ప్రజలను వంచించిన మీరే అసలు తీవ్రవాదులు

  • వైయస్‌ఆర్‌సీపీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు
  • టీడీపీ అవినీతికి మాత్రమే వ్యతిరేకం
  • బాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు
  • రాజధాని భూములతో ప్లాట్ల వ్యాపారం చేయడం తప్పు
  • చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
  • వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగు నాగార్జున 
హైదరాబాద్ః నిత్యం ప్రజాసమస్యలపై పోరాడుతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీని, నాయకులను తీవ్రవాదులుగా చిత్రీకరించడానికి చూపుతున్న శ్రద్ధ పాలనపై పెడితే బాగుంటుందని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మేరుగు నాగార్జున చంద్రబాబుకు హితబోధ చేశారు. రాజ్యాంగ బద్దంగా పరిపాలన చేయడం నేర్చుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు పాలనపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  

అవినీతికే వ్యతిరేకం... అభివృద్ధికి కాదు 
వైయస్‌ఆర్‌సీపీ ఎప్పుడు అభివృద్ధికి వ్యతిరేకం కాదని అభివృద్ది ముసుగులో అధికార బలంతో ధన దాహంతో టీడీపీ చేస్తున్న అవినీతిపైనే మా పోరాటమని నాగార్జున పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన  హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తండ్రీకొడుకులు కలిసి ప్రజాధనాన్ని లూఠీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు రెండున్నరేళ్ల పాలనలో రైతులు, వృద్ధులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు ఆఖరుకి ఉద్యోగులు కూడా సంతోషంగా లేరన్నారు. రాజధాని నిర్మాణం కోసం సేకరించిన 33వేల ఎకరాల్లో కనీసం ఒక్క నిర్మాణమైనా చేశారా అని ప్రశ్నించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఇంతవరకు నష్ట పరిహారం అందలేదన్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి పునరవాసం ఎక్కడ కల్పిస్తారో చెప్పలేదు.. అమరావతి ప్రాంతంలో నివసిస్తున్న వారి పరిస్థితి అయోమయంగా ఉందన్నారు. ఫ్యాను గుర్తుపై గెలిచిన వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను రూ. 30 కోట్లకు సంతలో పశువుల్లా కొనుగోలు చేసిన చంద్రబాబు.. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ విషయానికొచ్చే సరికి బీద అరుపులు అరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బాబే అసలు తీవ్రవాది
కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేని అసమర్థ పాలన సాగిస్తున్న చంద్రబాబే అసలైన ఉగ్రవాది అని ఆరోపించారు. తీవ్రమైన వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలి గిరిజనులు అల్లాడిపోతుంటే పట్టించుకోరు కానీ బాక్సైట్‌ తవ్వకాలకు మాత్రం ఆ గిరిజనుల భూములు లాక్కోవడానికి పథక రచన చేస్తున్నారని ఆరోపించారు. వారి హక్కుల కోసం పోరాడుతున్న వైయస్‌ఆర్‌సీపీ పార్టీని, మా నాయకులను ఉగ్రవాదులు, తీవ్రవాదులుగా ముద్రవేస్తున్నారని మండిపడ్డారు. జనాల మధ్య నిర్మిస్తున్న ఆక్వా పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మా నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్ధతు ప్రకటిస్తే.... అభివృద్ధిని అడ్డుకుంటున్నాడంటూ ఎల్లో మీడియా  ద్వారా అసత్య ప్రచారానికి పాల్పడటం బాబుకే చెల్లిందన్నారు. 

కరువుపై కపట నాటకం
ఆక్వా పార్కు మొదలైనప్పుడు ముందుగా వ్యతిరేకించింది టీడీపీ ఎమ్మెల్యేనని, వారు కూడా తీవ్రవాదులేనా అని ప్రశ్నించారు. ఆక్వా పార్కును మేమెప్పుడూ వద్దనలేదని కాకపోతే సముద్రానికి దగ్గర్లో నిర్మించుకోవాలన్నారు. కిరణ్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు సెక్రటేరియట్‌ సాక్షిగా చేసిన లాబీయింగ్‌లు ప్రజలందరికీ తెలుసున్నారు. అనంతపురం జిల్లాలో రెయిన్‌గన్‌లతో వ్యవసాయం చేసిన మీరు కరువును తీరం దాటించామని గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు కరువు మండలాలను ఎలా ప్రకటించారని నిలదీశారు. మీరు, మీ ఎమ్మెల్యేలు కరువుపై పరస్పర విరుద్ధ ప్రకటనలు గుప్పిస్తూ ప్రజలను మోసం చేయడం నిజం కాదా అని అడిగారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తులు ఇంతగా దిగజారిపోయి ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి సేకరించిన భూములతో ప్లాట్ల వ్యాపారం చేయడం అన్యాయమన్నారు. 
Back to Top