నేటి తరం రాజకీయాల్లో జగన్ గొప్ప నాయకుడు

మాచవరం (ప్రకాశం జిల్లా):

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డి నేటి తరం రాజకీయాల్లో  గొప్ప నాయకుడని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. రాజకీయంగా ఆయన్ను ఎదుర్కోలేకే కాంగ్రెస్, టీడీపీలతోపాటు సీబీఐ కుమ్మక్కై జైల్లో పెట్టించారన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా జనం మద్దతు శ్రీ జగన్మోహనరెడ్డికే ఉందన్నారు. మండలంలోని మాచవరంలో ‘జగన్ కోసం... జనం సంతకం’ కార్యక్రమాన్ని మేకపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత హయాంలో జారీ అయిన 26 జీవోల వల్ల లబ్ధి చేకూరిందనే ఉద్దేశంతో ప్రభుత్వం శ్రీ వైయస్ జగన్‌మోహనరెడ్డిని అరెస్టు చేయించిందన్నారు. అయితే ఆ జీవోలు విడుదల చేసిన మంత్రులపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏ తప్పూ చేయకున్నా శ్రీ జగన్మోహనరెడ్డిని అన్యాయంగా జైలులో పెట్టారన్న ప్రజల అభిప్రాయాన్ని చెప్పేందుకు కోటి సంతకాల కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సంతకాల సేకరణకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు.

     ఒంగోలు ఎమ్మెల్యే, వైయస్ఆర్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు పార్టీ జిల్లా కన్వీనర్ నూకసాని బాలాజీ, పార్టీ ఇతర నాయకులపై కేసులు నమోదు చేసయడం అప్రజాస్వామికమని మేకపాటి రాజమోహన్‌రెడ్డి విమర్శించారు. కందుకూరు నియోజకవర్గంలోని గుడ్లూరు, వలేటివారిపాలెం, కరేడుల్లో ‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

Back to Top