<br/><br/>విజయనగరం : గతంలో బాక్సైట్ తవ్వకాల కోసమే అరకు ఎంపీ, ఎమ్మెల్యే పార్టీ మారారన్న గిడ్డి ఈశ్వరి... ఇప్పుడు ఆమె కూడా బాక్సైట్ తవ్వుకోవడానికే టీడీపీలోకి వెళ్లారా? అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి సూటిగా ప్రశ్నించారు. గిరిజనుల అభివృద్ధి చూసే పార్టీ మారానని గిడ్డి ఈశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరడం పట్ల పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆమె విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో అరకు, పాడేరులో మళ్లీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని చెప్పడం మీ మాట్లోనే విన్నామన్నారు. వైయస్ జగన్ ఎవరైతే కోట్లు ఇస్తారో వారికే సీట్లు కేటాయిస్తున్నారని ఇప్పుడు గిడ్డి ఈశ్వరి చెప్పడం దురదృష్టకరమన్నారు. అలా అయితే మీరు ఎన్నికోట్లు ఇస్తే...2014లో మీకు వైయస్ జగన్ సీటు ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. నిన్న, మొన్నటి వరకూ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, చంద్రబాబు నాయుడును విమర్శించేవారు రాత్రికి రాత్రే పార్టీ మారేంత అభివృద్ధి ఏం కనిపించదన్నారు. గిరిజనులకు టీడీపీ సర్కార్ చేస్తున్న వ్యతిరేక విధానాలపై ప్రశ్నించిన మీరు ... మళ్లీ గిరిజనులకు చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరుతున్నట్లు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. ఆనాడు టీడీపీ నేతలు మా పార్టీకి వస్తే రూ.30కోట్లు ఇస్తామని చెప్పారన్న గిడ్డి ఈశ్వరి...ఇప్పుడు ఎన్నికోట్లు ఇస్తే మీరు పార్టీ మారారో చెప్పాలని పట్టుబట్టారు. వైయస్ఆర్ సీపీలో ఆత్మాభిమానం లేదన్న మీరు... నిజంగా మీకు ఆత్మాభిమానం ఉంటే తక్షణమే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ తరపున నిలబడి గెలవాలి అని పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. <br/>