పార్టీలో చేరిన నంద్యాల ఎంపీ

హైదరాబాద్ 27 సెప్టెంబర్ 2013:

  కాంగ్రెస్ పార్టీకి చెందిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి శుక్రవారం రాత్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శనివారం మధ్యాహ్నం  స్పీకర్ ని కలిసి ఎమ్.పి. పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం శ్రీ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేశారని తెలిపారు. సమైక్యంగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని రెడ్డి పేర్కొన్నారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మాట్లాడుతూ, ఎస్పీవై రెడ్డి చేరిక పార్టీకి శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత సీఎంకు లేదని స్పష్టంచేశారు. సమైక్యాంధ్ర అంటే చిత్తశుద్ధి ఉంటే సీఎం ఇప్పటికే రాజీనామా చేసి ఉండాల్సిందన్నారు. సీఎం మాటకు విలువ లేకపోతే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
మోపిదేవికి జగన్ పరామర్శ

అంతకుముందు శ్రీ జగన్మోహన్ రెడ్డి కేర్ ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడ చికిత్స పొందుతున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను పరామర్శించారు. ఆరోగ్యం ఎలా ఉన్నదీ అడిగి, తెలుసుకున్నారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారు సిసి రెడ్డిని కూడా ఆయన పరామర్శించారు.

Back to Top