ఇది ప్రజాస్వామ్యమేనా?

  • ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం
  • నాటి చంద్రబాబు మాటలు..నేడు ఆయన చేస్తున్న చేష్టలు సబబేనా? 
  • గవర్నర్‌తోనే తప్పులు చేయిస్తే ఇక ప్రజాస్వామ్యంలో విలువేముంది
  • రాష్ట్రపతి, ప్రధాని, ఈసీ, ఇతర పార్టీల నాయకులను కలుస్తాం
  • గవర్నర్ తో భేటీ అనంతరం మీడియాతో వైయస్ జగన్
హైదరాబాద్‌:  ఒక పార్టీ గుర్తుతో గెలిచిన వారికి మరో పార్టీలో మంత్రి పదవులు ఇవ్వడం ప్రజాస్వామ్య దేశంలో మంచిది కాదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ మంత్రివర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన వారికి మంత్రి పదవులు ఇవ్వడంపై సోమవారం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి పదవులు పొందిన వారి రాజీనామాలు ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని  గవర్నర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. గవర్నర్‌తో భేటీ అనంతరం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ఆయన ఏమన్నారంటే.. గవర్నర్‌ను ఇవాళ కలిసి లేఖ అందజేశాం. ఈ లేఖ కాపీని మీ అందరికి కూడా ఇస్తాం. ఈ లేఖ ద్వారా మేం ఒక్కటే అడిగాం. సార్‌ ఇది ప్రజాస్వామ్యమేనా? వేరే పార్టీ గుర్తు మీద గెలిచి, ఆ పార్టీ ద్వారా ఎమ్మెల్యే పదవులు సంపాదించి, వాటికి రాజీనామా చేయకుండా, వారు అనర్హులుగా పరిగణించకుండా ఇప్పుడు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడం ప్రజాస్వామ్యమేనా అని అడిగాం. తెలంగాణలో ఇదే విషయంలోతలసాని శ్రీనివాసయాదవ్‌కు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇచ్చిన ప్పుడు అప్పట్లో చంద్రబాబు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోమని గవర్నర్‌ను కోరాం. ఒక పార్టీ నుంచి గెలిచిన వారు.. వారి రాజీనామా ఆమోదించకుండా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయ వ్యభిచారులుగా పోల్చిన ఘటనను గవర్నర్‌కు గుర్తు చేశాం. 

ఆ రోజు చంద్రబాబు మాటలు, ఇవాళ ఆయన చేస్తున్న చేష్టలు సబబేనా?. ప్రజాస్వామ్యంలో ఇలా చేయడం తప్పు. మొన్న స్పీకర్‌ కూడా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా 68 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల బలమని చదివారు.  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మంత్రి పదవులు ఇవ్వడం సరికాదు. రాజీనామాలు ఆమోదింపబడేలా చర్యలు తీసుకోండి అని గవర్నర్‌ను కోరాం. ఇవేవి జరగకపోతే మీరే దగ్గరుండి వారిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశాం. ఇటువంటి తప్పులు జరుగకుండా ఉండేందుకు గవర్నర్‌ చర్యలు తీసుకోవచ్చు. అలాంటి గవర్నర్‌తోనే తప్పులు చేయిస్తే ప్రజాస్వామ్యాన్నికి విలువేముందని కోరాం. 

ఇదే విషయంపై రాష్ట్రపతి, ఎన్నికల కమిషన్, ప్రధాని నరేంద్రమోడీ, వివిధ పార్టీల నాయకులను కలుస్తాం. ఈ విషయంపై అందర్ని కలుస్తాం, ఇవాళ మా దాకా వచ్చింది. రేపు మీదాకా వస్తుంది. ఇలా చేస్తే ప్రజాస్వామ్యం చతికిలపడే పరిస్థితి వస్తుందని ఆ పార్టీలను ప్రేరేపిస్తాం. ఈ నలుగురు చేత రాజీనామాలు చేసేలా ఒత్తిడి తెస్తాం. మా ఖర్మ ఏంటంటే మాకు ఢిల్లీ స్థాయిలో సపోర్టు లేదు. ప్రజాస్వామ్యంలో ఇది లేకపోవడమే పాపమన్నట్లుగా ప్రతిపక్షంలో ఉన్నవాళ్లను అధికార బలంతో కొడితే ప్రజాస్వామ్యం బతకదు. అధికారంలో ఉన్నవాడు ఏమైన చేయొచ్చు అంటే ప్రజాస్వామ్యం బతకదు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేసేలా గట్టిగా పోరాటం చేస్తామని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top