ఎన్టీఆర్ భవన్ కుక్కా, బాబు కుక్కా..?

రాష్ట్రంలో టీడీపీ కీచక పాలన
మహిళలపై తమ్ముళ్ల వేధింపులు
చిత్తకార్తె కుక్కలాగా మహిళలపై అఘాయిత్యాలు
 అండగా నిలుస్తున్న చంద్రబాబు
బాబుకు మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత లేదు
కీచకులందరినీ పదవులనుంచి తొలగించాలిః రోజా

హైదరాబాద్ః మహిళలను అన్ని రకాలుగా వేధిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి... మహిళా దినోత్సవం నిర్వహించే అర్హత, నైతిక హక్కులేదని
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్ కె. రోజా మండిపడ్డారు. మహిళలను వేధించడం, మోసగించడం, అఘాయిత్యాలు చేయించడమే పనిగా పెట్టుకున్న తెలుగుతమ్ముళ్లకు చంద్రబాబు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని రోజా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళల భద్రత లాకప్ లో కూర్చొని వెక్కివెక్కి ఏడుస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. హైదరాబాద్ లోని  పార్టీ కార్యాలయంలో మీడియాతో  మాట్లాడిన రోజా రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

చంద్రబాబుకు మొదటి నుంచి మహిళలంటే చులకనభావం అని రోజా మండిపడ్డారు. బాబుకు ఆడపిల్ల ఉంటే ఆమె విలువ, గొప్పదనం ఏంటో  తెలిసి వచ్చేదన్నారు. ఓముఖ్యమంత్రి అయి ఉండి.... కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అంటూ, ఆడపిల్లను కనడమే వేస్ట్ అన్న విధంగా చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎన్నికలప్పుడు మహిళల భద్రత గురించి గొప్పలు చెప్పిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చాక కీచక పాలన సాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ కీచకులందరికీ మెంటర్ చంద్రబాబు, లోకేష్ లే వారసులని అన్నారు. మహిళాసాధికారిత గురించి బాబు చెప్పిన మాటలు నమ్మి ఓటేసినందుకు.. రాష్ట్రంలోని మహిళలంతా కన్నీరు పెడుతున్నారన్నారు. 

డబ్బులున్నాయి కాబట్టి రాజధానిలో భూములు కొనుక్కున్నామని మాట్లాడినట్లే...అమ్మాయిలు కనిపించారు ఏమైనా చేయొచ్చన్న విధంగా టీడీపీ నేతలు మాట్లాడుతున్న మాటలు దుర్మార్గమన్నారు. గతంలో లోకేష్ తప్పతాగి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలను, అదేవిధంగా ఆయన మేనమామ బాలకృష్ణ మహిళపట్ల అమానవీయంగా మాట్లాడిన మాటలను రోజా మీడియా ముందు ప్రవేశపెట్టారు. లోకేష్ , బాలకృష్ణలే చేయగా లేనిదీ మేము చేస్తే తప్పేంటన్నవిధంగా... మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్నది వాస్తవం కాదా అని రోజా ప్రశ్నించారు. 

రిషితేశ్వరి చావుకు కారణమైన బాబురావు తప్పించుకోవడానికి... టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కారణం కాదా..? ఎమ్మార్వో వనజాక్షిని ఇసుకలో పడేసి టీడీపీ ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ కొట్టి కూడా అంత ధైర్యంగా ఉన్నాడంటే బాబు అండ చూసుకొని కాదా..?కాల్ మనీ సెక్స్ రాకెట్ లో టీడీపీ ఎమ్మెల్యేలు  బోడె ప్రసాద్, బోండా ఉమ అనుచరులు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల సహకారం లేనిదే... మహిళలను వ్యభిచార కూపంలోకి దించగలరా..? అని రోజా నిలదీశారు.  

మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ చిత్తకార్తె కుక్కలాగా ఓ వివాహిత మహిళను కార్లోకి లాగితే... దీంట్లో జగన్ కుట్ర ఉందని రావెల కిషోర్ మాట్లాడడం హాస్యాస్పదమని రోజా అన్నారు.  జగన్ గారు అక్కడ సీసీ కెమెరాలు పెట్టించారా..? లేక బుర్ఖాళో జగన్ గారు వెళ్లారా...? అమ్మాయి చేయి పట్టుకొని లాగమని మీ కొడుకు రావెల సుశీల్ కు జగన్ గారు చెప్పారా...? లోకేష్ ని కూడా తప్ప తాగమని జగన్ గారే చెప్పారా...?  ప్రతి దానికి వైఎస్ జగన్, సాక్షినే కారణమంటూ  తెలుగుదేశం వాళ్లు  దిగజారి మాట్లాడుతున్నారని రోజా ధ్వజమెత్తారు. ఇదే ఘటన ఏపీలో జరిగితే కుక్కే చేసిందని చంద్రబాబు, మంత్రులు కుక్కమీద కూడా కేసు పెట్టించేవాళ్లని రోజా ఎద్దేవా చేశారు. 

ఏపీ మంత్రి రావెల కిషోర్ బ్లూ బల్బ్ కారును అమ్మాయిల మీద అఘాయిత్యం చేసేందుకు ఉపయోగిస్తున్నారంటే ...ఇంతకన్నా సిగ్గుమాలిన ప్రభుత్వం ఇంకోటి ఉండదని రోజా ధ్వజమెత్తారు. మంత్రి రావెల కిషోర్ ను, చింతమనేని ప్రభాకర్ ను, బోడె ప్రసాద్, బుద్దావెంకన్న, బోండా ఉమ, అదేవిధంగా  నారాయణ కాలేజీల్లో 18 మంది పిల్లల చావుకు కారణమైన మంత్రి నారాయణను పదవుల నుంచి తొలగించాలని రోజా డిమాండ్ చేశారు. వాళ్లను సస్పెండ్ చేసేవరకు టీడీపీకి మహిళా దినోత్సవం నిర్వహించే అధికారం లేదన్నారు.  

అసెంబ్లీలో ఎమ్మెల్యే కన్నీళ్లను చూసి కరిగిపోయిన బాబుకు ... రాష్ట్రంలోని అన్ని వర్గాల మహిళల శోకం కనిపించడం లేదా అని రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్, టీడీపీ నేతలంతా...మహిళలను ఆడపడుచుగా భావించే ఎన్టీఆర్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తున్నారని రోజా ఫైరయ్యారు. ఎన్టీఆర్ పేరు నిలబెట్టేవిధంగా మహిళలకు బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలన్నారు. అదేవిధంగా మహిళలను వేధిస్తున్న టీడీపీ కీచకులందరినీ తొలగించాకే మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించాలన్నారు. లేకపోతే మహిళలంతా చంద్రబాబుపై తిరగబడతారన్నారు. మహిళల చేత కన్నీరు పెట్టిస్తున్న చంద్రబాబు, ఆయన పార్టీ కొట్టుకుపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.  


అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు, స్కాలర్ షిప్ ల కోస పోరాడుతున్న విద్యార్థుల జుట్టుపట్టుకొని లాగేసిన చంద్రబాబు అరాచకాలను ప్రజలు మర్చిపోరన్నారు. తప్ప తాగి బరితెగించి మైనార్టీ వివాహిత మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన రావెల సుశీలను కఠినంగా శిక్షించాలని రోజా డిమాండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ కుమారుడు కార్ రేసులో ఒకతని చావుకు కారణమైన కూడా ..కుక్క అడ్డు వస్తే దాన్ని తప్పించబోయి గుద్దేశాడని కేసు మూసేశారు. ఇవాళ రావెల సుశీల్ విషయంలోనూ కుక్క డ్రామా ఆడుతున్నారని రోజా దుయ్యబట్టారు. అది ఎన్టీఆర్ భవన్ లో పెరిగిన కుక్కో లేక చంద్రబాబు కుక్కో అర్థం కాలేదు గానీ... ప్రతిదానికి కుక్కను బయటకు తీసుకొస్తున్నారని ఎత్తిపొడిచారు. 

తాజా వీడియోలు

Back to Top