నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం

హైదరాబాద్:

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిజమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని, సమస్యలు వచ్చినపుడు ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కుమ్మక్కు రాజకీయాలకు దూరంగా ఉంటామన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి మృతి చెందిన తరువాత రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై రాజకీయాలు చేశాయని‌ ఆరోపించారు. అయితే.. తాము మాత్రం ఆ విధంగా వ్యవహరించబోమని తెలిపారు.

ఒకే ఒక్క ఎంపీ, ఒక ఎమ్మెల్యే నుంచి ప్రారంభమైన వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ బలం ఉప ఎన్నికల తరువాత ఇద్దరు ఎంపీలు, 20 మంది ఎమ్మెల్యేలకు పెరిగిందని, అది‌ ఇపుడు 70 మంది ఎమ్మెల్యేలకు, 9 మంది ఎంపీలకు పెరిగిందన్నారు. ఈ సంఖ్యతో ఒక బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని అన్నారు. పార్టీ సిటింగ్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఓటమి‌ చెందడానికి కారణం స్థానిక అంశాల ప్రభావమే తప్ప మరొకటి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని, కొత్త రాష్ట్రం పునర్నిర్మాణానికి ఏ రకంగా సహకరించాలో ఆ విధంగా ఉంటామని గడికోట పేర్కొన్నారు.

Back to Top