మత సామరస్యానికి ప్రతీక రాయచోటి

రాయచోటి రూరల్‌ : మత సామరస్యానికి ప్రతీకగా రాయచోటి నియోజకవర్గం నిలుస్తోందని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, వైయస్సార్‌సీపీ మైనార్టీ నాయకులు సల్లాఉద్దీన్, అప్జల్‌ అలీఖాన్‌లు పేర్కొన్నారు. బుధవారం స్థానిక వైయస్సార్‌సీపీ కార్యాలయంలో వారు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మన రాయచోటి నియోజకవర్గంలోని అన్ని మతాల ప్రజలు సాంప్రదాయాలు, క్రమశిక్షణను చూసి చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అదే క్రమశిక్షణ, ఐక్యమత్యంను ఎల్లప్పటికీ కొనసాగించాలని నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. త్వరలో జరగబోయే బక్రీద్‌ పండుగ, ప్రస్తుతం జరుగుతున్న గణేష్‌ నిమజ్జనాలను హిందూ, ముస్లీం సోదరులు భక్తిశ్రద్దలతో, సమరస్యంగా చేసుకోవాలని ఆకాంక్షించారు. అ పండుగల రోజుల్లో ఏ చిన్న సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఈ పండుగ రోజుల్లో తాము అన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటామని వారు తెలిపారు. ఏ చిన్న అంశంపైనైనా తక్షణమే స్పందిస్తామని ఆయన మాట ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలకు బక్రీద్, వినాయక నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేశారు.

Back to Top