స్వర్ణయుగపు పాలన ఆరంభమైన రోజది..

14–05–2018, సోమవారం 

ఏలూరు తూర్పు లాకులు, పశ్చిమగోదావరి జిల్లా

నాన్నగారి పాదాల చెంత ప్రారంభమైన నా
పాదయాత్ర అశేష ప్రజానీకపు అండదం డలతో అలుపే తెలియకుండా అప్పుడే 2,000 కిలోమీటర్లు
దాటబోతోందా.. అన్న ఉద్వేగభరిత వాతావరణంలో, సర్వమత ప్రార్థనలతో ఈ రోజు పాదయాత్ర ప్రారంభించాను.

మే 14.. ఈ రోజుకో విశిష్టత ఉంది.
అప్పటి వరకు సాగిన ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడుతూ.. నవశకానికి నాంది పలికిన
రోజది. సంక్షేమం అంటే ఏమిటో.. అభివృద్ధి అంటే ఏమిటో చవిచూపించిన స్వర్ణయుగపు పాలన
ఆరంభమైన రోజది. దశాబ్దకాలపు కరువు కాట కాలకు ముగింపా అన్నట్టుగా.. వరుణుడు
కరుణిస్తుండగా.. నేటికి సరిగ్గా 14 సంవత్సరాల కిందట.. 14వ ముఖ్యమంత్రిగా.. 14వ తేదీన నాన్నగారు ప్రమాణ
స్వీకారం చేసిన రోజు. నాన్నగారి ప్రజా ప్రస్థానం.. చెల్లి షర్మిల మరో ప్రజా
ప్రస్థానం.. నా ప్రజా సంకల్ప యాత్ర.. మూ డింటికీ పశ్చిమగోదావరి జిల్లాతో అవినాభావ
సంబంధముంది. సరిగ్గా పదిహేనేళ్ల కిందట నాన్నగారు, ఐదేళ్ల కిందట సోదరి షర్మిల, నేడు నేను.. మే 14న పాదయాత్రలతో ఈ జిల్లా
ప్రజలతో మమేకం కావడం యాదృచ్ఛికం. చెల్లి మరో ప్రజా ప్రస్థానం సైతం ఇదే జిల్లాలో మే
నెలలోనే 2,000 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. నాన్నగారి పాదయాత్రలో ఈ
జిల్లాలో మొట్టమొ దటి బహిరంగ సభ 2003, మే 14నే జరగడం.. ఆ మరుసటి
సంవత్సరం మే 14నే
ముఖ్యమంత్రి గా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం దైవేచ్ఛ. 

ఉదయం
పాదయాత్ర సాగుతుండగా కలకుర్రు గ్రామానికి చెందిన అశోక్‌కుమార్‌ అనే సోదరుడు
పసిబిడ్డను భుజాన వేసుకుని భార్య తో పాటు వచ్చి కలిసి ‘అన్నా.. మా కుటుంబాన్ని
వెలేశారన్నా’ అంటూ
బావురుమన్నాడు. ఎందు కని అడిగితే.. నా పాదయాత్రలో అభిమానంగా పాల్గొనడమే కారణమట.
నాకు స్వాగతం పలికినందుకు మత్స్యకార సొసైటీలో వారికున్న వాటాలను తీసేయడమే కాకుండా, వారి వద్ద పనిచేసేవారిని
సైతం మాన్పించారట. ఇదంతా అధికారపార్టీ నాయకుల దుర్మార్గమేనని, తమకేమైనా ఫర్వాలేదని, ప్రాణాలు పోయినా మీ వెంటే
మేమంటూ అతను చెబుతుంటే.. ఆ అభిమానానికి చలించి పోయాను. ఈ పచ్చ ప్రజా ప్రతినిధులు
తమ ప్రాబల్యాన్ని పెంచుకోవ డానికి, కొల్లేరు గ్రామాలను
గుప్పెట్లో పెట్టుకో వాలనే దురుద్దేశంతో గ్రామ కట్టుబాట్లనే సంకెళ్లుగా మార్చడం
దుర్మార్గం. అరాచకాలకు పాల్పడు తున్న తన ఎమ్మెల్యేలను కట్టడి చేయాల్సిన బాధ్యతను
విస్మరించి.. బాగా పనిచేస్తున్నారంటూ ర్యాంకులిచ్చి ప్రోత్సహిం చడం బాబుగారికే
చెల్లు. 

మధ్యాహ్న
శిబిరం వద్ద రజక సంఘం రాష్ట్ర ప్రతినిధులు.. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన
గజవెల్లి చెన్నారావుతో వచ్చి కలిశారు. ఆ సోదరుడిది నిరుపేద రజక కుటుంబం. నాన్న
లేడు.. తల్లి కూలీ. ‘అన్నా..
బీకామ్‌ చదివిన నేను బాబొస్తే జాబొస్తుందన్న ఆశతో వ్యాయామ విద్య కూడా చదివాను. ఆశ
నిరాశే అయింది. గతేడాది ఈ రాష్ట్రం తరఫున ఎవరెస్టు పర్వతారోహణ చేశాను.
ముఖ్యమంత్రిగారు స్వయంగా అభినం దించి, ‘సాహసానికి నేనిచ్చే కానుక’.. అంటూ రూ.10 లక్షలు ఇస్తానని, ఉద్యోగాల్లో ప్రాధాన్యత
ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు. 10 లక్షల డబ్బూ రాలేదు.
గత్యంతరంలేక కులవృత్తినే నమ్ముకుని బతుకుతున్నాను’ అని ఆ యువకుడు తీవ్ర నిరాశ
వ్యక్తం చేశాడు. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అత్యంత సాహసోపేతంగా
ఎవరెస్టును అధిరోహించిన ఆ బీసీ సోదరుడికి రూ.10 లక్షల బహుమానం, ఉద్యోగ ప్రాధాన్యత.. అంటూ
స్వయంగా మీరే ప్రకటించి మాట తప్పడం మీ మోసకారితనానికి పరాకాష్ట కాదా? రాష్ట్రంలో ఎవరు ఎలాంటి
ప్రతిభ కనబర్చినా దానికి కారణం నేనే అని గొప్పలు చెప్పుకుంటూ.. వారికి గొప్పగొప్ప
నజరానాలు, ఉద్యోగాలు
లాంటి ఇతర వరాలు ప్రకటించి, ప్రచారం
చేసుకోవడం.. ఆ కార్యక్రమ వేదిక దిగిన మరుక్షణం వాటిని గాలికొదిలే యడం మీకు షరా
మామూలైపోయింది. ఇది ప్రతిభను వంచించడంకాక మరేంటి?

వైఎస్‌ జగన్‌

 

Back to Top