కర్నూలుజిల్లాలో ప్రవేశించిన షర్మిల పాదయాత్ర

కర్నూలు, 8 నవంబర్‌ 2012: 
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం కర్నూలు జిల్లాలో ప్రారంభమైంది. సాయంత్రం 4.47 నిమిషాలకు షర్మిల మద్దికెర చేరుకోవడం ద్వారా కర్నూలు జిల్లాలో పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లయింది.


కర్నూలు జిల్లాలో 14 రోజులు షర్మిల పాదయాత్ర చేస్తారు. పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కొడుమూరు, పాణ్యం, కర్నూలు నియోజకవర్గాల్లో ఆమె పాదయాత్ర కొనసాగుతుంది. జిల్లాలో ఆమె సుమారు 145 కిలోమీటర్లు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహిస్తారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.‌

షర్మిల పాదయాత్రకు ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యంలో తరలివచ్చారు. షర్మిలతో పాటు వేలాదిగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చి ఘన స్వాగతం పలికి, ఆమె అడుగులో అడుగులు వేసి ముందుకు కదులుతున్నారు. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి, ఎ.వి. సుబ్బారెడ్డి తదితరులు తరలివచ్చారు.

మద్దికెర బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారు. అనంతరం ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నడిచిన తరువాత  మద్దికెర సమీపంలో ఏర్పాటు చేసిన గుడారంలో షర్మిల రాత్రికి బస చేస్తారు.

అంతకు ముందు అక్టోబర్‌ 18న వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌ నుండి ప్రారంభమైన ఆమె పాదయాత్ర వైయస్‌ఆర్‌, అనంతపురం జిల్లాల్లో జరిగింది. షర్మిలకు కర్నూలు జిల్లాలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top