ఇంత‌టి పిరికి ప్ర‌భుత్వాన్ని ఎన్న‌డు చూడ‌లేదు : ఎమ్మెల్యే రోజా

విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న టీడీపీ లాంటి పిరికి ప్ర‌భుత్వాన్ని ఎన్న‌డు చూడ‌లేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిప‌డ్డారు. మ‌హిళా స‌ద‌స్సుకు త‌న‌ను రాకుండా అడ్డుకోవ‌డం దుర్మార్గ‌మ‌ని ఆమె ధ్వ‌జ‌మెత్తారు. విజ‌య‌వాడ‌లో ఈ నెల 10వ తేదీ నుంచి మూడు రోజుల పాటు మ‌హిళా పార్ల‌మెంట్ స‌ద‌స్సును ఏపీ స‌ర్కార్ నిర్వ‌హిస్తున్న సంగ‌తి విధిత‌మే. అయితే ఈ స‌ద‌స్సుకు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ప్ర‌భుత్వ‌మే ఆహ్వానం పంపించింది. ఆమె శ‌నివారం ఈ స‌ద‌స్సులో పాల్గొనేందుకు రాగా గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. ప్ర‌భుత్వ తీరుపై ఎమ్మెల్యే రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె త‌న సందేహాన్ని సెల్ఫీ వీడియో ద్వారా చెప్పింది.  విజ‌య‌వాడ‌లో జ‌రుగుతున్న మ‌హిళా పార్ల‌మెంట్ స‌ద‌స్సుకు మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధుల‌ను, ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించి ఉంటే బాగుండేద‌న్నారు.ఐద్వా జాతీయ కార్య‌ద‌ర్శి బృందాక‌ర‌త్‌తో పాటు తాను ఈ స‌ద‌స్సులో పాల్గొని ఉంటే మ‌హిళ‌ల వాస్త‌వ స్థితిగ‌తులు  ప్ర‌జ‌ల‌కు తెలిసేవన్నారు. ఏపీ అసెంబ్లీ స్సీక‌రు కోడెల శివ‌ప్ర‌సాద‌రావు, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏవిధంగా మ‌హిళ‌ల‌ను అణిచి వేస్తున్నారో అంద‌రికీ తెలుసేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. తానెక్క‌డ వారి భండారం బ‌య‌ట‌పెడ‌తాన‌నో భ‌య‌ప‌డి మ‌హిళా స‌ద‌స్సుకు హాజ‌రుకాకుండా అడ్డుకున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌భుత్వ‌మే త‌న‌ను స‌ద‌స్సుకు ఆహ్వానించి, ఇలా అడ్డుకోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఇంత పిరికివాళ్ల‌ను తానెన్న‌డు చూడ‌లేద‌న్నారు. మ‌హిళాను అణ‌చివేస్తున్న చంద్ర‌బాబుకు ఇలాంటి స‌ద‌స్సును నిర్వ‌హించే యోగ్య‌త లేద‌న్నారు. మ‌హిళా ప్ర‌జాప్ర‌తినిధిపై. పోలీసులు వైఖ‌రి కూడా బాగా లేదని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ చ‌ర్య‌ను ఎండ‌గ‌డ‌తామ‌ని ఆమె హెచ్చ‌రించారు.

Back to Top