, ఆత్మహత్య జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత
సీఎంపైనే ఉందని హెచ్చరిస్తున్నాం. అహంకారంతో ముందుకు వళితే మాత్రం ఎవరిని వదిలేది లేదు. న్యాయ వ్యవస్థముందు నిలబెట్టి శిక్షపడేలా 
చేస్తామన్నారు. 
Back to Top