బాబుకు కనీస జ్ఞానం కూడా లేదా..?

()టీడీపీ, బీజేపీలు నియంతలా వ్యవహరిస్తున్నాయి
()ఓట్లు దండుకొని హోదా ఇవ్వకుండా ప్రజలను మోసం చేశాయి
()జేబులు నింపుకునేందుకే బాబు ప్యాకేజీని స్వాగతించారు
()కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే పోలవరం

వైయస్‌ఆర్‌ జిల్లా:  రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది, లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్న కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకపోవడం దారుణమని మాజీ మంత్రి, వైయస్సార్సీపీ సీనియర్ నేత వైయస్ వివేకానందరెడ్డి మండిపడ్డారు. కడప హరితా కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన చైతన్య పథం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడారు. సమైక్యాంధ్ర కోసం ఏపీ రాష్ట్రమంతా పోరాడినా వారి భవిష్యత్తును నిర్ధాక్షిణ్యంగా కాంగ్రెస్, బీజేపీలు నాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనకు కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుంటే బీజేపీ దానికి మద్దతు ఇచ్చి బిల్లుకు సహకరించిందన్నారు. 

విభజన బిల్లుకు సహకరించిన బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను అమలు పర్చకపోవడం దుర్మార్గమన్నారు. టీడీపీ, బీజేపీలు ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హోదా వస్తే ఆర్థికంగా, పారిశ్రామికంగా వెలుసుబాటు కలుగుతుందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులన్నీ ఇబ్బందికరంగా మిగిలిపోయినా కనీసం చంద్రబాబు వాటిని పట్టించుకోవడం లేదన్నారు. కేవలం రెయిన్‌ గన్‌లతో ట్యాంకర్లతో నీటి కొరతను ఎలా పారదోలుతారని ప్రశ్నించారు. రాయలసీమ ఉక్కు కర్మాగారాన్ని కూడా కేంద్రం ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

లాభం కాదని ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులా?
ప్రత్యేక హోదాతో ఉపయోగం లేదని మాట్లాడిన టీడీపీ, బీజేపీ నేతలు హోదా కలిగిన రాష్ట్రాల్లో ఎందుకు పెట్టుబడులు పెడుతున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంధ్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి కోట్లకు పడగలెత్తుతూ ఏపీకి హోదాతో ఉపయోగం లేదని మాట్లాడడం దారుణమన్నారు. ‘చైతన్యపథం’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు ముందస్తు డ్రామా ప్రకారం హామీలను కురిపించి ఓట్లు దండుకొని ప్రజలను తీవ్రంగా మోసం చేశారని మండిపడ్డారు. బంతి అయిపోయింది అన్నం పెట్టరు అన్నట్లుగా చంద్రబాబు, వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారని అన్నారు. ఏరుదాటాక తెప్ప తగలేసే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

విభజన చట్టంలోని అంశాలే తప్ప ప్రత్యేకంగా ఏపీకి ఇచ్చిందేమీ లేకపోయినా బాబు అర్థరాత్రి దాన్ని స్వాగతించడం దారుణమన్నారు.  ఏ కార్యక్రమానైనా డబ్బుల ఈవెంట్‌గా మల్చుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. అందుకోసమే ప్యాకేజీని కూడా జేబులు నింపుకోవడానికి స్వాగతించారని చెప్పారు. కమీషన్లు, కాంట్రాక్టుల కోసం పోలవరాన్ని బాబు చేజిక్కించుకున్నారని ఆరోపించారు. రాయపాటి సాంబశివరావు, సీఎం రమేష్, మెగా కృష్ణారెడ్డిలకు డబ్బులు ముట్టజెప్పేందుకు పోలవరాన్ని తీసుకొచ్చారన్నారు. పోలవరం బిల్లుల కోసమే ఏపీ ప్రజల మనోభావాలను బాబు కేంద్రానికి తాకట్టుపెట్టారని మండిపడ్డారు. 

Back to Top