రాష్ట్రంలో నరకాసుర పాలన

  • టీడీపీ మహిళలకే రక్షణ లేకపోతే ఎలా?
  • మైనారిటీ వర్గంపై దౌర్జన్యం చేస్తే ఊరుకోం
  • వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో నరకాసుర పాలన సాగుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాళ్ల అధికారానికి, అవినీతికి ఎవరు అడ్డొచ్చినా బెదిరించడం అలవాటు అయిపోయిందని ఫైర్ అయ్యారు. మీ సొంత పార్టీ మహిళా నేతలకే రక్షణ లేకపోతే.. ఇక ప్రతిపక్ష పార్టీలలో మహిళలకు, ఇతరులకు ఎక్కడి నుంచి రక్షణ కల్పిస్తారని సూటిగా ప్రశ్నించారు. శనివారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 

గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ షేక్‌ జానీమూన్‌ ఏం తప్పు చేశారని ఆమెను మంత్రి రావెల అనుచరులు బెదిరించారని ఆయన ప్రశ్నించారు. ఆమెపై సొంత పార్టీకి చెందిన మంత్రి దాడి చేయడం దారుణమని అన్నారు. రావెలను అరెస్టు చేసే ధైర్యం పోలీసులకు ఉందా అని నిలదీశారు. ఇక జానీమూన్‌ వెనక వైయస్‌ఆర్‌సీపీ ఉందని రేపో మాపో చెప్పినా ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదని రాంబాబు అన్నారు. మీ పార్టీకి చెందిన మహిళలకే రక్షణ లేనప్పుడు రాష్ట్రంలో ఏ మహిళకు రక్షణ ఉంటుందని నిలదీశారు. అధికారం, డబ్బు, అన్యాయం తప్ప టీడీపీకి మరో ఆలోచన లేదన్నారు.

మాట వినని వారిపై కేసులు పెట్టి వేధించడం టీడీపీకి అలవాటుగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. తనకు జరిగిన అన్యాయంపై జానీమూన్‌ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే మంత్రిపై ఇంతవరకు కేసు నమోదు చేయలేదని తప్పుపట్టారు. చంద్రబాబు, లోకేష్‌ శాశ్వతం కారని, ప్రభుత్వాలు మారుతాయని, భవిష్యత్తులో ఒక్క మహిళ కూడా టీడీపీకి ఓటేసే పరిస్థితి లేదని అంబటి రాంబాబు అన్నారు. జానీమూన్‌ ఉదంతంపై కేసు నమోదు చేయాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. మైనారిటీ వర్గానికి చెందిన మహిళపై దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. 
 
Back to Top