ఖాళీ అయిపోయిన పార్టీ కాంగ్రెస్



దొమ్మేరు (ప.గో.జిల్లా)
: ‘కాంగ్రెస్ పార్టీ
‌నాయకులు తమదని చెప్పుకుంటున్న ఓటు బ్యాంకు
ఇప్పుడు వాళ్లది కాదు.. అది ఎప్పుడో మాదైపోయింది. బొత్సగారూ (పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ)
మీరు ఇంకా ఏ భ్రమల్లో ఉన్నారు? మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కనప్పుడు మీకు ఆ
విషయం అర్థం కాలేదా? కాంగ్రె‌స్ పార్టీ
ఇప్పుడు ఖాళీ పార్టీ అయిపోయింది. నాయకులు తప్పితే ఆ పార్టీతో ప్రజలు ఎవ్వరూ లేరు’ అని
వైయస్‌ఆర్‌ ‌కాంగ్రెస్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు.‌ ‘మహాత్మా గాంధీ ఆదర్శం
అని చెప్పుకుంటూనే ఒక మద్యం మాఫియా డాన్‌ను ఈ రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షుడిగా పెట్టారు.. దీనికి కాంగ్రె‌స్ పార్టీ, ఆ పదవిలో ఉన్న బొత్స సిగ్గు పడాలి’ అని ఆమె విమర్శించారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు
నాయుడు ‌తీరుకు నిరసనగా శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’
పాదయాత్ర సోమవారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో కొనసాగింది. దొమ్మేరు భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి
శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

జగనన్నను ఏ కోర్టూ
దోషి అని అనలేదు :

‘శ్రీ
జగన్మోహన్‌రెడ్డి అవినీతికి పాల్పడ్డారు
కాబట్టే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వలేదని
బొత్స అంటున్నారు. నిజానికి శ్రీ
జగన్మోహన్‌రెడ్డి దోషిగా జైలులో లేరు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ల పెరట్లో ఉన్న కుక్కను, ఒక గుంటనక్కను
జగ‌న్మోహన్‌రెడ్డి మీద ప్రయోగిస్తే
అది దర్యాప్తు సంస్థ
అనుకొన్న సుప్రీంకోర్టు.. ఆ సంస్థ దర్యాప్తు జరపడానికి ఇంకా సమయం కావాలని అడిగితే సరేనంది.
జగనన్న మీద ఇంకా విచారణే
మొదలు కాలేదు. అలాంటపుడు ఏ కోర్టయినా శ్రీ
జగన్మోహన్‌రెడ్డిని ఎలా దోషి అంటుందనే
ఇంగితం కూడా బొత్సకు లేదా? అసలు ఆయనపై కేసులు ఎందుకు పెట్టారో బొత్సకు తెలియదా? శ్రీ జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవే
కావని, ఈపాటికి ఆయన ఏ మంత్రో, ముఖ్యమంత్రో అయిపోయి ఉండేవారని మీ పార్టీకే చెందిన కేంద్ర
నాయకులు గులాంనబీ ఆజా‌ద్ చెప్పింది
మీరు వినలేదా?‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి మీద కేసులు పెట్టింది
మన రాష్ట్ర జనాభాలో ఉన్న ఏ ఒక్క పౌరుడూ కాదు. జగనన్న మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. దాన్ని బట్టి మీకు
అర్థం కావటం లేదా? ఇది పొలిటిక‌ల్ కేసు
తప్ప మరోటి కాదని.‌ బొత్సా సమాధానం
చెప్పండి' అన్నారు.

'మహానేత డాక్టర్‌
వైయస్‌ఆర్ చేసిన
పథకాలన్నీ ‌ఆయనవి కావని, అవన్నీ
కాంగ్రెస్ పార్టీవని
బొత్స మరో మాట అన్నారు. అవి కాంగ్రె‌స్ పార్టీ
పథకాలే అయితే మిగిలిన కాంగ్రె‌స్ పాలిత
రాష్ట్రాల్లో ఎందుకు అమలు కావడం లేదో ఆయనే సమాధానం చెప్పాలి. అ‌వి కాంగ్రె‌స్ పథకాలే అయితే ఇప్పుడున్న
ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి.. వాటికి ఎందుకు
తూట్లు పొడుస్తున్నారో.. ఆయన సొంత పథకాలు ఎందుకు పెడుతున్నారో చెప్పాలి. అవన్నీ కాంగ్రెస్ పథకాలు కావు కనుక, వైయస్‌ఆర్‌వే కనుక, వాటి మీద మాకే
హక్కు ఉంది కనుక, ఈ పథకాలను అమలుచేసే చిత్తశుద్ధి మాకే ఉంది కనుక మా జెండాలో వాటిని
పెట్టుకున్నాం‌' అని శ్రీమతి
షర్మిల వ్యాఖ్యానించారు.

మీపై విచారణ కోరరేం?
:

‌'బొత్స మన రాష్ట్రంలోనే
పెద్ద లిక్కర్ మాఫియా
డా‌న్ అని,
రాష్ట్రమంతటా ఆయన బినామీలే మద్యం వ్యాపారం చేస్తున్నారని కాంగ్రె‌స్ పార్టీ వాళ్లే ఆరోపిస్తున్నారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఇలాంటి ఆరోపణలు వస్తే ఆయనే స్వయంగా విచారణకు
ఆదేశించుకునే వారు. మరి మీపై వస్తున్న ఆరోపణలకు ఎందుకు విచారణ కోరడం లేదు బొత్సగారూ?
మీ లిక్కర్ వ్యాపారం
మీద దాడులు చేసి అక్రమాలను బయటపెట్టిన ‌ఎసిబి అధికారులను అర్ధంతరంగా బదిలీలు చేయించిన చరిత్ర
మీది కాదా?' అని శ్రీమతి
షర్మిల నిలదీశారు.

డాక్టర్ వై‌యస్‌ఆర్ మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ
మేలు చేశారు. బొత్స కుటుంబానికి వై‌యస్‌ఆర్ ఎంత
మేలు చేశారో ఆయనకు గుర్తులేకపోతే ఆయన కుటుంబంలోనే ఎన్నో పదవులు అనుభవిస్తున్న ఆయన భార్యను, తమ్ముడిని, బావమరిదిని అడిగితే వాళ్లే చెప్తారు. కృతజ్ఞత లేని మనిషి, విలువలు,
విశ్వసనీయత లేని మనిషి.. మనిషే కాదు.‌
ఇవన్నీ లేకపోతే మనిషికీ, మృగానికీ తేడా లేదు. మన బొత్సగారికి ఇది ఎప్పుడు అర్థమవుతుందో!
మన ఖర్మ కొద్దీ ఇలాంటి నాయకులు ఉన్నారు.. వారి చేతిలో ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంతో
కుమ్మక్కైన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఒకప్పుడు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం సాక్షిగా ప్రజలను వెన్నుపోటు
పొడిచారు. ఈ ప్రభుత్వంపై అన్ని పార్టీలూ అవిశ్వాసం పెడితే.. చంద్రబాబు రెండు చేతులు
అడ్డంపెట్టి కాపాడారు. ప్రజలు చాలా తెలివైన వారు చంద్రబాబూ! వారు అన్నీ గమనిస్తున్నారు.
అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్, ‌టిడిపిలకు బుద్ధి చెప్పి జగనన్నను
ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు’
అన్నారు.

15 కిలోమీటర్ల మేర పాదయాత్ర :

‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 168వ రోజు సోమవారం పశ్చిమగోదావరి
జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని ఎస్.ముప్పవరం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి చాగల్లు,
మీనానగరం, పంగిడి, కాపవరం మీదుగా నడుచుకుంటూ శ్రీమతి షర్మిల
దొమ్మేరు చేరుకున్నారు. ఇక్కడ భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. దొమ్మేరు శివారులో ఏర్పాటు చేసిన బస
కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. సోమవారం మొత్తం 15 కిలోమీటర్లు నడిచారు.
ఇప్పటి వరకు మొత్తం 2,222.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది.

నేటి నుంచి తూర్పులో షర్మిల యాత్ర :

ఇప్పటిదాకా 10 జిల్లాల్లో సాగిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర
మంగళవారం 11వ జిల్లా తూర్పుగోదావరిలోకి అడుగుపెడుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం
వరకు 22 రోజులపాటు 13 నియోజకవర్గాల్లో 278.4 కిలోమీటర్లు నడిచిన శ్రీమతి షర్మిల మంగళవారం కొవ్వూరు బ్రిడ్జి మీదుగా తూర్పుగోదావరిలో అడుగుపెడతారని
పార్టీ కార్యక్రమాల రాష్ట్ర సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో
మొత్తం 20 రోజుల పాటు, 275 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుందని, రాజమండ్రి సిటీ, రాజమండ్రి
రూరల్, రాజానగరం, అనపర్తి,
మండపేట, రామచంద్రాపురం, కాకినాడ రూరల్‌ కాకినాడ
సిటీ, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, పత్తిపాడు, తుని.. మొత్తం 13 నియోజకవర్గాల్లో శ్రీమతి ‌షర్మిల నడుస్తారని వివరించారు.

ఆ బ్రిడ్జిపై ఆ ముగ్గురి పాదయాత్ర :

కొవ్వూరు బ్రిడ్జి.. ఇది తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే
వారధి. ఈ రోడ్డు కం రైలు బ్రిడ్జితో వైయస్‌ఆర్‌
కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రజా సమస్యలపై వైయస్‌ఆర్‌ కుటుంబం చేసిన యాత్రలకు
ఈ బ్రిడ్జే వారధిగా ఉంది. వైయస్‌ఆర్‌
చేసిన ప్రజాప్రస్థానం, ‘పోలవరం ప్రాజెక్టు’ కోసం శ్రీ
వైయస్‌ జగన్‌ చేసిన పాదయాత్ర ఈ బ్రిడ్జి
మీదుగానే సాగాయని, శ్రీమతి షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
కూడా ఇప్పుడు ఇదే బ్రిడ్జి మీదుగా సాగుతోందని తలశిల రఘురాం తెలిపారు.

Back to Top