వైయస్సార్సీపీకి పట్టంకడితేనే అభివృద్ధి సాధ్యం

()టీడీపీలో గుర్తింపు లేదు
()అందుకే వైయస్సార్సీపీకి ఓటేశా
()ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు
()వైయస్సార్సీపీ గెలుపునకు కృషి చేస్తా

పెడనటౌన్ (ఈడేపల్లి) : తెలుగుదేశం అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఇప్పటికీ పార్టీలో గుర్తింపు లేదని అందుకే తాను వైయస్సార్ సీపీకి ఓటు వేశానని పెడన మున్సిపల్ కౌన్సిలర్(15వ వార్డు) లంకే స్రవంతి వెల్లడించారు. ఓటింగ్ అనంతరం ఆమె మాట్లాడుతూ నేటికీ తనకు కౌన్సిలర్ గా గుర్తింపు లేదన్నారు. వార్డు సమస్యలను మున్సిపల్ చైర్మన్, అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. 

తన ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ కోసం కార్యాలయం చుట్టూ ఆరునెలలపాటు  ప్రదక్షిణలు చేశానని చెప్పారు. తన వార్డులో ఒక్క అభివృద్ధి పని చేయలేదని, నిధులు కూడా విడుదల చేయలేదన్నారు. మరి కొన్ని వార్డులలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. అందువల్లనే తాను టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలుపలేదన్నారు. వైయస్సార్ సీపీకి పట్టంకడితేనే పూర్తిస్థాయిలో పట్టణాభివృద్ధి జరుగుతుందని  తాను ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు.

ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు మినహా అసలు పెడనలో కనిపించడం లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆదర్శంగా తీసుకుని వైయస్సార్ సీపీని గెలిపించడానికి కృషిచేస్తానని తెలిపారు. అయితే.. తాను అమ్ముడుపోయానని టీడీపీ కౌన్సిలర్‌లు దుష్ర్పచారాలు చేస్తున్నారన్నారు. దమ్ముంటే వాటిని నిరూపించాలని టీడీపీకి ఆమె సవాల్ విసిరారు. పెడన మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్, మండల పరిషత్ పీఠాలను వైయస్సార్సీపీ కైవసం చేసుకున్న తెలిసిందే. 
Back to Top