పింఛన్లు రద్దు చేస్తే పేదలు బతికేదెలా?

హైదరాబాద్, అక్టోబర్ 9: పేద ప్రజలపై కక్షకట్టి వారి పింఛన్లు తొలగించడం ఏమాత్రం సమంజసం కాదని వైఎస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పలు జిల్లాల్లో వేలకువేలు వృద్ధుల, వితంతువుల, వికలాంగుల పింఛన్లు రద్దు చేయడం పట్ల ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం వైఎస్సార్సీపీ కేంద్రకార్యాలయంలోపార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విలేకరుల సమావేశంలోమాట్లాడారు. అర్ధంతరంగా పింఛన్లు తొలగిస్తే లబ్ధిదారుల జీవితాలు ఏం కావాలి? వారెలా బతకాలి? అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

బాబు ప్రభుత్వం స్వల్పకాలంలోనే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నఆమె.. తూర్పు గోదావరి జిల్లాలోని దివాన్‌ చెరువు పంచాయతీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు. అక్కడ 16 వార్డులకుగాను వైఎస్సార్సీపీ 12 గెల్చుకుందని, అధికార పక్షం ఒక్కటంటే ఒక్కటి మాత్రమే నెగ్గిందని తెలిపారు. ఇప్పట్లో ఎన్నికలేమీలేవన్న ధైర్యంతోనే పింఛన్లను తొలగిస్తూ తానిచ్చిన వాగ్దానాలను చంద్రబాబు తుంగలో తొక్కారని ఆమె విమర్శించారు. తన పింఛన్‌ను రద్దు చేశారని సారా వ్యతిరేకోద్యమ సారథిగా ప్రశంసలు అందుకున్నరోశమ్మ విలపించారంటే పింఛన్ల తొలగింపు ఎలా సాగుతోందో ఇట్టే తెలుస్తోందన్నారు.

రోశమ్మ మీకు ఓటువేయలేదని పింఛన్ రద్దుచేశారా? మీరు మద్య నిషేధం ఎత్తేసినందుకు కలత చెంది, ఇకపై ఆమె మద్దతు మీకు ఉండదనా? అని ఆమె బాబును ప్రశ్నించారు. రోశమ్మలాంటి బాధితులు చాలా మంది ఉన్నారని, వారందరూ తమ బాధను పత్రికల వద్ద వెళ్లబోసుకోలేరని ఆమె చెప్పారు. చిత్తూరు జిల్లాలో 84,167, తూర్పుగోదావరిలో 90,981, విశాఖపట్నంలో 20,220, పశ్చిమ గోదావరిలో 23,720 పింఛన్లు తొలగించారని ఆమె వివరించారు. సరస్వతి సిమెంట్స్ లో వైఎస్ భారతి ఒక డెరైక్టరుగా ఉండటమే పాపమన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పద్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన గనుల లీజును రద్దుచేయడం సరికాదన్నారు. సుజనా చౌదరి, సి.ఎం. రమేశ్ కొనుగోలు చేసిన భూములను కూడా రైతులకు తిరిగి ఇచ్చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. ఇది సరస్వతి సిమెంట్స్‌పై రాజకీయ దాడి తప్ప మరొకటికాదన్నారు.

Back to Top