కుటిల వ్యూహాలకు అసెంబ్లీని వేదికగా మార్చొద్దు

హైదరాబాద్: ప్రజా సమస్యలను చర్చించకుండా సభను దారి తప్పించే కుటిల వ్యూహాలకు శాసన సభను వేదికగా మార్చొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావులకు ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కమిటీ ఆన్ జనరల్ పర్పస్ సమావేశాన్ని ఈనెల 11వ తేదీన నిర్వహిస్తామని చెప్పడం, అందులో ప్రతిపక్షం నుంచి కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పీకర్తో కలిపి మొత్తం 25 మందిని దీనికి పిలుస్తుండగా..తనతో కలిపి కేవలం ముగ్గురికే ప్రతిపక్షం నుంచి అవకాశం ఇవ్వడమేంటని నిలదీశారు. దామాషా పద్ధతిని పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము ఢిల్లీలో ధర్నా చేస్తున్న రోజే ఈ సమావేశం నిర్వహించడం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. అసలు కమిటీ ఆన్ జనరల్ పర్పస్ సమావేశం గత 12 ఏళ్లలో ఏనాడూ జరగలేదని ఆయన చెప్పారు. 1995-2004 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కేవలం ఒక్కసారి మాత్రమే, అది కూడా తూతూమంత్రంగా సమావేశాన్ని నిర్వహించినట్లు చెబుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. కనీసం సమావేశానికి సంబంధించిన ఎజెండాను ఇవ్వడానికి కూడా శాసనసభ కార్యాలయం సిద్ధంగా లేదని ఆయన మండిపడ్డారు. రానున్న వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలు, అవినీతి, అన్యాయాలపై చర్చ జరగకుండా ఉండేందుకే ఒక పథకం ప్రకారం అత్యున్నతమైన శాసన సభను ఉపయోగించుకుంటున్నారన్న విషయం ఎవరికైనా అర్థం అవుతుందన్నారు.








Back to Top