'చిత్తశుద్ధి ఉంటే బాబు ఆమరణ దీక్ష చేయాలి'

కాకినాడ, 8 ఏప్రిల్‌ 2013: రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడికి ఉంటే ఆమరణ దీక్ష చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సవాల్‌ చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మతో పాటు హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సులో ఐదు రోజులు నిర్వహించిన 'కరెంట్‌ సత్యాగ్రహం' విరమించిన అనంతరం సోమవారంనాడు తొలిసారిగా ఆయన కాకినాడ వచ్చారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మీడియాతో మాట్లాడారు.

'వస్తున్నా.. మీ కోసం' అంటూ చంద్రబాబు చేస్తున్న పాదయాత్ర బూటకం అని ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అభివర్ణించారు. కాంగ్రెస్‌, టిడిపి విప్‌లు ధిక్కరించి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా నిలబడిన ఎమ్మెల్యేలను దమ్ముంటే అనర్హులుగా ప్రకటించాలని చంద్రశేఖ‌రరెడ్డి సవాల్‌ చేశారు. ఎన్నికలకు తామంతా సిద్దంగా ఉన్నామని ఆయన అన్నారు.
Back to Top