అమరావతి: రాజధాని మాస్టర్ ప్లాన్పై నిరననల జోరు రోజురోజుకు పెరుగుతుంది. రాజధాని మాస్టర్ ప్లాన్ పేరుతో చంద్రబాబు రైతుల భూములను బలవంతంగా లాక్కొన్ని విదేశీ కంపెనీలకు దారదత్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజధాని పేరిట వేలకోట్లు దోచుకున్న బాబుకు ఇంకా ధనదాహం, భూదాహం తీరలేదు. తమకు బతుకునిచ్చే పంట భూములను ఇవ్వబోమని రైతులు కరఖండిగా చెబుతున్న చంద్రబాబు మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు. గ్రామకంఠాల ద్వారా భూసేకరణకు వెళ్లే అధికారులకు రైతుల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. <br/><br/>నేలపాడు, శాకమూరు, అనంతవరం, బోరుపాలం, అబ్బరాజుపాలెంలో రెండు బృందాల అధికారుల బృహత్ ప్రణాళికపై అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహించారు. దీంతో అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారులపై ప్రజలు, రైతులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామకంఠాల ద్వారా తాము ఇళ్లను కోల్పోతున్నామని ఉన్న నీడను కోల్పోతే తాము భార్య, పిల్లలతో ఎక్కడకు వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. రహదారులకోసం ఇళ్ల స్థలాలు సైతం దోచుకుంటే తమ పశువులను ఎక్కడ ఉంచాలో తెలియజేయాలని అధికారులను నిలదీశారు. పశుసంపద మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, అలాంటి స్థలాలను, ఇళ్లను గ్రామకంఠాల పేరుతో ప్రభుత్వం దోచుకుంటుంటే తాము ఎలా జీవించేదని అధికారులపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉపాధి లభించనప్పటికి తామకు తాము ఎదో విధంగా బతుకుతుంటే దానిని సైతం ఉంచడం లేదని ఆరోపిస్తున్నారు. <br/><br/>కంచర్ల చంద్ర అనే మహిళ మాట్లాడుతూ... ఇప్పటికే చంద్రబాబు అమరావతి రాజధాని పేరుపై వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారని, విరాళాల పేరిట కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. అసలు రైతులకు సెంటుభూమి కూడా ఉండకూడదనే నినాదంతోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. గ్రామకంఠాల వ్యవహరంపై ఫారం 9.2 ద్వారా అభ్యంతరం తెలిపిన ఇంత వరకు ఆ విషయాన్ని పట్టించుకునే నాథుడే లేదని ఆమె వాపోయారు. అధికారులు ముఖ్యమంత్రికి సేవలు చేసేందుకు తప్ప తమలాంటి పేద, సన్నకారు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని వారు నిరసన వ్యక్తం చేశారు. <br/><br/>గ్రామకంఠాల విషయమై ప్రశ్నిస్తే సీఆర్డీఎ అధికారులు అవమానకంగా మాట్లాడుతున్నారని... అదే గ్రామకంఠాల పేరుతో తమ భూముల్ని, స్థలాలు మాత్రం దోచుకోవడం ఇదేక్కడి తీరని రైతు పోలు వీర రాఘవయ్య అధికారులను నిలదీయడంతో అక్కడికి వెళ్లిన అధికారులు సదరు రైతుకు సమాధానం చెప్పలేక వెనుదిరిగారు.<br/><br/>నేలపాడులో అప్రధానమైన ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించాలని చూస్తున్నారని, రాజధాని పేరిట చంద్రబాబు రైతులను మోసం చేస్తున్న తీరును దారుణంగా ఉందని పలువురు రైతులు ఆరోపించారు. ఈ అంశంపై వెంటనే వివరణ ఇవ్వాలని వెంకటపాలేనికి చెందిన రైతు బెల్లంకొండ నరసింహారావు డిమాండ్ చేశారు. నిమ్మతోటలను మెట్ట భూములుగా పరిగణించడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై బోరుపాలెంలో రైతుల తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో సీఆర్డీఎ అధికారులు రైతుల ప్రశ్నలకు బదులు ఇవ్వలేని పరిస్థితిలో అక్కడి నుంచి వెనుదిరిగారు.