చంద్రబాబు పాలనలో రహదారులు పరమ అధ్వానం

 



చిత్తూరు :  చంద్రబాబు పాలనలో రహదారులు పరమ అధ్వానంగా తయారయ్యాయని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు.   మంత్రి లోకేష్‌ మాత్రం రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిప‌డ్డారు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రభుత్వానికి తెలపడం కోసం రోజా వినూత్న నిరసన తెలిపారు. మేళపట్టు గ్రామంలో నీటమునిగిన రోడ్డు మీద మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు. తమ గ్రామంలో రోడ్లు దారుణంగా తయారయ్యాయని.. నీళ్లు నిలిచి పోయి కాలువలను తలపిస్తున్నాయని మేళపట్టు గ్రామ ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు రోజా ఇలా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అభ్యర్థి జెడ్పీటీసీ వెంకటరత్నం సొంత గ్రామం మేళపట్టులోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రహదారులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాలలోకి వచ్చి రోడ్ల పరిస్థితి చూసే ధైర్యం టీడీపీ నేతలకు లేదని మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేశంలో అనేకసార్లు రోడ్ల దుస్టితి గురించి మాట్లాడినా పట్టించుకోలేదన్నారు.   

Back to Top