14 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్‌ జగన్‌ పాదయాత్ర



– ఏలూరు వద్ద వైయస్‌ జగన్‌ పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి
– 15 ఏళ్ల క్రితం వైయస్‌ఆర్‌ కూడా ఇదే జిల్లాలో ఇదే తేదీన పాదయాత్ర
– హోదా ఇచ్చే పార్టీకే ఎన్నికల తరువాత మద్దతు
ఏలూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలో వైయస్‌ఆర్‌సీపీ నేతలతో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మే 14వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లాలోకి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రవేశిస్తుందని, ఏలూరు వద్ద వైయస్‌ జగన్‌ 2 వేల కిలోమీటర్ల మైలు రాయిని దాటుతారని ఆయన పేర్కొన్నారు. మే 14వ తేదీ ఎంతో ప్రాముఖ్యమైందని చెప్పారు. అదే రోజు 15 ఏళ్ల క్రితం మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇదే జిల్లాలో పాదయాత్రలో ఉన్నారని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 13 నియోజకవర్గాలలో వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుందని ఆయన చెప్పారు. 12 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఉంటాయని తెలిపారు. వైయస్‌ జగన్‌ కోసం జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేశారని స్పష్టం చేశారు. రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ఉంటే కేంద్రంపై ఒత్తిడి పెరిగి హోదా వచ్చేది కాదా అని ఆయన సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి పేరుతో రాష్ట్రంలోని యువతను సీఎం మోసం చేసినా లోకేష్‌కు మాత్రం డబుల్‌ బొనాంజా ఇచ్చారని విమర్శించారు. ఇప్పటి పరిస్థితులలో బీజేపీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌సీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సుబ్బారెడ్డి వెల్లడించారు. హోదా ఇచ్చే పార్టీలతోనే ఎన్నికల తరువాత మద్దతు ఇస్తామని వైయస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి చెబుతుందన్నారు.  
 
Back to Top