లోకేష్ బాబు షోకేస్ బాబులా తయారయ్యాడు

  • ఆస్తుల ప్రకటన బూటకం
  • బాబు లోకేష్ తో అబద్దాలు బాగా ఆడిస్తున్నాడు
  • చంద్రబాబు అక్రమాస్తులను తెహల్కా ఎప్పుడో బయటపెట్టింది
  • సిట్టింగ్‌ జడ్జి, సీబీఐతో విచారణ జరిపించాలి
  • వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి

హైదరాబాద్‌: నారా లోకేష్‌ వెల్లడించిన ఆస్తుల ప్రకటన అంతా ఒక బూటకమని, ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌తో విచారణ జరిపించినా అవినీతి ఆస్తులు ఒక్కొక్కటిగా బయటపడతాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ పేదరిక కుటుంబం మాదిరిగా లోకేష్‌ ఆస్తులను ప్రకటించాడన్ని భూమన తీవ్రంగా తప్పుబట్టారు. తప్పుడు స్టేట్‌మెంట్లతో లోకేష్‌ ప్రజలను మోసం చేస్తున్నారని ఫైరయ్యారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చినబాబు ప్రకటన అనంతరం టీడీపీ నేతలు మైకుల ముందు కూర్చొని బాబు కుటుంబం ఆదర్శవంతమైందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. చంద్రబాబు దేశంలో కల్లా ధనికుడైన ముఖ్యమంత్రి అని 13 సంవత్సరాల క్రితమే తెహల్కా డాట్‌ కమ్‌ అనే ప్రసార మాద్యమం బయటపెట్టిందన్నారు.  అక్రమాస్తులు, దోపిడీతో ఎదిగిన బాబు నేర చరిత్రను బట్టబయలు చేసిందని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలా అని ప్రశ్నించారు. తీవ్రవాది బిన్‌లాడెన్, అమన్, హిట్లర్‌ లాంటి వాళ్లను ఎవరూ ఆదర్శంగా తీసుకోరని, చంద్రబాబును ఆదర్శంగా తీసుకుంటే అంతకంటే ప్రమాదకరమని విమర్శించారు. 

లోకేష్‌బాబు టీడీపీ షోకేస్‌బాబు
చంద్రబాబు కుటుంబం ఆస్తుల ప్రకటన దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని, ఆస్తులు ప్రకటించినా, ప్రకటించకపోయినా ప్రజలకు ఒరిగేదేమీ లేదని భూమన వ్యాఖ్యానించారు. బాబు ఆస్తుల ప్రకటన విని...నాకంటే పేదవాడు దేశంలో లేడని అంబానీ ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన బతుకుతున్నామని చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌తో అబద్ధాలను బాగా మాట్లాడించారన్నారు. లోకేష్‌బాబు టీడీపీకి షోకేస్‌బాబులా తయారయ్యాడని ఎద్దేవా చేశారు. 2010 సెప్టెంబర్‌ 2వ తేదిన మొదటి సారిగా బాబు తన ఆస్తులను ప్రకటించారని, ఒక పక్క రాష్ట్రమంతా విషాదకరంగా దివంగత మహానేత వైయస్‌ఆర్‌ వర్థంతి నిర్వహిస్తుంటే చంద్రబాబు ఆస్తులను ప్రకటించారన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన వార్తను పక్కదోవ పట్టించేందుకు బాబు ఆస్తుల ప్రకటన చేస్తారన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి వాటాల విషయంలో బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ తుది తీర్పును ప్రకటించిన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయంపై నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు బాబు లోకేష్‌తో తప్పుడు ఆస్తుల ప్రకటన చేయించారని మండిపడ్డారు. 

బాబు పాపిష్టి సొమ్మును చూసేందుకు రెండు కళ్లు సరిపోవు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జీతో, సీబీఐతో విచారణ జరిపించాలని భూమన డిమాండ్‌ చేశారు. ప్రపంచ దేశాల్లోని బ్యాంకులు ఏ ఒక్క ప్రకటన చేసినా బాబు ఆస్తులు ఎంతో తెలుస్తాయన్నారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతికరమైన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు ఒక్కరేనని స్పష్టం చేశారు. అలీబాబా 40 మంది దొంగల కథలో గుహ ముందు ఓపెన్‌ షశయ అన్నట్లు లోకేష్‌ బాబు గుహ ముఖద్వారం మాత్రమే చెప్పారన్నారు. బాబు ఆస్తుల గుహ ద్వారం తెరుచుకుంటే అవినీతి ఖజానా విశ్వరూపం బయటపడుతుందన్నారు. చంద్రబాబు అవినీతి ఖజానాలో అక్రమ ఆస్తులను చూడటానికి రెండు కళ్లు సరిపోవవని పాపిష్టి సొమ్మంతా గుహలో కూరుకుపోయివుంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అంబాసిడర్‌ కారుకు మించి తన వద్ద ఏమీ లేదంటూ బాబు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. 2014లో హెరిటేజ్‌ షేర్‌ల విలువలు రూ. 199 ఉంటే ప్రస్తుతం రూ. 910గా చూపించారని, హెరిటేజ్‌ పాడి పరిశ్రమ కాదు పాడు పరిశ్రమ అని విమర్శించారు. ఆ పాడు పరిశ్రమ కారణంగానే బాబు ఆస్తుల విలువలు పెరిగాయన్నారు. విలోమ సిద్ధాంతం మాదిరిగా బాబు ఆస్తులు పెరిగితే రాష్ట్రం పేదరికంతో దిగజారుతుందని, రాష్ట్రం సుభిక్షంగా ఉంటే బాబు ఆస్తులు తరుగుతాయన్నారు. 

భూతాలు భగవద్గీత శ్లోకాలు వల్లించడమే
ఆస్తులు ప్రకటించిన చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ నేతలు చెప్పడం హేయనీయమన్నారు. ఏ విషయంలో బాబును ఆదర్శంగా తీసుకోవాలని ప్రశ్నించారు. హోదాను తాకట్టుపెట్టినందుకా? లేక ఓటుకు కోట్ల కేసులో ఇరుక్కొని కేంద్రం దగ్గర సాగిలపడినందుకా? సొంత మామను వెన్నుపోటు పొడిచినందుకు ఆదర్శంగా తీసుకోవాలా అని నిలదీశారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ప్రాజెక్టు, పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో వందల కొద్ది హామీలు ఇచ్చి తుంగలో తొక్కి రైతాంగం ఉసురుపోసుకున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడాన్ని ఆదర్శంగా తీసుకోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబును దోపిడీ దొంగలు, అవినీతి పరులు, వెన్నుపోటు దారులు ఆదర్శంగా తీసుకుంటారని స్పష్టం చేశారు. దేశంలోనే ఏ రాజకీయ నేతకు లేనన్ని ఆస్తులను చంద్రబాబు కుటుంబం కూడబెట్టిందన్నారు. ఇప్పటికైనా ఇలాంటి సుద్దులు మానుకోవాలని హితవు పలికారు. బలి చక్రవర్తుల వారసుల్లా మాట్లాడడం అంటే భూతాలు భగవద్గీత శ్లోకాలు వల్లించడమేనని ఎద్దేవా చేశారు. 
 
Back to Top