జిల్లా సమస్యలూ పట్టని కేసీఆర్: షర్మిల

షాద్‌నగర్:

టీఆర్ఎస్ అధ్యక్షుడైన కేసీఆర్ మహబూబ్‌నగర్ ఎంపీ కూడా అనీ, కానీ ఆయనకు ఏనాడూ జిల్లా సమస్యలు పట్టవనీ శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా ఆమె ప్రజలతో మాట్లాడారు. జిల్లాలో నీటి సమస్య ఉందనీ, కరెంటు సమస్యతో పంటలన్నీ ఎండిపోయాయనీ చెప్పారు. ఈ సమస్యలేవీ కేసీఆర్ కంటికి కనిపించడం లేదన్నారు. కళాశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఫీజు రీయింబర్సుమెంటు పథకం సరిగా అందక చదువు మానేసి కూలి పనులకు పోతున్నారన్నారు.  ఇది మీకు, మన రాష్ట్రానికి అవమానంగా అనిపించడం లేదా కేసీఆర్ గారు అని అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.


మా ఒక్క గ్రామానికే వైఎస్ కోటి ఇచ్చారు

     అనంతరం శ్రీమతి షర్మిలతో కాకునూరు గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచి చంద్రకళ మాట్లాడారు. మా ఒక్క గ్రామానికే మహానేత డాక్టర్ వైయస్ఆర్ కోటి రూపాయలిచ్చారని తెలిపారు. తారు రోడ్లు.. పైపులైన్లు.. మరుగుదొడ్లు.. మురుగు కాల్వలు పల్లెకు అవసరం ఉన్న ప్రతి ఒక్కటీ చేయించారని చెప్పారు. ఆయన వెళ్లిపోయిన మూడేళ్ల నుంచి లక్ష రూపాయలు కూడా గ్రామానికి రాలేదన్నారు. మహానేత వైయస్ స్ఫూర్తితోనే రాజకీయాలలోకి వచ్చి,  సర్పంచ్‌గా గెలిచానని చంద్రకళ తెలిపారు. ఆయన ఉన్నంత కాలం గ్రామాన్ని బాగుచేశా.  ఇప్పుడు పనులు కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని షర్మిలతో చెప్పారు. 51వ రోజు పాదయాత్ర కొండేడు నుంచి ప్రారంభమై పెద్ద ఆదిరాల, ఎక్వాయిపల్లి, తొమ్మిది రేకుల, కాకునూరు గ్రామాల మీదుగా కేశంపేట చేరుకుంది. జనం 3 కిలోమీటర్ల మేర షర్మిలపై పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. కేశంపేటలో వైయస్ఆర్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో షర్మిల సమక్షంలో టీఆర్‌ఎస్ నాయకుడు మామిడి శ్యాంసుందర్‌రెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు కేశంపేట సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. గురువారం మొత్తం 19 కి.మీ. దూరం ప్రయాణించారు. ఇప్పటి వరకు మొత్తం 724.30 కి.మీ. యాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నాయకులు కె.కె.మహేందర్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, బాలమణెమ్మ, రాజ్ ఠాకూర్, ఎడ్మ కిష్టారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ప్రసాదరాజు, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top