కేసీఆర్, బాబు ఇద్దరు చేస్తున్నది ఒక్కటే

()సీఐడీ డిపార్ట్ మెంట్ ను అక్రమంగా ఉపయోగించి బాబు కుట్రలు
()కాపులు, బీసీల మధ్య చిచ్చుపెట్టి చలిమంట కాగుతున్నారు
()ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వు టీడీపీకి చెంపపెట్టు లాంటిది
()ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిందే
()వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

గుంటూరుః  తునిలో కాపు గర్జన సందర్భంగా జరిగిన ఘటనపై ఏదోవిధంగా వైయస్సార్సీపీ ప్రమేయాన్ని చొప్పించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండపడ్డారు. సీఐడీ డిపార్ట్ మెంట్ ను అక్రమంగా ఉపయోగించి భూమన కరుణాకర్ రెడ్డి, అధ్యక్షులు వైయస్ జగన్ పై అపవాదు వేయాలన్న ప్రభుత్వ కుయుక్తులను వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా భూమన కరుణాకర్ రెడ్డిని మూడు రోజుల పాటు గంటల తరబడి కూర్చోబెట్టి పంపించడం ప్రభుత్వ నాటకంలో భాగమేనని దుయ్యబట్టారు. తునిలో ఘటన జరుగుతున్న సందర్భంలోనే ఇది కాపులకు సంబంధించింది కాదు... కడప రౌడీలు ఈవిధ్వంసానికి పాల్పడ్డారని ముఖ్యమంత్రి చెప్పడంలోనే కుట్ర దాగి ఉందని చెప్పారు. ఎలాంటి విచారణ జరగకుండానే ముఖ్యమంత్రి అలా ఎలా చెబుతారని గుంటూరులో మీడియా సమావేశంలో అంబటి నిలదీశారు. 

బీసీలను రెచ్చగొడుతున్న బాబు
తాను అధికారంలోకి వస్తే బీసీలకు నష్టం జరగకుండా ఆర్నెళ్లలోనే కాపులను బీసీల్లో చేరుస్తానని చెప్పిన చంద్రబాబు...ఇచ్చిన హామీని విస్మరించి కాపులు, బీసీల మధ్య ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని అంబటి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఇచ్చిన హామీనే కాపులు అడుగుతున్నారని, కొత్తగా ఏమీ అడగడం లేదని చెప్పారు. ఇదే విషయాన్ని బీసీ సోదరులు అర్థం చేసుకోవాలన్నారు. కాపులకు, బీసీలకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని అంబటి స్పష్టం చేశారు. కుట్రపూరితంగా మంజునాథ కమిషన్ వెళ్లిన చోటల్లా.. బీసీలను కాపులమీదకు రెచ్చగొట్టి రాజకీయ లబ్దిపొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరూ ఆవేశపడొద్దని చెప్పాల్సిన బాబు.... ఇద్దరి మధ్య మంట పెట్టి చలికాగాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. అలా చేయడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు. 

స్పీకర్ వ్యవస్థ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉమ్మడి హైకోర్టు ఆర్డర్ వేయడం టీడీపీ సర్కార్ కు చెంపపెట్టు లాంటిదని అంబటి రాంబాబు అన్నారు. కేసీఆర్ తెలుగుదేశం ఎమ్మెల్యేలను కొంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మరి ఏపీలో చంద్రబాబు చేస్తున్నదేంటని నిలదీశారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు ఇద్దరు చేస్తున్నది ఒక్కటేనని చెప్పారు. అక్కడో విధంగా, ఇక్కడో విధంగా మాట్లాడడం సమంజసం కాదన్నారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తుర్వు నైతికంగా స్పీకర్ కు, ఏపీకి కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని కొనుక్కున్న 20 మంది ఎమ్మెల్యేల చేత తక్షణమే రాజీనామా చేయించి ఎన్నికలకు పోవాలని బాబు సర్కార్ ను డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే స్పీకర్ వ్యవస్థ సరైంది కాదని కోడెల శివప్రసాదరావుకు సూచించారు. చట్టప్రకారం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూన్నెళ్లలోపు అనర్హత వేటు వేయాలని...లేకపోతే న్యాయస్థానాలు ఇంటర్ ఫియర్ అవ్వక తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  
Back to Top