డిజిటల్ 'బాబు' సొంతూర్లోనే దిక్కులేదు

తిరుపతి : నగదు రహిత లావాదేవీల ద్వారా రాష్ట్రాన్ని డిజిటల్ ఎకానమీగా ఎలా మార్చాలో చెప్పుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన స్వగ్రామాన్నే గాలికొదిలేశారు. సీఎం స్వగ్రామం నారావారిపల్లిలో కనీసం బ్యాంకు కార్యాలయమే కాక, ఒక్క ఏటీఎం కూడా లేదు. నారావారిపల్లికి పక్కనున్న డజను గ్రామాలది ఇదే పరిస్థితి. పెద్ద నోట్ల రద్దుతో కొత్త కరెన్సీ నోట్ల కోసం ఆ గ్రామాల ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఎంతో కష్టంతో 10 కిలోమీటర్ల మేర ప్రయాణం చేసి చంద్రగిరి లేదా తిరుపతిలో పనిచేసే ఏటీఎంల కోసం కాలరిగేలా తిరుగుతున్నారు.  అక్కడ స్వైపింగ్ మిషన్లూ పనిచేయడం లేదు.
 
కేవలం ఒక్క రేషన్ దుకాణదారుడు మాత్రమే ఎలక్ట్రానిక్ పద్దతి ద్వారా సబ్సిడీ బియ్యాన్ని, ఇతర నిత్యావసర వస్తువులను విక్రయిస్తున్నాడు. నారావారిపల్లికి రెండు కిలోమీటర్ల దూరంలో రంగంపేటలో ఏటీఎం ఉన్నప్పటికీ అది ఉండీలేని మాదిరిగా తయారైంది. కనెక్టివిటీ సమస్యతో అది పనిచేయడం లేదు. ఓ వైపు తిరుపతిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా 104వ ఇండియన్ సైన్సు కాంగ్రెస్ సదస్సు జరుగుతోంది. దేశాన్ని ఎలా టెక్నాలజికల్గా, సైటిఫిక్గా అభివృద్ధి చేయాలో నిపుణులు ప్రసంగాల మీద ప్రసంగాలు ఇస్తున్నారు.  ఆ వేదికకు కొద్దీ దూరంలోనే స్వయానా సీఎం స్వగ్రామం నారావారిపల్లినే టెక్నాలజీకి ఆమడ దూరంలో పయనం సాగిస్తుండటం విడ్డూరం. సభలలో నోటికి ఏది వస్తే అది మాట్లాడడం తప్ప చంద్రబాబు రాష్ట్రానికి చేస్తున్నదేమీ లేదని ప్రతీ ఒక్కరూ మండిపడుతున్నారు. 
Back to Top