విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన రైతు దీక్షకు కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. మిర్చి రైతులను ఆదుకునేందుకు సత్వర చర్యలు చేపట్టింది. క్వింటాల్ మిర్చికి రూ.5 వేల చొప్పున మద్దతు ధర ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమస్యలు, పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ వైయస్ జగన్ మోహన్రెడ్డి ఈ నెల 1, 2వ తేదీల్లో రైతు దీక్ష చేపట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మిర్చికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలు చేయాలని నిర్ణయించింది. క్వింటా మిర్చి ధర రూ.5వేలుగా నిర్ణయించి, ఓవర్ హెడ్ ఛార్జెస్ కింద రూ.1250 అదనంగా చెల్లించనుంది. పంటను రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లో 88,300 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 33,700 మెట్రిక్ టన్నుల మిర్చి కొనుగోలు చేయనుంది. మే 2 నుంచి 31 వరకూ చేసే కొనుగోళ్లుకు ఈ తాజా నిర్ణయం వర్తించనుంది.