వైయస్సార్‌సీపీని బలోపేతం చేద్దాం

– చురుకైన కార్యకర్తలకు బూత్‌ కమిటీల్లో చోటు
– రాష్ట్రకార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రంగేగౌడ్‌

మడకశిర: మండలంలో వైయస్సార్‌సీపీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని వైయస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీగోవర్ధన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి రంగేగౌడ్‌ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. స్థానిక ఆర్‌అండ్‌బీ బంగ్లాలో బుధవారం మండల స్థాయి వైయస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశాన్ని పట్టణ కన్వీనర్‌ బీఎల్‌ రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. పార్టీ సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి సూచనల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైసీ గోవర్ధన్‌రెడ్డి, రంగేగౌడ్‌ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నాయని దీంతో పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసి వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మడకశిర నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగరాలని కోరారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా బూత్‌ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీల్లో చురుకైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అవకాశం కల్పించాలని కోరారు. అన్ని వర్గాలకు బూత్‌ కమిటీల్లో అవకాశం కల్పించి తద్వారా పార్టీని బలోపేతం చేయాలని కోరారు. గడపగడపకు వైఎస్సార్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ వివరించాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ కన్వీనర్‌ బీఎల్‌ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి వార్డులో కూడా గడప గడపకు వైఎస్సార్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. ఈసమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల మాజీ కన్వీనర్‌ చౌడారెడ్డి, మాజీ సర్పంచులు శ్రీరాములు, రామిరెడ్డి, మండల వైఎస్సార్‌సీపీ నాయకులు ఆర్‌.అనంతపురం తిమ్మప్ప, హనుమంతరెడ్డి, రేకులకుంట శ్రీరాములు, సత్యనారాయణ, మంజునాథ్, లక్ష్మీనారాయణ, దేవరాజు, కెంచప్ప తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top