ఇకనైనా జ్ఞానోదయం కలగాలి..!

అభివృద్ధిని వికేంద్రీకరించాలన్న జననేత..!
వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని ఫైర్..!

వైఎస్సార్ జిల్లాః రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నాడని  ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు అన్ని జిల్లాలను ఒకేలా చూడకుండా భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. రాజధాని అభివృద్ధికి తాము అడ్డు కాదని... అభివృద్ధి అన్ని జిల్లాలకు విస్తరించాలన్నదే తమ అభిమతమన్నారు. 

సీమకు అన్యాయం..!
హైకోర్టును రాజధానిలో కాకుండా మరో జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతం కూడా అభివృద్థి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి మొత్తాన్ని కేంద్రీకృతం చేయడం వల్ల గతంలో ఉద్యమాలు ఊపిరి పోసుకున్నాయని గుర్తు చేశారు. మళ్లీ అలా జరగకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని వైఎస్ జగన్ సూచించారు. శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల మేర నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు అందుతాయని, విద్యుత్ ఉత్పత్తి కోసం శ్రీశైలం నుంచి కిందికి నీరు విడుదల చేయడంతో రాయలసీమ ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారని వైఎస్ జగన్ అన్నారు.  

దుర్మార్గమైన పాలన..!
పద్మావతి మెడికల్ కాలేజి సీట్లను రాయలసీమ వారికి దక్కకుండా చేశారనే భావన ఉందని  వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు అన్ని జిల్లాలను సమానంగా చూడకుండా దుర్మార్గమైన పాలన సాగుస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఇకనైనా జ్ఞానోదయం కలగాలన్నారు.  కరువు మండలాల ప్రకటన చంద్రబాబు పక్షపాత ధోరణికి నిదర్శనమని వైఎస్ జగన్ ఎత్తిపొడిచారు. కరువుతో అల్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటిపోయినా, పులివెందుల నియోజకవర్గంలో ఒక్క మండలాన్నే ప్రకటించారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ప్రాజెక్టులు 80 నుంచి 85 శాతం పూర్తయితే.. ఆయన మరణానంతరం 10 శాతం కూడా పూర్తికాలేదన్నారు.

Back to Top