పిచ్చోడి చేతిలో రాయిలా మారిన టీడీపీ

హైదరాబాద్:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌లో కింగ్‌లా మారుతుండగా, తెలంగాణ రాష్ట్రంలోనూ కీలక భూమిక పోషించనున్నదని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. సీమాంధ్రలో అధికారంలోకి రాబోతున్న వైయస్ఆర్‌సీపీని చూసి చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నదని, ఈ పరిస్థితుల్లో చంద్రబాబు డిప్రెషన్‌లో పడ్డారన్నారు. దీంతో టీడీపీని పిచ్చోడి చేతిలో రాయిలా ఉపయోగిస్తున్నాడని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఓటు వేసే చోట సీటు లేదని, సీటున్న చోట ఓటు లేదని.. ఆయన తనకు, తన పార్టీ గుర్తుకు ఓటేసుకోలేని దుస్థితిలో పడ్డారని గట్టు ఎద్దేవా చేశారు.

రాజ్యాంగం, చట్టాలపై చంద్రబాబుకు గౌరవం లేదని గట్టు రామచంద్రరావు విమర్శించారు. ఎన్నికల్లో ఓటు ఎవరికి వేశామనే విషయాన్ని బహిర్గతం చేయకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా ఆయనకు లేదని దుయ్యబట్టారు. ఓటు వేసి బయటకు వచ్చి రెండు ఓట్లూ బీజేపీకే వేశానని చెప్పుకుంటున్నారంటే.. వారు అనుమానపడతారనా? లేక తమ లవ్వాటను నిరూపించుకునే ప్రయత్నం చేశారా? అని గట్టు ప్రశ్నించారు.

వైయస్‌ చలవతోనే జైరామ్‌కు ఇంతటి స్థాయి :
సీమాంధ్రలో మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు వైయస్ఆర్‌సీపీకి ఏకపక్షంగా వస్తాయని గట్టు రామచంద్రరావు అన్నారు. ఈ పరిస్థితులతో బెంబేలెత్తిపోతున్న చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, జైరామ్‌రమేశ్ వై‌యస్ఆర్‌సీపీపై దాడులకు సిద్ధపడుతున్నారన్నారు. జైరామ్‌ రమేశ్‌కు జుట్టు పెరిగింది కాని, బుర్ర పెరగలేదన్నారు. జైరామ్ రమేశ్‌కు ఎంపీ స్థాయి, మంత్రి పదవి అన్నీ మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి, తెలుగు జాతి పెట్టిన బిక్ష అని పేర్కొన్నారు. ‘అలాంటి తెలుగుజాతిని ముక్కలు చేసిన నీవు..‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయంటున్నావే.. మరి 13 ఏళ్లు రాజీవ్ గాంధీపై బోఫో‌ర్సు కేసు ఉంది కదా? రాజీవ్‌గాంధీ రాజకీయాలకు పనికిరాడని మాట్లాడు..’అని సవాల్‌ చేశారు. ‘శ్రీ జగన్ ఎందుకు జైలుకు వెళ్లారో నీకు తెలియదా? అది నీవు, టీడీపీ పన్నిన కుట్ర కాదా?‌ శ్రీ జగన్‌పై ఆరోపణలు చేస్తూ లేఖ రాసిన శంకర్రావుకు, ఆరోపణలు చేసిన డీఎల్ రవీంద్రారెడ్డికి మంత్రి పదవులు ఇచ్చింది మీరు కాదా?’ అని‌ గట్టు రామచంద్రరావు ప్రశ్నించారు.

‘వైయస్ఆర్ పేరును ఎ‌ఫ్ఐఆర్‌లో చేర్చి, ఆయన కుటుంబాన్ని వేధించినప్పుడు నీవు ఏం చేశావు? ఇప్పుడు ఆయన ఆత్మ క్షోభిస్తుందని అంటున్నావా? వైయస్ఆర్‌సీపీ కుబేరుల పార్టీ అని విమర్శలు చేస్తున్నావే.. కాంగ్రెస్ పార్టీ గోచిగుడ్డ పార్టీనా? చొక్కా లాగు లేకుం డా కాంగ్రె‌స్ నాయకులు గుడ్డలు కట్టుకొని తిరుగుతున్నారా? కాంగ్రె‌స్ వారిపై ఆరోపణలు లేవా? కోట్ల ఆస్తులు లేవా? కాంగ్రె‌స్‌లో ఉన్న వ్యక్తులను ఒక్కసారి చూసుకో.. వైయస్ఆర్‌సీపీలోకి వ్యాపారం కోసం పోతున్నారా? మరి టీడీపీలోకి ఎందుకు పోతున్నారు? కాంగ్రెస్‌ను పాడెపై పడుకోబెట్టి.. దానిని పట్టుకొని లెమ్మంటే లేవకుంటే.. పక్కవారిపై ఏడిస్తే ఏం వస్తది’ అన్నారు. వైయస్ఆర్‌కు ప్రజాభిమానం ఉందని, ప్రజాదరణ నుంచి శ్రీ జగన్ వస్తున్నారని, 30 వేల కిలోమీటర్లు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారన్నారు. ‌శ్రీ వైయస్‌ జగన్ అధికారంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంద‌ని గట్టు అన్నారు.

Back to Top