ఆదినారాయ‌ణ‌రెడ్డికి శంక‌ర‌గిరి మాన్యాలు త‌ప్ప‌దు


వైయ‌స్ఆర్ జిల్లా: అధికారం ఉంద‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్న మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డికి ఈ ప‌ద‌వి అయిపోగానే శంక‌ర‌గిరి మాన్యాలు త‌ప్ప‌వ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి హెచ్చ‌రించారు. మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం జ‌మ్మ‌ల‌మ‌డుగులో సంక‌ల్ప దీక్ష చేప‌ట్టారు.ఈ సంద‌ర్భంగా  ఆదినారాయ‌ణ‌రెడ్డి తీరుపై ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర క‌థ చెప్పారు. ఆ క‌థ ఏంటంటే..

ఓ గ్రామంలో డ్రామా వేస్తున్నారు. భీముడి పాత్రధారి తాగిపడిపోతే.. ఆ ఊరిలో పనికిమాలిన వాడైన ఆదినారాయణ అనే వ్యక్తిని భీముని పాత్ర వేసేందుకు తీసుకువచ్చారు. ఆ వ్యక్తికి నెత్తిన కిరీటం, లావు మీసాలు, భుజాన గద పెట్టారు. దీంతో అతడు భీముడిలా ఫీలయిపోయి.. మనకెందుకురా ఈ వేషాలు ఇంటికి పోదాం పదా అని అన్న తన సోదరుడి తలకాయ తీసిపారేయండి అని ఆజ్ఞాపిస్తాడు. తెల్లవారింది.. డ్రామా అయిపోయింది నెత్తిన కిరీటం, మీసాలు, గద తీసేశారు.. తాను ఆదినారాయణ అని గుర్తుకు వచ్చి కడవ భుజాన వేసుకొని నీళ్లకు వెళ్లిపోతాడు. అంటే మంత్రి ఆదినారాయణరెడ్డి పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. కిరీటం, మీసాలు, గద పెట్టే సరికి బలవంతుడినని ఫీలవుతున్నాడని, తెల్లవారితే డ్రామా అయిపోతుంది.. మంత్రి పదవి ఉండదు.. బుగ్గకారు ఉండదు. ఆదినారాయణరెడ్డికి శంకరగిరి మాన్యాలు తప్పదు. మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి కళ్ల కావరం ఎక్కి రాజకీయ భిక్షపెట్టిన మహానేత వైయస్‌ఆర్‌పైనే విమర్శలు చేస్తున్నార‌ని, ఆయ‌న‌కు జిల్లా ప్ర‌జ‌లు త‌గిన గుణ‌పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు. 



Back to Top