వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి ఈసీ గుర్తింపు

హైదరాబాద్:

  వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. వైయస్ఆర్‌సీపీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా గుర్తించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఒక ప్రకటన జారీ చేసింది. 2014 మే నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓట్లూ, సీట్ల ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వివరించింది. ఇప్పటి వరకూ నమోదిత రాజకీయ పార్టీగా ఉన్న వైయస్ఆర్‌సీపీ ఇక నుంచి గుర్తింపు పొందిందని కేంద్ర ఎన్నికల సంఘం తరఫున అండర్‌ సెక్రటరీ ప్రమోద్‌ కుమార్‌ శర్మ ఈ ప్రకటన వెలువరించారు.

దీనితో ఇప్పటి వరకు వైయస్ఆర్‌సీపీ ఎన్నికల గుర్తుగా ఉన్న సీలింగ్ ఫ్యా‌న్‌ను ఇక నుంచి శాశ్వత ప్రాతిపదికన వైయస్ఆర్‌సీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకే కేటాయిస్తారు. ఈ ఉత్తర్వులను వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీకి పంపారు.‌ ఈ ఉత్తర్వులకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో వెలువడతుందన్నారు.

ఇటీవల జరిగిన స్వార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఓట్లను, ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించింది. ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్, కేటాయింపు) ఉత్తర్వు 1968 కింది నిర్దేశించిన విధి విధానాలన్నింటినీ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ పూర్తిచేసిందని, అందువల్ల ఆ పార్టీని గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీగా గుర్తిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

‌ ఈ ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో ఫ్రీ సింబల్సు జాబితా నుంచి సీలింగ్ ఫ్యా‌న్ గుర్తును తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రమోద్‌ కుమార్‌ శర్మ పేర్కొన్నారు.
ఎన్నికల సంఘం ప్రకటనతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి గుర్తింపు లేదన్న టీడీపీ దుష్ప్రచారానికి ఇక తెర పడినట్లయింది.

Back to Top