ప్రజల భవిష్యత్తు ముఖ్యమా..వ్యాపారాలు ముఖ్యమా..!

వైఎస్ జగన్ కు మందకృష్ణ మద్దతు..!
జనం కోసం పోరాడుతున్న జననేతపై కక్షసాధింపా..!

గుంటూరుః ప్రత్యేకహోదా కోసం ఈరోజు న్యాయమైన పోరాటం జరుగుతుందని, 5 కోట్ల ప్రజల ఆకాంక్షను గుర్తు చెస్తూ...వైస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాడుతున్నారని ఎమ్మార్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్షకు మందకృష్ణ మాదిగ సంఘీభావం తెలిపారు. గుంటూరులోని దీక్షా శిబిరానికి వచ్చి జగన్ ను పరామర్శించారు. అనంతరం మందకృష్ణ మాట్లాడుతూ దీక్షలను రాజ్యాంగ విరుద్ధంగా అడ్డుకోవడం మూర్ఖపు చర్య అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 

రాజీనామా చేసి రమ్మంటే ఎగతాళి చేస్తారా..!
ప్రత్యేక హోదా కోసం జగన్ చేస్తున్న ప్రయత్నాలపై టీడీపీ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. కుటిల మనస్తత్వంతో విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. నిలదీయడంలో వైఫల్యం చెందినప్పుడు టీడీపీ నేతలు కేంద్రంలో ఎందుకుండాలని మందకృష్ణ ప్రశ్నించారు. ఏపీ ప్రజల భవిష్యత్తు ముఖ్యమా.. మీ వ్యాపారాలు ముఖ్యమా అని నిలదీశారు.  ప్రత్యేక హోదా సాధించలేనప్పుడు రాజీనామా చేసి రండని ప్రశ్నిస్తే ..మీరు కేంద్రంలో చేరతారా అని జగన్ పై విమర్శలు చేయడం దారుణమన్నారు.

అడ్రస్ లేకుండా పోతారు...!
ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడిని చిక్కుల్లో పెట్టాలన్న ఆలోచన తప్ప టీడీపీ ప్రభుత్వానికి వేరే ఆలోచనే లేదని ఎత్తిపొడిచారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. విభజన సమయంలో అది డిమాండు కూడా కాదు. ఒకప్పుడు విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ నినదించి విశాఖ స్టీలుప్లాంటును ఎలా సాధించుకున్నారో, ఇప్పుడు ప్రత్యేక హోదాను కూడా అలాగే సాధించుకుంటారన్నారు. హోదా ఇవ్వకపోతే ఎన్నికలు ఎప్పుడొచ్చినా అడ్రస్ కూడా లేకుండా పోతారని టీడీపీ, బీజేపీ నాయకులను హెచ్చరించారు.
Back to Top