జగన్ డీఎన్ఏ విశ్వనీయత, కాంగ్రెస్‌ది వెన్నుపోటు

సబ్బవరం 02 జూలై 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిది కాంగ్రెస్ డీఎన్ఏ అని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యపై శ్రీమతి వైయస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల ప్రసంగించారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ వ్యాఖ్యలకు పదునైన సమాధానాన్ని ఇచ్చారు.

మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీకి అకుంఠిత దీక్షతో సేవ చేసి... కేంద్రం లోనూ రాష్ట్రంలోనూ పార్టీని దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అధికారంలోకి తీసుకొచ్చారని ఆమె చెప్పారు. ఈ విషయాన్ని మరిచి ఆయన పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చి కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. ఇది కాంగ్రెస్ డీఎన్ఏనని ఆమె ఎద్దేవా చేశారు. మహానేత మరణానంతరం ప్రాణాలు విడిచిన వందలాదిమంది కుటుంబాలను పరామర్శిస్తానని మాట ఇచ్చి అందుకోసం శ్రీ జగన్మోహన్ రెడ్డి పార్టీని కూడా వీడిన విషయాన్ని గుర్తుచేశారు. దీన్నే విశ్వసనీయత అంటారు.. ఇదీ జగనన్న డీఎన్ఏ అని పేర్కొన్నారు. ఆమె ఈ వ్యాఖ్య చేసినప్పడు సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. జై జగన్, జోహార్ వైయస్ఆర్ నినాదాలు మిన్నంటాయి. మహానేత పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చి ఇప్పుడిలా చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలంటూ శ్రీమతి షర్మిల ఆవేశంగా వ్యాఖ్యానించారు. డాక్టర్ వైయస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చడమంటే ఆయనను హత్య చేయడమే.. చనిపోయిన వ్యక్తిని మళ్ళీ హత్య చేయగలగడం ఒక్క కాంగ్రెస్ పార్టీకే చెల్లని చెప్పారు.

మాది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే మీదేమిటి కిరణ్ గారు!
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వ్యాఖ్మలను ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. అలాగయితే సోనియాది ఏ లిమిటెడ్ కంపెనీ, మీ పేరిట అరాచకాలుచేస్తున్న మీ తమ్ముడిది ఏ లిమిటెడ్ కంపెనీ అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. ప్రజల కష్టాలు అర్థంచేసుకున్నారా లేదా.. వారి తరఫున నిలబడ్డడా లేదా అనేదే ఓ నాయకుడి ముఖ్యలక్షణమన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి సొంత ఆస్తుల పెంచుకోవడంలో  కిరణ్, బాబు దొందూ దొందే అని అన్నప్పడు కూడా సభికులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. కాంగ్రెస్, టీడీపీ అన్ని అంశాలలో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఎన్నికలలో, రెండు సార్లు ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మాన సమయంలో  కుమ్మక్కయిన ఈ రెండు పార్టీలూ జగననన్న విషయంలో కూడా నీచమైన కుమ్మక్కు రాజకీయాలు నడిపి, సీబీఐ సాయంతో ఆయనను జైలు పాలు చేశారని వివరించారు. మూడో పార్టీ గానీ మూడో వ్యక్తిగానీ ఉండ కూడదనే సిద్ధాంతం వీరిలా వ్యవహరిస్తున్నారన్నారు. జగనన్న బయటుంటే తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందని ఆ రెండు పార్టీలు భావించే జైలులో పెట్టాయన్నారు. బోనులో ఉన్నా సింహం సింహమే ననీ., జగనన్నను ఎవరూ ఆపలేరనీ స్పష్టంచేశారు. జగనన్న త్వరలోనే బయటకొచ్చి రాజన్న రాజ్యం దిశగా నడిపిస్తారని శ్రీమతి షర్మిల చెప్పారు. అప్పటివరకూ జగనన్నను ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తిచేశారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలోనూ,  రానున్న సాధారణ ఎన్నికలలోనూ  జగనన్నను గెలిపిస్తేనే రాజన్న రాజ్యం సాధ్యమని చెప్పారు. ఆయనకేసే ప్రతి ఓటు జగనన్న నిర్దోషని చెబుతుందనీ, ఆయన  బయటకు రావడానికి బాటలు వేస్తుందనీ శ్రీమతి షర్మిల పేర్కొన్నారు.

ఇంకా శ్రీమతి షర్మిల ప్రసంగం.. ఆమె మాటల్లోనే....
అద్భుతమైన పథకాలతో రాజన్న పాలించారు
'అద్భుతమైన పథకాలతో రాజన్న రాష్ట్రాన్ని పరిపాలించారు. జలయజ్ఙంతో ప్రతి ఎకరాకూ నీరివ్వాలనుకున్నారు. రైతన్న ఇన̴్పుట్ సబ్సిడీ ఇచ్చారు. రైతుల్ని 12000 కోట్ల మేరకు రుణ విముక్తుల్ని చేశారు. అంతకు ముందు చంద్రబాబు రూపాయి వడ్డీకి రుణాలిచ్చేవారు. రాజన్న పావలా వడ్డీకే ఇచ్చారు. విద్యార్థులకు తండ్రిలా ఆలోచించారు. ఫీజు రీయింబర్సుమెంటుతో భరోసా కల్పించారు. మన రాష్ట్రంలో ఉచితంగా లక్షలాదిమంది చదువుకునే అవకాశాన్నిచ్చారు. పేదవాడు వైద్యానికి కార్పొరేటు ఆస్పత్రికి వెళ్లేలా చేశారు. మనసున్న వైద్యునిగా ఆరోగ్యశ్రీ పెట్టారు. 108 అంబులెన్ను ఫోను చేసిన 20 నిముషాల్లో వచ్చేది. అన్ని పథకాలూ అద్భుతంగా చేశారు. 47 లక్షల పక్కా ఇళ్ళుకట్టారు. 71 లక్షలమందికి పింఛన్లిచ్చారు. ఏ రోజూ ఏ చార్జీ పెంచలేదు. చార్జీలు పెంచితే పేదవాడిపై భారం పడుతుందని ఆయన భావించడమే దీనికి కారణం. రాజన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్యాస్ సిలిండరు ధర 305 నుంచి రూపాయి కూడా పెరగలేదు. ఆర్టీసీ, మున్సిపల్ పన్నులు పెరగలేదు. చార్జీలు పెంచకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేసిన రికార్డు సీఎంగా నిలిచారు.

విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 20లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందని గుర్తించిన డాక్టర్ వైయస్ఆర్  7000 కోట్ల రూపాయలతో 8లక్షలతో 2009 ఫిబ్రవరిలో ఉత్తరాంధ్ర సుజల స్రంవతికి శంకుస్థాపన చేశారు. ఇది 30 వేల మందికి మంచినీరిచ్చే ప్రాజెక్టు కూడా. 3300 కోట్లు ఖర్చుచేసి పోలవరం ప్రాజెక్టును 38 శాతం పూర్తిచేశారు. ఆయనుండుండే ఈ పాటికి పూర్తయ్యేది. ఈ మూడు జిల్లాలు పోలవరం ఎడమ కాల్వ, బ్యాక్ వాటర్ వాడుకునే పనులు పూర్తయి ఉండేవి. ఆయన వెళ్ళిపోవడంతో అవన్నీ మూలన పడ్డాయి. ప్రస్తుతం దుర్మార్గ ప్రభుత్వం రాజ్యమేలుతోంది. కిరణ్ సర్కారు సుజల స్రవంతికి అనుమతులు కూడా తేలేదు. దీనిని రచ్చ చేసే ఆలోచనలో కిరణ్ సర్కారుంది. రైతులపై ఎందుకింత పగ. కరెంటు లేక, మద్దతు ధర రాక రైతులు విలవిలలాడుతున్నారు.  అన్ని పంటల్లో నష్టం వచ్చిందంటున్నారు. పెట్టుబడులు పెరిగాయి.. అన్ని ధరలూ పెరిగాయి. మద్దతు ధర పెరగలేదు. పరిస్థితి ఇలా ఉంటే ఏ రైతైనా నష్టంపోక ఏమవుతారు.

ఇల్లు గడవడం కష్టమైందని మహిళలు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది, ఫీజు రీయింబర్సుమెంటు కుంటుపడింది. ప్రభుత్వానికి పింఛన్లు పెంచాలన్న ఆలోచనే రాలేదు. ఉన్న పింఛన్లు తీసేశారు. పింఛనర్లను చూస్తే జాలేస్తోంది. ప్రభుత్వానికి రైతులంటే శ్రద్ధ లేదు.. మనసు, మమకారం లేదు. రాజన్న ఉంటే తెల్లకార్డు వారికి 30 కిలోల బియ్యం అందేవి. కరెంటు 9 గంటలు వచ్చేది.  ప్రస్తుతం మూడు గంటలు కూడ అందడం లేదంటున్నారు. పరిశ్రమలకు నెలకు 12 రోజులు పవర్ కట్.  దీనివల్ల వేల పరిశ్రమలు మూతపడ్డాయి. వేలాది మంది రోడ్డున పడ్డారు.  కరెంటు లేకున్నా మూడింతల బిల్లలు వస్తున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం అన్ని చార్జీలను పెంచేసింది. పొద్దున లేస్తే ఏ చార్జీ పెరుగుతుందోననే కబురు వినాల్సివస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

రాజన్న ఉన్నప్పడు డీఎపి రూ. 400 ఉండేది. ఇప్పుడు 1300 అయ్యింది.  కాంప్లెక్సె రూ. 425 ఉండేది ఇప్పుడు 1475 అయ్యింది. పొటాష్ రూ. 232 ఉండేది ఇప్పుడు 895 ఆయ్యింది. అన్ని పన్నులు పెరిగాయి. కరెంటు చార్జీలను రక్తం పిండి వసూలు చేయాలనుకుంటోంది ఈ ప్రభుత్వం.
ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెడితే... చంద్రబాబు కాపాడారు. అవిశ్వాసానికి మద్దతు పలికి ఉంటే ఈ సమస్యలు ఉండేవి కావు. ప్రస్తుతం మైనార్టీలో అంటే 146 మంది సభ్యులు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అయినా అధికారంలో కొనసాగుతోంది. దీనికి కారణం బాబు అండే. ఆయన పాదయాత్ర చేసినపుడు తుగ్లక్ పాలన అన్న బాబు అవిశ్వాసం సమయంలో కూలిపోకుండా కాపాడారు. ఈయనను నాయకుడనాలా.. ఊసరవెల్లి అనాలా?.

కేంద్ర మంత్రి చిరంజీవి తన ప్రజా రాజ్యం పార్టీకి ఓటేసిన 70 లక్షల ఓట్లర్లను పిచ్చోళ్ళను చేసి కాంగ్రెస్ పార్టీకి రాసిచ్చారు. అవిశ్వాసానికి మద్దతు పలకకుండా కోట్ల మందిని చంద్రబాబు మరో రకంగా పిచ్చోళ్ళను చేశారు. ఆయనపై విచారణ జరగకుండా ఉండడానికే ఇలా చేశారు. బాబు, చిరంజీవి ఇద్దరికీ ఒకటే తేడా.. చిరంజీవి బహిరంగంగా అమ్ముడు పోయారు. చంద్ర బాబు మరోలా అమ్ముడు పోయారు. ఒకప్పుడు మామ ఎన్టీ రామారావుకు,  ఇప్పుడు ప్రజలకు వెన్నుపోటు ఫొడిచారు. చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు. పార్టీ పెట్టిన ఎన్టీ రామారావునే  వెలేసిన బాబు  అధికారంలోకి వచ్చి వ్యవసాయం దండగన్నారు. సబ్సిడీలిస్తే ప్రజలు సోమరిపోతులవుతారన్నారు. ఉపకార వేతనాలు అడిగిన విద్యార్థులపై లాఠీ చార్జీ చేయించారు. గ్యాస్ ధరను 145 నుంచి రూ. 305 పెంచారు. రైతులుపయోగించే కరెంటు హార్సు పవర్ ధరను పెంచారు. ఏటా కరెంటు చార్జీలను పెంచుతామని ప్రపంచ బ్యాంకుతో చంద్రబాబు ఒప్పందం చేసుకుని రుణాలు తెచ్చుకున్నారు.  ఉచిత విద్యుత్తు ఇస్తే తీగల బట్టలారేసుకోవాలని ఎద్దేవా చేసిన విషయాన్ని ఎవరూ మరువలేదు. కరెంటు బిల్లుల కోసం రైతులను వేధించారు. ప్రత్యేక ఠాణాలు పెట్టారు. అవమానాలు తట్టుకోలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంటు చార్జీలను నిరసిస్తూ రాజన్న 13 రోజులు దీక్షచేశారు. చివరి రోజున జరిగిన ఆందోళనలో పోలీసు కాల్పులలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు చంద్రబాబు చనిపోయిన వారి కుటుంబాలను కాకుండా వారిని కాల్చిన పోలీసులను పరామర్శించారు.

రెండెకరాలతో తన రాజకీయ జీవితాన్ని మొదలు పెట్టిన చంద్రబాబుకు ఇప్పడు  హెరిటేజ్ దుకాణాలు దేశంలో ఎక్కడ చూసినా ఉన్నాయి. లక్షల విలువ చేసే భూముల్ని ఆయన బినామీలకు పప్పు బెల్లాల్లా పంచేశారు. ఆయనకు చావు తెలివితేటలు ఎక్కువ. అందుకే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి కేసులు లేకుండా చేసుకున్నారు. ఎన్టీఆర్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన బాబు మద్య నిషేధం, కిలో రెండు రూపాయల బియ్యం అనే రెండు వాగ్డానాలను తుంగలో తొక్కారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తను ఇచ్చిన వాగ్దానాలను ఆయన నెరవేర్చలేదు. ఇప్పుడు మళ్లీ ఆడపిల్ల పుడితే రెండు లక్షలిస్తానని తిరుగుతున్నారు. అధికారంలో ఉండగా ఎందుకు చేయలేదంటే సమాధానం లేదు. ఈ సందర్భంగా ఆమె ఒక సామెతను ఉదహరించారు. 'దున్నపోతూ! దున్నపోతూ! ఎందుకు పనిచేయవంటే పగలు ఎండ.. రాత్రి చీకటి అని చెప్పిందట.  చంద్రబాబు అధికారం లేకున్నా పనిచేయరు.. అధికారంలో ఉన్నా పనిచేయరని శ్రీమతి షర్మిల విమర్శించారు.

తాజా వీడియోలు

Back to Top