ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సీఎం అండదండ

హైదరాబాద్:

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆయన సోదరుడు అండదండలు అందిస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. కిరణ్‌ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ మూడేళ్లలో పెద్ద ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ అయిందని‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. స్మగ్లింగ్‌ నిరోధానికి సీఎం కిరణ్ ‌ఎలాంటి చర్యలూ చేపట్టడంలేదని ఆరోపించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వై‌యస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ శాసనసభా‌ పక్షం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

‌ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరు ఎర్రచందన స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిందని పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీఎం ముఖ్య అనుచరులు ఎర్రచందనాన్ని‌ యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడారు.

సమైక్య సింహాన్ని అని తనను తాను అభివర్ణించుకుంటూ తన బొమ్మతో 50 లక్షల టీ షర్టులను కిరణ్‌కుమార్‌రెడ్డి తయారు చేయిస్తున్నారని ఆరోపించారు. ఆ టీ షర్టులకయ్యే ఖర్చును ఎర్రచందనం స్మగర్లే పెడుతున్నారని వారు ఆరోపించారు. రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ కొనసాగుతు‌న్నా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీఎం ఇలా సంపాదించిన డబ్బుతో కొత్త పార్టీ పెట్టడానికి ఆలోచనలు చేస్తున్నారన్నారు.

Back to Top