పరిష్కారం చూపకుంటే యథాతథ స్థితిని కొనసాగించండి

తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు రెండు ప్రాంతాలకూ సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతికీ, ప్రధాన మంత్రికీ  గట్టిగా విజ్ఞప్తి చేసింది. పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నేతృత్వంలో పార్టీ నేతలు మంగళవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లను కలిశారు. రాష్ట్ర విభజనలో అనుసరించిన ఏకపక్ష వైఖరికి నిరసనగా సీమాంధ్రలో వెల్లువెత్తుతున్న ఉద్యమ తీవ్రతను వారి దృష్టికి తెచ్చారు. విభజన నిర్ణయం కారణంగా ఉభయ ప్రాంతాలలో తలెత్తిన పరిణామాలను వివరిస్తూ విడివిడిగా లేఖలను సమర్పించారు. సమన్యాయం చేయడంలో ఇద్దరి జోక్యం అవసరమని శ్రీమతి విజయమ్మ వారికి విజ్ఞప్తిచేశారు. వనరులు, ఆదాయం, జల, విద్యుత్తు, సహజ వనరుల పంపిణీ, ప్రభుత్వోద్యోగుల సర్దుబాటు, హైదరాబాద్ నగరం, తదితర అంశాలను రాష్ట్ర విభజనకు ముందుగానే పరిష్కరించాలని డిమాండు చేశారు. ఇరు ప్రాంతాలకూ సమ న్యాయం ఒనగూర్చలేకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరారు. విభజన ప్రక్రియను నిలిపివేయాలని కూడా కోరారు. ఈ అంశాన్ని పరిశీలించడానికి మంత్రులతో ఓ కమిటీని కేంద్రం త్వరలో ఏర్పాటుచేస్తుందని రాష్ట్రపతి, ప్రధాని తమకు హామీ ఇచ్చారని ఆమె తదుపరి విలేకరులకు చెప్పారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ జీవించి ఉంటే రాష్ట్రానికి ప్రస్తుత పరిస్థితి ఎదురయ్యేది కాదని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని శ్రీమతి విజయమ్మ వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ రాష్ట్రపతికి ఆమె రాసిన లేఖల పూర్తి పాఠం దిగువన ఇస్తున్నాం.


గౌరవనీయులు
శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి,
భారత రాష్ట్రపతి
న్యూఢిల్లీ

ఆర్యా!

యూపీఏ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అంశంపై ప్రదర్శించిన వైఖరికి మేం తీవ్రంగా చింతిస్తున్నాం. తన నిర్ణయానికి ఎటువంటి స్పందన వస్తుందో అనే ఆలోచన లేకుండా అవకాశవాదంతో ఈ చర్యకు దిగింది. రాష్ట్రాల విభజనకు రెండో ఎస్సార్సీని ఏర్పాటుచేయాలని 2001లో నిర్ణయించిన కేంద్రం 2013 జూలై 30న మాత్రం కేవలం ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణ  విభజనకు సీడబ్ల్యూసీ మొగ్గుచూపి, మిగిలిన రాష్ట్రాల డిమాండ్లను పెడచెవిన పెట్టింది. సీడబ్ల్యూసీ తీసుకున్న ఏకపక్ష, నిరంకుశ నిర్ణయంపై సీమాంధ్ర ప్రాంతంలోని ప్రజలు తీవ్రంగా స్పందించారు. తమకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ రోడ్లపైకి వచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రాజకీయ పార్టీలకు అతీతంగానూ, స్వచ్ఛందంగానూ ఉద్యమం సాగుతోంది. ఈ కారణంగా ఆ ప్రాంతంలో పరిపాలన స్తంభించింది. ఎన్జీఓలు, ఉపాధ్యాయులు, లాయర్లు, రవాణ రంగ సంఘాలు ఇలా ఒకటేమిటి అన్ని రంగాల వారు ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు.

దీనికి ముఖ్యకారణం క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం కనుగొనకుండానే విభజన నిర్ణయం తీసుకోవడం. హైదరాబాద్ వంటి రాజధానిని ఆంధ్ర ప్రాంతానికి నిర్మించుకోవడానికి ఎంతో సమయం, ఎంతో ఖర్చు అవుతాయి. సామాజిక, పారిశ్రామిక అవసరాల ఏర్పాటు కూడా అవసరం. వీటిని పక్కన పెట్టి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం శోచనీయం.

హైదరాబాద్ రాజకీయ రాజధానిగానే కాక, అత్యంత శక్తిమంతమైన ఆర్థిక శక్తిగా ఎదిగింది. జీడీపీలో 75%, సాఫ్టువేర్ కార్యకలాపాల్లో 95% ఇక్కడినుంచే సాగుతున్నాయి. ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధన శాలలు కూడా ఇక్కడే ఉన్నాయి. రాష్ట్రానికి చెందిన 40శాతం ఆదాయాన్ని హెచ్ఎమ్‌డీఏ పరిథినుంచే వస్తోంది. ప్రభుత్వాలు కేవలం హెచ్ఎమ్‌డీఏ పరిథిలోనే పారిశ్రామికాభివృద్ధికి దోహద పడ్డాయి. మిగిలిన జిల్లాలలో  ఇక్కడికంటే మెరుగైన సౌకర్యాలున్నప్పటికీ వాటివైపు ప్రభుత్వాలు కన్నెత్తిచూడలేదు. మిగిలిన రాష్ట్రాలు అన్ని జిల్లాల్లో సమానంగా అభివృద్ధి చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ దీని హెచ్ఎమ్‌డీఏ పరిథిలోనే ఉండడంతో అనుబంధ పరిశ్రమలు కూడా సహజంగానే ఆ పరిసరాలలోనే నెలకొల్పారు. ఇప్పుడవి ఎంతో ఉన్నతిని సాధించాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆంధ్ర ప్రాంతానికి చెందిన పెట్టుబడిదారులు హైదరాబాద్ నగరానికి తరలివచ్చారు. ఎందుకంటే అది మన రాజధాని కాబట్టి.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీస్తే ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈ పెట్టుబడులన్నీ ఏమవుతాయి? ఈ పరిశ్రమలన్నింటినీ ఇక్కడినుంచి ఆంధ్ర ప్రాంతానికి తరలించడం సాధ్యమయ్యేపనేనా? హైదరాబాద్ మాదిరిగానే ఆంధ్ర ప్రాంతంలో ఆర్థిక, పారిశ్రామిక వనరులను సృష్టించుకోవడానికి ఎంత సమయం పడుతుంది. ఆంధ్ర ప్రాంతానికి వాటిల్లే ఆదాయ నష్టాన్ని కేంద్రం ఎలా పూడుస్తుంది. హైదరాబాద్ పరిథిలో ఉన్న సంస్థలన్నీ ఆంధ్ర ప్రాంతంలో నెలకొనేలా కేంద్రం చర్యలు తీసుకోగలదా..
సాగు నీటి ప్రాజెక్టులు, జల పంపిణీ పరిస్థితి ఏమవుతుంది. ఇప్పటికీ రాష్ట్రాల్లో 62శాతం వ్యవసాయంపైనే ఆధారపడిఉన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా నదులపై బ్రిటిష్ ప్రభుత్వం 1850లోనే నాలుగు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించింది. స్వాతంత్ర్యానంతరం నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులను ఆంధ్ర ప్రదేశ్ నిర్మించుకుంది. వీటిలో ఆంధ్ర, తెలంగాణాల వాటా ఎంతనేది ముందుగానే నిర్ణయించుకుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ నీటి విడుదల సాఫీగా సాగిపోతోంది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను, ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం పక్కన పెట్టి ఎగువ రాష్ట్రాలు నిర్ణీత పరిమాణంలో నీటిని ఇప్పటికే విడుదల చేయడం లేదు. మరో రాష్ట్రం ఏర్పడితే ఈ ప్రాజెక్టులు మరింత కష్టాల్లో కూరుకుపోతాయి. తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు విడుదల కాక రాయలసీమ ప్రాంతం ఎలా ఇబ్బందిపడుతోందో కళ్ళారా చూస్తున్నాం. కేటాయించిన దానిలో కేవలం 60 శాతం మాత్రమే విడుదలవుతోంది. కొత్త రాష్ట్ర ఏర్పాటువల్ల ఈ సమస్యలు రెట్టింపవుతాయి. ఆంధ్ర ప్రాంతానికి ఉప్పునీరే గతవుతుంది. 1959లో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న భద్రాచలం ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉంది. ఇది పరిష్కరాం కాకపోతే పోలవరం ప్రాజెక్టుకు చాలినంత నీరొస్తుందని కేంద్ర జల వనరుల మండలి ఎలా భావిస్తుంది.


ఈ ముఖ్యమైన అంశాలకు పరిష్కారాన్ని కనుగొనకుండా రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్ర ప్రాంత ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తుంది.  2012 డిసెంబరు 28న ఏర్పాటైన అఖిల పక్ష సమావేశంలో ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచించింది.
 

కేంద్రం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటే తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా న్యాయం చేస్తారు.. రాష్ట్రాన్ని విభజించాలనుకుంటే ముఖ్య అంశాలను ఎలా పరిష్కరిస్తారు, రాజధాని ఏర్పాటు, మౌలికవసతుల కల్పన వంటి అంశాలను ప్రస్తావిస్తారని ప్రజలు భావించారు. కానీ ఎటువంటి అంశాన్నీ ప్రస్తావించకుండానే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రంగా విడదీస్తామని కాంగ్రెస్ ప్రకటించడం  శరాఘాతంలా పరిణమించింది. 57 సంవత్సరాలుగా ఆంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజలు హైదరాబాద్ నగరంలో ప్రశాంతంగా జీవిస్తున్న విషయాన్ని గమనించాలి. స్టేక్ హోల్డర్సును సంప్రతించకుండా నేరుగా కేంద్ర కేబినెట్ కు నివేదించడం శోచనీయం. ఇది చాలా దురదృష్టకరం.

రాజకీయ ప్రయోజనాల కోసమే అంటే రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే పది లేదా 15 లోక్ సభ ఎంపీల సీట్లకోసమే కాంగ్రెస్ తెలంగాణను విడదీసింది. దీనికి నిరసనగా తమ ఎమ్మెల్యేలు పదహారు మంది రాజీనామాలు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిరంకుశంగా సమస్యలకు పరిష్కారాలు సూచించకుండానే తెలంగాణ ఏర్పాటుకు నడుంబిగించింది.
రాష్ట్ర విభజన చేస్తామన్ని సీడబ్ల్యూసీ ప్రకటన అనంతరం అన్ని సమస్యలను పరిష్కరించిన తరవాతనే ముందుకు వెళ్ళాలని వైయస్ఆర్ కాంగ్రెస్ కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ అంశాలను పరిశీలించడానికి అన్ని వర్గాలతో అత్యున్నత కమిటీని నియమిస్తారని భావించాం. కానీ కాంగ్రెస్ తన  పార్టీకే చెందిన ఎ.కె. ఆంటోని నేతృత్వంలో కమిటీని వేయడం బాధించింది. దీనిని నిరసిస్తూ తానూ, పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీ, ఎంఎల్ఏ పదవులకు రాజీనామా చేశాం. ప్రజలకు న్యాయం జరిగేందుకు పోరాడాలని నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ నిర్ణయం వల్ల ఎదురయ్యే విపరిణామాలను వివరిస్తూ బహిరంగ లేఖను కూడా ప్రధానమంత్రికి రాశాం. ఆ కాపీని మీకు అందిస్తున్నాం. మా పార్టీ ఎమ్మెల్యేలు, నేను కూడా నిరవధిక దీక్షకు పూనుకున్నాం. కానీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా మా ప్రయత్నాన్ని విఫలం చేసింది. ప్రస్తుతం మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలులో నిరాహార దీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితి క్రమేపీ చేయిదాటుతోందని విన్నవిస్తున్నాం. పరిపాలన పూర్తిగా స్థంభించింది. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బదులకు లోనవుతున్నారు.

ఈ పరిణామాల దృష్ట్యా తమరు జోక్యం చేసుకుని తగిన చర్యలు చేపట్టి, పరిస్థితిని చక్కదిద్దాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవిస్తున్నాం. న్యాయం చేయలేకపోతే.. ఆంధ్ర ప్రదేశ్ విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని కోరుతున్నాం.

అభినందనలతో

మీ భవదీయురాలు
శ్రీమతి వైయస్ విజయమ్మ

తాజా వీడియోలు

Back to Top